Investment on Gold: ‘పడితే’ పసిడిని ఓ పట్టు పట్టాల్సిందే..!

ఈ సమయంలో బంగారంలో పెట్టుబడులు పెట్టడం ఎంతవరకు సురక్షితం...

Published : 11 Jun 2022 11:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బంగారం (Gold) ధరలకు అనుగుణంగా ట్రేడయ్యే గోల్డ్‌ ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్ల (Gold ETFs) విలువ గత మూడు నెలల్లో సగటున 3.5 శాతం దిద్దుబాటుకు గురయ్యింది. అయితే, ఏడాది క్రితం దీంట్లో పెట్టుబడులు పెట్టిన వారు మాత్రం మంచి రాబడినే ఆర్జించారు. కానీ, స్వల్పకాలంలో బంగారం ధరలు (Gold Price) తగ్గే అవకాశం ఉన్నట్లు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు! మరి ఈ సమయంలో బంగారంలో పెట్టుబడులు పెట్టడం ఎంతవరకు సురక్షితం?

3 నెలల క్రితం సానుకూలం..

మూడు నెలల క్రితం బంగారంపై పెట్టుబడుల (Investments on Gold)కు వాతావరణం అనుకూలంగా ఉండింది. ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం (Inflation) ఎగబాకింది. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంతో భౌగోళిక రాజకీయ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. కొన్ని ప్రాంతాల్లో కొవిడ్‌ కేసులు మరోసారి విజృంభించాయి. దీంతో చాలా మంది తమ పెట్టుబడులను బంగారం (Gold) వైపు మళ్లించారు. మే నెలలో భారత్‌లో బంగారం దిగుమతులు 667 శాతం పెరిగాయి. 

ఇప్పుడు ప్రతికూలం..

అయితే, ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారాయి. ద్రవ్యోల్బణాన్ని (Inflation) కట్టడి చేయడం కోసం ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్ల (Interest Rates)ను పెంచుతున్నాయి. రానున్న రోజుల్లో రేట్లు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు వెలువడుతున్నాయి. అమెరికా ఫెడరల్‌ రిజర్వు డిసెంబరు నాటికి రేట్లను మరో రెండు శాతం పెంచే అవకాశం ఉందని అంచనా! దీంతో ద్రవ్యోల్బణం (Inflation) అదుపులోకి వచ్చే అవకాశం ఉంది. ఇది బంగారానికి ప్రతికూలాంశం. అందుకే స్వల్పకాలంలో బంగారంపై పెట్టుబడులు (Investments on Gold) ఎలాంటి రాబడినివ్వకపోవచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు. 

మాంద్యం భయాలు ముసురుకుంటున్నాయ్‌..

అమెరికాలో వరుస రేట్ల పెంపు ఆర్థిక మాంద్యాని (Recession)కి దారితీసినట్లు చరిత్ర చెబుతోంది. కొన్నిసార్లు కేంద్ర బ్యాంకులు కఠిన ఆర్థిక విధాన వైఖరిని మధ్యలోనే వదిలేసి తిరిగి సర్దుబాటు వైఖరికి మారాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ద్రవ్యోల్బణ (Inflation) కట్టడికి కేంద్ర బ్యాంకులు అనుసరిస్తున్న రేట్ల పెంపు వ్యూహం ఏమాత్రం దెబ్బకొట్టినా అది బంగారానికి సానుకూలంగా మారుతంది.

మదుపర్లు ఏం చేయాలంటే..?

స్వల్పకాలంలో బంగారంపై పెట్టుబడి ఆశాజనకంగా లేకపోయినప్పటికీ.. మన పోర్ట్‌ఫోలియోలో దీన్ని భాగం చేసుకోవాల్సిందే. ద్రవ్యోల్బణ భయాలను అధిగమించడానికి ఇదొక మంచి మార్గం. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వృద్ధి గాడితప్పినా.. బంగారం మాత్రం మంచి రాబడినిస్తుంది. ఈ నేపథ్యంలో ధరలు ఏమాత్రం పడిపోయినా.. పసిడిని కొని పెట్టుకోవడం ఉత్తతమని నిపుణులు సూచిస్తున్నారు.

ఈక్విటీ, డెట్‌, గోల్డ్‌తో కూడిన పోర్ట్‌ఫోలియోలో బంగారానికి 10-15 శాతం వాటా ఉండాల్సిందే. ఒకవేళ అంతకంటే తక్కువగా ఉంటే.. ధరలు తగ్గిన ప్రతిసారీ దశలవారీగా బంగారాన్ని కొనిపెట్టుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. బంగారం కొనుగోలును పిల్లల పెళ్లిళ్ల వంటి లక్ష్యానికి జోడించుకుంటే మరింత ప్రయోజనం. అయితే, మీకు బంగారాన్ని వెంటనే నగదుగా మార్చుకోవాల్సిన అవసరం ఉంటే మాత్రం గోల్డ్‌ ఈటీఎఫ్‌లలో మదుపు చేయడం ఉత్తమం. 

కనీసం 8 ఏళ్ల లక్ష్యంతో బంగారంపై పెట్టుబడి పెట్టాలనుకునేవారికి మాత్రం ప్రభుత్వ పసిడి బాండ్లు ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. పెట్టిన పెట్టుబడి వృద్ధి చెందడంతో పాటు ఏటా 2.5 శాతం వడ్డీ కూడా వస్తుంది. అయితే, వీటి నుంచి మధ్యలో నిష్క్రమించడం మాత్రం అంత లాభదాయకం కాదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని