మార్కెట్లో విజయం సాధించాలంటే..

స్టాక్‌ మార్కెట్‌... ఇప్పుడు చాలామంది  దీని గురించే మాట్లాడుకుంటున్నారు.. అందులో పెట్టుబడుల గురించి ఆలోచిస్తున్నారు. మార్కెట్‌ సూచీలు రికార్డులు సృష్టిస్తున్న నేపథ్యంలో కొత్త మదుపరులు గతంలో ఎన్నడూ లేని విధంగా మార్కెట్లోకి ప్రవేశిస్తున్నారు. అప్పులు చేసి మరీ మదుపు చేస్తున్న వారూ ఉంటున్నారు

Published : 02 Jul 2021 01:46 IST

స్టాక్‌ మార్కెట్‌... ఇప్పుడు చాలామంది  దీని గురించే మాట్లాడుకుంటున్నారు.. అందులో పెట్టుబడుల గురించి ఆలోచిస్తున్నారు. మార్కెట్‌ సూచీలు రికార్డులు సృష్టిస్తున్న నేపథ్యంలో కొత్త మదుపరులు గతంలో ఎన్నడూ లేని విధంగా మార్కెట్లోకి ప్రవేశిస్తున్నారు. అప్పులు చేసి మరీ మదుపు చేస్తున్న వారూ ఉంటున్నారు. అయితే, నష్టభయం ఉన్న స్టాక్‌ మార్కెట్లో ఏ వ్యూహాలు పాటించాలి.. అనేది తెలుసుకున్నప్పుడే.. లాభాలు కళ్లచూడగలం.అందుకోసం ఏం చేయాలి? చూద్దామా!

మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ గణాంకాల ప్రకారం చూస్తే.. ఏప్రిల్‌ 2020-జనవరి 2021 మధ్య కాలంలో దాదాపు 1.07 కోట్ల కొత్త డీమ్యాట్‌ ఖాతాలు ప్రారంభం అయ్యాయి. అంతకు క్రితం మూడు ఆర్థిక సంవత్సరాలతో పోలిస్తే.. ఈ సంఖ్య దాదాపు రెట్టింపుగా చెప్పొచ్చు. కరోనా పరిణామాల నేపథ్యంలో లాక్‌డౌన్‌, ఇంటి నుంచి పని తదితర కారణాలు ఎంతోమంది ఔత్సాహికులు స్టాక్‌ మార్కెట్‌పై దృష్టి సారించారు.

గత ఏడాదిన్నర కాలంగా ఉద్యోగులు ఇంటి నుంచి పని చేస్తుండటం, లాక్‌డౌన్‌తో పని వేళలు తగ్గడంతో మిగులు సమయం పెరిగింది. ఇదే సమయంలో ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడి పెట్టడం ద్వారా తమకు రెండో ఆదాయం ఆర్జించేందుకు వీలవుతుందని భావించారు. చాలామంది కొత్తతరం మదుపరులు స్వల్పకాలంలోనే ఎంతోకొంత లాభాలు సంపాదించిన సంగతీ ఇక్కడ గమనార్హం. అయితే, మార్కెట్‌ ఎప్పుడూ ఒకేలాగా ఉండదన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. అందుకే, ప్రతి రూపాయిని కాపాడుకునేందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలి.
ఈక్విటీల్లో మదుపు చేసేందుకు కచ్చితంగా ఇలాంటి నిబంధనలుపాటించాలి అనేది ఏదీ ఉండదు. కానీ.. కొన్ని సూత్రాలు, వ్యూహాలు మాత్రం  ఆచరించాల్సిందే.

నాణ్యతకే తొలి ప్రాధాన్యం

ఈక్విటీల్లో మదుపు చేసే వారు రకరకాలుగా ఉంటారు. కొంతమంది ఏడాది, రెండేళ్ల కోసం పెట్టుబడి పెడితే.. మరికొందరు 5-7 ఏళ్లకు మంచి కొనసాగుతారు. వ్యవధి ఎంత ఉన్నా.. కంపెనీల ఎంపికలో మాత్రం కొన్ని అంశాలను గుర్తు పెట్టుకోవాల్సిందే.. ప్రతి షేరుకూ కొంత చరిత్ర ఉంటుంది. దాన్ని గమనించాలి. ఎంత మేరకు లాభాలు ఇచ్చింది.. ఆ సంస్థ  ఆదాయంలో వృద్ధి ఉందా?లాంటి అంశాలను క్షుణ్నంగా పరిశీలించాలి.
 

వ్యాపారం.. యాజమాన్యం..

మీరు మదుపు చేయాలనుకుంటున్న సంస్థ చేస్తున్న వ్యాపారం ఏమిటి? దాని యాజమాన్యం దానిని ఎలా నిర్వహిస్తోందన్నది ప్రధానంగా చూడాలి. మంచి యాజమాన్యం ఉన్న సంస్థలే దీర్ఘకాలం నిలదొక్కుకుంటాయని మర్చిపోవద్దు. అందుకే, షేర్లను కొనేటప్పుడు కేవలం సంస్థ వ్యాపారాన్ని మాత్రమే చూడకుండా.. యాజమాన్యం విధానాలు, వారి అకౌంటింగ్‌ పద్ధతులు, చిన్న మదుపరులపై వారు ఎలాంటి దృష్టితో ఉంటారు.. ఇలాంటి ఎన్నో అంశాలను పరిశీలించాలి. ఆ తర్వాతే కంపెనీలను ఎంచుకోవాలి.
 

పోటీలో విజేతగా..

స్టాక్‌ మార్కెట్‌ గురించి ఇప్పటికే లెక్కలేనంత సమాచారం అందుబాటులో ఉంది. పెట్టుబడి గురువులు ఏ షేర్లను ఎంచుకోవాలని సలహాలు ఇస్తూనే ఉంటారు. అయితే, కంపెనీలకు ఎంచుకునేందుకు ఇదొక్కటే కారణం కాకూడదు. ఆయా కంపెనీలు ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఏ మేరకు నిలదొక్కుకుంటున్నాయి.. తన పోటీదార్లతో పోలిస్తే.. విజేతగా నిలుస్తోందా? దాని శక్తి ఏమిటి? ఆ విభాగంలోని ఇతర సంస్థలతో పోలిస్తే ఆదాయంలో వృద్ధి ఏమాత్రం ఉంటోంది..  ఆ సంస్థలో కొనసాగితే దీర్ఘకాలంలో సంపద వృద్ధికి తోడ్పడుతుందా అనే అంశాలను ఇక్కడ పరిగణించాలి.
 

లెక్కలు చూసుకోవాలి..

స్వల్ప శాతంలో నష్టపోయినప్పుడు.. దాని నుంచి కోలుకోవడం సులభమే. ఉదాహరణకు మీ పెట్టుబడిని 20శాతం నష్టపోయారనుకుందాం.. అప్పుడు లాభం 25శాతం వస్తే సరిపోతుంది. కానీ.. పెట్టుబడిలో 50శాతం నష్టపోతే.. మళ్లీ మన పెట్టుబడి మనకు రావాలంటే.. వృద్ధి 100శాతం ఉండాలి. కాబట్టి, పెట్టుబడిని  నష్టపోకూడదు అనే ఆలోచనే ఎప్పుడూ మనల్ని నడిపించాలి. అయితే, స్టాక్‌ మార్కెట్లో నష్టభయం ఎప్పుడూ అంతర్లీనంగా ఉండే ఉంటుంది. అందుకే, పెట్టుబడిని కాపాడుకుంటూ.. లాభాలు సంపాదించడం అన్నదానిపైనే అధిక దృష్టి పెట్టాలి.
ఈక్విటీ మార్కెట్లలో తొలి దశలో ఉన్నవారు.. తమ కష్టార్జితాన్ని మదుపు చేసే విషయంలో అప్రమత్తతో ఉండాలి. అవసరమైతే నిపుణుల పర్యవేక్షణలో మదుపు చేసేందుకు ప్రయత్నించాలి. అప్పుడే.. దీర్ఘకాలంలో మంచి సంపదను సృష్టించేందుకు   ఈక్విటీలు మీకు తోడుంటాయి.

- త్రిదీప్‌ భట్టాచార్య, సీనియర్‌ పోర్ట్‌ఫోలియో మేనేజర్‌, యాక్సిస్‌ ఏఎంసీ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని