Suicide: అందంగా లేవని భర్త వేధింపులు.. ఉరేసుకుని భార్య బలవన్మరణం

వారిద్దరూ ప్రేమించుకున్నారు. ఇష్టాఇష్టాలను పంచుకున్నారు. వివాహం చేసుకుని ఒక్కటయ్యారు. రెండేళ్లు తిరగకుండానే.. అందంగా లేవంటూ.. అతడు వేధింపులు మొదలు పెట్టాడు.

Updated : 19 Feb 2022 07:23 IST


సునీత

తాండూరు టౌన్‌, న్యూస్‌టుడే: వారిద్దరూ ప్రేమించుకున్నారు. ఇష్టాఇష్టాలను పంచుకున్నారు. వివాహం చేసుకుని ఒక్కటయ్యారు. రెండేళ్లు తిరగకుండానే.. అందంగా లేవంటూ.. అతడు వేధింపులు మొదలు పెట్టాడు. బంధువులు, పెద్దలు సమస్యను పరిష్కరించలేక పోవడంతో చేసేది లేక ఆమె బలవన్మరణానికి పాల్పడింది. తాండూరులో వెలుగు చూసిన ఈ ఉదంతం పోలీసులు తెలిపిన ప్రకారం.. తాండూరు మండలం జిన్‌గుర్తికి చెందిన మహేష్‌, యాలాల మండలం దేవనూరు గ్రామానికి చెందిన సునీత (23) ఇద్దరూ.. ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్లు జీవితం అన్యోన్యంగానే కొనసాగింది. ఆ తర్వాత వారి మధ్య విభేదాలు మొదలయ్యాయి. అందంగా లేవని, భార్యను శారీరకంగా, మానసికంగా నిత్యం వేధించడమే కాకుండా, చేయిచేసుకోవడం ప్రారంభించాడు. తన ఆవేదనను పలు సార్లు కుటుంబ సభ్యులు, బంధువులతో చెప్పుకొని ఆమె విలపించేది. ఇటీవల భర్త వేధింపులు అధికమయ్యాయి. దీంతో చనిపోవాలని నిర్ణయం తీసుకుంది. గురువారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో దూలానికి చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బయటకు వెళ్లిన భర్త తిరిగి వచ్చి చూసే సరికి అప్పటికే ఆమె మృతి చెందినట్లు గుర్తించాడు. విషయాన్ని గోప్యంగా ఉంచాలని ప్రయత్నించినా,. వీలు కాకపోవడంతో మృతురాలి కుటుంబ సభ్యులకు చెప్పాడు. భర్త వేధింపులు తాళలేకనే తన చెళ్లి ఆత్మహత్య చేసుకుందని సోదరి అనిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కరణ్‌కోట్‌ ఎస్‌ఐ మధుసూదన్‌రెడ్డి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని