కుటుంబ కలహాలతో ముగ్గురి సజీవ దహనం

కుటుంబ గొడవల కారణంగా ఇద్దరు పిల్లలు సహా ముగ్గురిపై పెట్రోల్‌ పోసి హతమార్చాడో వ్యక్తి. తర్వాత అతడు కూడా ఆత్మాహుతి చేసుకున్నాడు.

Updated : 09 Feb 2023 05:59 IST

నిందితుడి ఆత్మాహుతి
తమిళనాడులో దారుణం

చెన్నై, న్యూస్‌టుడే: కుటుంబ గొడవల కారణంగా ఇద్దరు పిల్లలు సహా ముగ్గురిపై పెట్రోల్‌ పోసి హతమార్చాడో వ్యక్తి. తర్వాత అతడు కూడా ఆత్మాహుతి చేసుకున్నాడు. ఈ దుర్ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... కడలూరు జిల్లా సెల్లాంకుప్పం వెళ్లిప్పిళ్లైయార్‌ కోవిల్‌ వీధికి చెందిన ప్రకాష్‌కు భార్య తమిళరసి (31), కుమార్తె హాసిని (4 నెలలు) ఉన్నారు. తమిళరసి సోదరి ధనలక్ష్మి, సద్గురు దంపతులకు ఆరు నెలల మగ శిశువు ఉన్నాడు. సద్గురు, ధనలక్ష్మిలు దేవనాంపట్టినంలో ఉంటున్నారు. వీరి కుటుంబ గొడవల కేసు కోర్టు విచారణలో ఉంది. మంగళవారం రాత్రి ధనలక్ష్మి తన అక్క తమిళరసి ఇంటికి వచ్చారు. ఇంట్లో తమిళరసితో పాటు ఆమె అత్త సెల్వి, కుమార్తె హాసిని ఉన్నారు.

బుధవారం ఉదయం ప్రకాష్‌ యథావిధిగా పనికి వెళ్లాడు. అప్పుడు ధనలక్ష్మికి సద్గురు ఫోన్‌ చేసి గొడవపడ్డాడు. తరువాత సరాసరి ప్రకాష్‌ ఇంటికి వచ్చి వాగ్వాదానికి దిగాడు. వెంటనే ద్విచక్రవాహనంలోంచి పెట్రోల్‌ తీసుకొచ్చి ఇంట్లో ఉన్న వారిపై పోసి తలుపులు మూసి నిప్పంటించాడు. తర్వాత తనపై కుమ్మరించుకొని అంటించుకున్నాడు. తమిళరసి, పసిపాప హాసిని, సద్గురు, అతడి ఆరునెలల కుమారుడు చనిపోయారు. ధనలక్ష్మి, సెల్వి ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని