మహాసముద్రం మధ్యలో 1,100 పోర్షే కార్లు.. ఏం జరిగిందంటే?

మంటలంటుకోవడంతో అట్లాంటిక్‌ మహాసుముద్రంలో ఓ భారీ నౌకను వదిలేశారు. అందులో విలాసవంతమైన కార్లు చాలా ఉండిపోయాయి....

Updated : 18 Feb 2022 11:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ఫెసిలిటీ ఏస్‌’ అనే పెద్ద నౌకలో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. అందులో ఉన్న 22 మంది సిబ్బందిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ఆ నౌకలో పోర్షే, బెంట్లీ, ఆడీ, లాంబోర్గిని వంటి 3,965 విలాసవంతమైన కార్లు ఉన్నట్లు సమాచారం. అట్లాంటిక్‌ మహాసముద్రం మధ్యలో అజోర్స్‌ ద్వీపాలకు కొద్ది దూరంలో బుధవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందిన వెంటనే ఆ ప్రాంతానికి సమీపంలో ఉండే పోర్చుగీసు నావికా, వాయుసేన సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. సిబ్బందిని సురక్షితంగా ఓ హోటల్‌కు తరలించారు.

ప్రస్తుతం ఫెసిలిటీ ఏస్ సముద్రం మధ్యలో ఓ ‘విగతజీవి’లా తేలుతూ ఉంది. మంటలు ఆర్పి నౌకను ఒడ్డుకు చేర్చేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. జర్మనీలోని వోల్ఫ్స్‌బర్గ్‌లో ఉన్న ఫోక్స్‌వ్యాగన్‌ గ్రూపునకు చెందిన ఓ తయారీ కేంద్రంలో పోర్షే, ఆడీ, లాంబోర్గినీ సహా ఫోక్స్‌వ్యాగన్‌ వాహనాలు ఉత్పత్తి అవుతున్నాయి. సమీపంలో ఉన్న ఎండెన్‌ పోర్టు నుంచి వాటిని అమెరికాలోని డావిస్‌విల్లే పోర్టుకు తరలించేందుకు నౌక బయలుదేరగా.. మధ్యలో ఈ ప్రమాదం జరిగింది.

దాదాపు 1,100 పోర్షే కార్లు నౌకలో ఉన్నట్లు కంపెనీ అధికార ప్రతినిధి ల్యూక్ తెలిపారు. అవి అందాల్సిన వినియోగదారులకు డీలర్ల ద్వారా సమాచారాన్ని చేరవేసినట్లు పేర్కొన్నారు. పోర్షే కార్లు గతంలోనూ ఓసారి సముద్రంలో మునిగిపోయాయి. గ్రాండే అమెరికా అనే భారీ నౌక 2019లో మంటలు అంటుకొని మునిగిపోయింది. దాంతోపాటే అందులో ఉన్న ఆడీ, పోర్షే కార్లూ మునిగిపోయాయి. లాంబోర్గిని వర్గాలు మాత్రం తాజా ఘటనపై స్పందించడానికి నిరాకరించాయి.

ఫెసిలిటీ ఏస్‌ పరిమాణం దాదాపు మూడు ఫుట్‌బాల్‌ స్టేడియాలకు సమానంగా ఉంటుంది. నౌకను ఒడ్డుకు చేర్చేందుకు కావాల్సిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నట్లు పోర్చుగీసు నేవీ తెలిపింది. ఇప్పటివరకైతే.. నౌక వల్ల ఎలాంటి కాలుష్యం జరగలేదని అధికారులు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని