కాన్పూర్‌ ఘటనలో ఇద్దరు పోలీసుల అరెస్ట్

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఎనిమిది మంది పోలీసులను పొట్టబెట్టుకున్న కరుడుగట్టిన రౌడీషీటర్‌ వికాస్ దూబే కేసులో...

Updated : 23 Feb 2024 17:44 IST

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఎనిమిది మంది పోలీసులను పొట్టబెట్టుకున్న కరుడుగట్టిన రౌడీషీటర్‌ వికాస్ దూబే కేసులో ఇద్దరు పోలీసులు అరెస్టయ్యారు. వీరిలో ఒకరు చౌబేపూర్‌ పోలీస్‌ స్టేషన్ ఇన్‌చార్జ్‌ వినయ్‌ తివారీ కాగా మరొకరు స్థానిక ఇన్‌స్పెక్టర్‌ కే కే శర్మ. వీరివురు వికాస్‌ దూబేకు సహరించినట్లు ప్రాథమిక విచారణలో తేలడంతో సస్పెండ్‌ చేశారు. తాజా విచారణలో వీరికి వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాలు లభించడంతో వారిని అరెస్టు చేసినట్లు కాన్పూర్‌ సీనియర్ ఎస్పీ దినేష్‌ కుమార్ తెలిపారు. ఇప్పటికే ఈ కేసుతో సంబంధం ఉన్న 68 మంది పోలీసులను విధుల నుంచి తప్పించి పోలీస్‌లైన్స్‌కు పంపినట్లు సమాచారం.

గత శుక్రవారం గ్యాంగ్‌స్టర్ వికాస్‌ దూబేను అరెస్టు చేసేందుకు యూపీ పోలీసులు వెళ్లారు. అయితే ముందుగానే పోలీసుల రాకపై సమాచారం అందుకున్న దూబే వర్గీయులు వారిపై తమ వద్దనున్న ఏకే-47 తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 8 మంది పోలీసులు మృత్యువాతపడ్డారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన యూపీ పోలీసులు 40 గాలింపు బృందాలు ఏర్పాటుచేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు. మంగళవారం పరీదాబాద్‌లోని ఓ హోటల్లో దూబే ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో వారు అక్కడికి చేరుకునే లోపే అతడు తప్పించుకున్నాడు. మరోవైపు దూబే ప్రధాన అనుచరుడు అమర్‌ దూబే ఈ రోజు ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతిచెందగా.. మరో ఎన్‌కౌంటర్‌లో శ్యాము బాజ్‌పాయ్‌ అనే అనుచరుడు పోలీసులకు చిక్కాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని