Home Loan: హోంలోన్ చెల్లించడంలో విఫలమైతే ఏమౌతుంది?

ఒక్కోసారి గృహరుణం తిరిగి చెల్లించలేని పరిస్థితి రావొచ్చు. మరి అలాంటప్పుడు బ్యాంకులు మన రుణాన్ని ఎలా వసూలు చేస్తాయి? మన ముందున్న మార్గాలేంటో చూద్దాం..!

Updated : 18 Oct 2021 13:18 IST

ఓ కొత్త ఇంటికి యజమాని అయితే ఆ ఆనందమే వేరు. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వారికైతే ఓ జీవితాశయం నెరవేరినంత సంతోషం. అయితే, ఈ వర్గం వారు డబ్బు కూడబెట్టి ఇల్లు కొనడం కొంత కష్టమే. తప్పనిసరిగా గృహరుణం తీసుకోవాల్సి వస్తుంది. అయితే, ఉపాధి కోల్పోవడం, ప్రమాదాలు, ఆరోగ్య సమస్యల వంటి అనుకోని సంఘటనలు ఎదురైతే రుణ వాయిదాలు చెల్లించడంలో ఇబ్బందులు తప్పవు. అలా వాయిదాలు.. వాటిపై వడ్డీ, రుసుములు పెరిగి ఓ పెద్ద గుదిబండగా మారతాయి. ఒక్కోసారి తిరిగి చెల్లించలేని పరిస్థితి రావొచ్చు. మరి అలాంటప్పుడు బ్యాంకులు మన రుణాన్ని ఎలా వసూలు చేస్తాయి? మన ముందున్న మార్గాలేంటో చూద్దాం..!

ఇదే పెద్ద సంకేతం..

సాధారణంగా ఇంట్లో కొన్ని ఇబ్బందులు ఏర్పడి ఒక్కోసారి ఒకటి లేదా రెండు ఈఎంఐలు చెల్లించడం ఆలస్యమవుతుంది. బ్యాంకులు చిన్న చిన్న హెచ్చరికలు జారీ చేసి వదిలేస్తాయి. కానీ, వరుసగా మూడు నెలల పాటు ఈఎంఐ చెల్లింపుల్లో జాప్యం జరిగిందంటే ప్రమాదం ముంచుకొస్తోందని సంకేతం. బ్యాంకులు వెంటనే అప్రమత్తమై మీ రుణాన్ని నిరర్ధక ఆస్తి(ఎన్‌పీఏ)గా గుర్తిస్తాయి. మీకు నోటీసులు జారీ చేస్తాయి. ఆ తర్వాత కూడా మీరు స్పందించకపోతే.. మిమ్మల్ని దివాలాదారుగా గుర్తించి ఇంటికి నోటీసులు పంపుతాయి. ఈ క్రమంలో మీ సిబిల్‌ స్కోర్‌ సైతం క్రమంగా దెబ్బతింటుంది.

చివరి 60 రోజులు..

ఇక మీరు రుణాన్ని తిరిగి చెల్లించలేరని బ్యాంకు భావిస్తే తదుపరి చర్యలకు సిద్ధమవుతుంది. సర్ఫేసీ చట్టం ప్రకారం 60 రోజుల గడువుతో తుది నోటీసు పంపుతుంది. మీరు రుణ వాయిదాలను చెల్లించడానికి ఇదే మీకు చివరి అవకాశం. ఒకవేళ విఫలమైతే.. చట్ట ప్రకారం ఆ ఆస్తిని రుణమిచ్చిన సంస్థ స్వాధీనం చేసుకోవచ్చు. ఏ కోర్టు, చట్టపరమైన జోక్యం అవసరం లేకుండానే ఈ పనిచేయవచ్చు. 

అయితే, బ్యాంకు ఇచ్చిన చివరి 60 రోజుల గడువులో మీరు బ్యాంకు అధికారుల దగ్గరకు వెళ్లి వివరణ ఇచ్చే అవకాశం ఉంటుంది. రాతపూర్వకంగా మీ పరిస్థితిని వారికి తెలియజేసి వారిని ఒప్పించే వెసులుబాటు ఉంది. జరిమానాతో మరికొంతకాలం నోటీసు పీరియడ్‌ను పొడిగించే అవకాశం ఉంది. కానీ, అందుకు వారు నిరాకరిస్తే చేసేదేమీ లేదు. ఈ 60 రోజుల గడువు ముగుస్తున్న సమయంలో ఏదో ఒకరోజు రికవరీ ఏజెంట్లు మీ తలుపు తట్టొచ్చు. అయితే, ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం.. మీకు ఇక్కడ కొన్ని హక్కులు ఉంటాయి.

* రికవరీ ఏజెంట్ల గుర్తింపును ధ్రువీకరించుకునేందుకు మీరు ఆధారాలు అడగొచ్చు. వారు వారి గుర్తింపు కార్డులతో పాటు, బ్యాంకు నుంచి ఆథరైజేషన్‌ లెటర్‌ తీసుకొని రావాల్సి ఉంటుంది. 

* ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల మధ్య మాత్రమే వారు ఇంటికి రావాలి. కేవలం దివాలాదారుగా గుర్తించిన వ్యక్తితో మాత్రమే మాట్లాడాలి. ఇతర కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి వీలు లేదు.

* రికవరీ ఏజెంట్‌ అగౌరవంగా ప్రవర్తించడానికి వీలులేదు. ఎలాంటి అభ్యంతరకరమైన పదజాలం వాడొద్దు.

వేలం ప్రక్రియ షురూ..

తర్వాతి ప్రక్రియలో భాగంగా రుణమిచ్చిన సంస్థలు శాస్త్రీయంగా ఇంటి వాస్తవ విలువను అంచనా వేస్తాయి. తర్వాత వేలం ప్రక్రియను మొదలుపెడతాయి. వేలానికి సంబంధించిన వివరాలను దినపత్రికలో ప్రచురిస్తాయి. వేలంలో పేర్కొన్న విలువ తక్కువ అని యజమాని భావిస్తే సంస్థలను సంప్రదించొచ్చు. 

ఒకసారి ఇలా ఆస్తిని స్వాధీనం చేసుకున్న సంస్థలు దాన్ని విక్రయించడం లేదా లీజుకు ఇవ్వడం లేదా ఆ ఆస్తిపై హక్కులను వేరే సంస్థకు అప్పగించొచ్చు. ఇది వేలం ద్వారా జరుగుతుంది. సంబంధిత ఇంటిని వేలంలో విక్రయించగా, వచ్చిన మొత్తం నుంచి బ్యాంకు ముందుగా తన రుణ బకాయిలను సర్దుబాటు చేసుకుంటుంది. అదనంగా ఏమైనా మిగిలితే ఆ మొత్తాన్ని రుణ చెల్లింపుల్లో విఫలమైన వ్యక్తికి తిరిగి ఇచ్చేస్తుంది.

మీ ముందున్న ఓ మార్గం..

మీ ఇంటిని మీరే విక్రయించండి..

ఇది కొంచెం కష్టమే. అయితే, అవకాశం మాత్రం లేకపోలేదు. మిమ్మల్ని దివాలాదారుగా గుర్తించిన వెంటనే మీ ఇంటిని మీరే విక్రయించేందుకు ప్రయత్నించండి. వచ్చే సొమ్ముతో రుణాన్ని చెల్లించేయండి. బ్యాంకులు కేవలం వారి రుణాన్ని రికవరీ చేసుకోవడంపైనే దృష్టి పెడతాయి. కాబట్టి మీ ఇంటికి సరైన ధర రావాలన్న దానిపై వారికి ఏమాత్రం ఆసక్తి ఉండకపోవచ్చు. మీకు మీరే విక్రయిస్తే ఎక్కువ ధర రావొచ్చు. పైగా వేలం ప్రక్రియ చాలా ఆలస్యమవుతుంది.

ఇలాంటి పరిస్థితి రావొద్దంటే ఏం చేయాలి..

ఈఎంఐకి 40 శాతం: మీ ఈఎంఐలు ప్రతినెలా మీ చేతికొచ్చే ఆదాయంలో 40 శాతానికి మించకుండా చూసుకోండి. ఇంతకంటే మించితే చిన్న ఆర్థిక సమస్య తలెత్తినా.. రుణాలు పేరుకుపోయి గుదిబండగా మారతాయి. 

వీలైనంత ఎక్కువ డౌన్‌పేమెంట్‌ చెల్లించండి: ఇంటిని కొనుగోలు చేసేటప్పుడే వీలైనంత ఎక్కువ డౌన్‌పేమెంట్‌ చెల్లించేందుకు ప్రయత్నించండి. అప్పుడు రుణ మొత్తం తక్కువగా ఉంటుంది కాబట్టి పెద్దగా భారం కాదు. వీలైతే 40 శాతానికి పైగా డౌన్‌పేమెంట్‌ కింద చెల్లించండి. 

రుణాన్ని పునర్‌వ్యవస్థీకరించండి: ప్రతినెలా ఈఎంఐ చెల్లించడం కష్టంగా అనిపిస్తే వెంటనే దాన్ని పునర్‌వ్యవస్థీకరించండి. వాయిదా మొత్తాన్ని తగ్గించుకొని.. కాలపరిమితిని పెంచుకోండి.

ఇతర పెట్టుబడులను ఉపసంహరించుకోండి: ఈ మార్గాన్ని అత్యవసరమైతే తప్ప పరిగణనలోకి తీసుకోవద్దు. ఎందుకంటే ఒక్కో పెట్టుబడికి ఒక్కో లక్ష్యం ఉంటుంది. దీని వల్ల అవన్నీ దెబ్బతినే ప్రమాదం ఉంది. ఒకవేళ పెద్ద సమస్యలేమీ రావనుకుంటే.. ఎఫ్‌డీ, ఇన్సూరెన్స్‌, పీపీఎఫ్‌, ఈపీఎఫ్‌, మ్యూచువల్‌ ఫండ్స్‌ వంటి పథకాల్లో చేసిన మదుపును ఉపసంహరించుకొని వచ్చిన సొమ్ముతో రుణాన్ని చెల్లించేందుకు ప్రయత్నించండి.

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని