​​​​​LIC Jeevan Umang: ఈ పాలసీతో 100 ఏళ్లు వచ్చే వరకు ఆదాయం!

ప్రభుత్వ బీమా రంగ సంస్థ ఎల్‌ఐసీ ఎప్పటికప్పుడు సామాన్యులను దృష్టిలో పెట్టుకొని కొత్త పథకాలతో ధీమా కల్పిస్తోంది.

Updated : 26 Oct 2021 13:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రభుత్వ బీమా రంగ సంస్థ ఎల్‌ఐసీ ఎప్పటికప్పుడు సామాన్యులను దృష్టిలో పెట్టుకొని కొత్త పథకాలతో ధీమా కల్పిస్తోంది. అందులో భాగంగా తీసుకొచ్చిన జీవన్‌ ఉమంగ్‌ అనే పథకానికి భారీ ఆదరణ లభిస్తోంది. దీంట్లో పాలసీదారుడి కుటుంబ సభ్యులకు ఆర్థిక భరోసాతో ఉంటుంది. అలాగే పాలసీ మొత్తం ప్రీమియంలు పూర్తిగా చెల్లిస్తే ఫించను తరహాలో పాలసీలో నిర్దేశించిన కాలపరిమితికి ప్రయోజనాలు కూడా అందుతాయి.

పాలసీ వివరాలు..

క్లెయిమ్‌ కనీస హామీ మొత్తం : రూ.2 లక్షలు

గరిష్ఠ హామీ మొత్తం : పరిమితి లేదు

ప్రీమియం చెల్లిండానికి కాల పరిధి(ఏళ్లలో) : 15, 20, 25, 30 

పాలసీ పరిధి : (100 - పాలసీలోకి ప్రవేశించిన నాటికి వయస్సు) ఏళ్లు

కనీస వయస్సు : 90 రోజులు

గరిష్ఠ వయస్సు : 55 ఏళ్లు

ప్రీమియం చెల్లించడం పూర్తయ్యే నాటికి ఉండాల్సిన కనీస వయస్సు : 30 ఏళ్లు

ప్రీమియం చెల్లించడం పూర్తయ్యే నాటికి ఉండాల్సిన గరిష్ఠ వయస్సు : 70 ఏళ్లు

పాలసీ మెచ్యూరిటీకి గరిష్ఠ వయస్సు : 100 ఏళ్లు

కాలపరిమితి విషయానికి వస్తే ఉదాహరణకు ఒక వ్యక్తి ప్రీమియంలు చెల్లించడానికి 30 ఏళ్ల పరిధితో పాలసీ తీసుకుంటే వారికి ఉండాల్సిన వయస్సు 40. అంటే.. ప్రీమియం చెల్లింపులు పూర్తయ్యే నాటికి 70 ఏళ్ల వయస్సు వస్తుంది. 70 ఏళ్ల తర్వాత ప్రీమియం చెల్లించే అవకాశం లేదు కాబట్టి అక్కడితో పాలసీ పరిధి పూర్తయి ప్రయోజనాలు అందడం ప్రారంభమవుతుంది. ఒకవేళ 15 ఏళ్లపాటు ప్రీమియం చెల్లించేలా పాలసీ తీసుకోవాలంటే వయస్సు 55 ఏళ్ల లోపు ఉండాలి. ఇక పుట్టిన మూడు నెలల తర్వాత పిల్లలకు ఈ పాలసీ తీసుకుంటే తప్పనిసరిగా 30 ఏళ్లు ప్రీమియం చెల్లించాలి. అంటే వారి వయస్సు 30 ఏళ్లు పూర్తి కాగానే వారికి ఏటా ప్రయోజనాలు అందటం మొదలవుతాయి.

పాలసీదారుడు మరణిస్తే..

ఒకవేళ పాలసీ కొనుగోలు చేసిన తొలి ఐదేళ్లలో మరణిస్తే.. పాలసీ హామీ మొత్తాన్ని నామినీకి అందజేస్తారు. ఒకవేళ ఐదేళ్ల తర్వాత మరణిస్తే.. హమీ మొత్తంతో పాటు లాయల్టీ బోనస్‌ కూడా అందుతుంది.

అన్ని ప్రీమియంలు చెల్లిస్తే ప్రయోజనాలు..

ఒకవేళ పాలసీదారులు అన్ని ప్రీమియంలు చెల్లిస్తే.. ప్రీమియం చెల్లించిన తేదీ ముగిసిన నాటికి పాలసీ మెచ్యూరిటీ వరకు ఏటా హామీ మొత్తంలో 8 శాతం అందిస్తారు. మెచ్యూరిటీ లోపు పాలసీదారుడు మరణిస్తే హామీ మొత్తాన్ని నామినీకి లేదా కుటుంబ సభ్యులకు అందుతుంది.

ప్రీమియం, హామీ మొత్తం వివరాలు..

ఎల్‌ఐసీ వెబ్‌సైట్‌లో తెలిపిన వివరాల ప్రకరాం.. ఒకవేళ పాలసీదారుడు 25 ఏళ్ల వయసులో రూ.ఐదు లక్షల హామీ మొత్తంతో, 30 ఏళ్ల పాటు ప్రీమియం చెల్లించేలా పాలసీ తీసుకున్నాడనుకుందాం. ఆ వ్యక్తి ఏటా రూ.14,758 ప్రీమియం చొప్పున 55 ఏళ్ల వయసు వచ్చే చెల్లించాలి. అక్కడి నుంచి అతనికి 100 ఏళ్ల వయసు వచ్చే వరకు ఏటా హామీ మొత్తంలో 8 శాతం అందుతుంది. అప్పటికీ జీవించి ఉంటే హామీ మొత్తం, ప్రయోజనాలు కలిపి రూ.63,08,250 అందుతాయి. ఆలోపు మరణిస్తే హామీ మొత్తంతో పాటు లాయల్టీ బోనస్‌ నామినీకి అందజేస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని