గొడ్డలితో నరికాడు.. సంపులో పడేశాడు

‘మమ్మీని డాడీ సీసాతో కొట్టాడు. మొఖం మీద పొడిచాడు. తమ్ముడిని నీళ్ల ట్యాంకులో పడేశాడు’ అని తన కళ్ల ముందే తండ్రి చేసిన హత్యల తీరుపై రెండున్నరేళ్ల చిన్నారి భయపడుతూ చెప్పిన మాటలివి.

Published : 16 Mar 2023 05:29 IST

భార్య, నెలన్నర కుమారుడిని దారుణంగా హతమార్చిన వ్యక్తి
తండ్రి ఘాతుకాన్ని చూసి పారిపోయిన రెండున్నరేళ్ల కుమార్తె
అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం అనాజ్‌పూర్‌లో ఘటన

అబ్దుల్లాపూర్‌మెట్‌, న్యూస్‌టుడే: ‘మమ్మీని డాడీ సీసాతో కొట్టాడు. మొఖం మీద పొడిచాడు. తమ్ముడిని నీళ్ల ట్యాంకులో పడేశాడు’ అని తన కళ్ల ముందే తండ్రి చేసిన హత్యల తీరుపై రెండున్నరేళ్ల చిన్నారి భయపడుతూ చెప్పిన మాటలివి. గొడ్డలి పట్టుకుని రాక్షసుడిగా ప్రవర్తిస్తున్న తండ్రిని చూసి గజగజ వణుకుతూ ఇంటి నుంచి బయటకు పరుగెత్తిన ఆ బాలిక ప్రాణాలు దక్కించుకుంది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం అనాజ్‌పూర్‌లో బుధవారం ఈ దారుణం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన ప్రకారం... అనాజ్‌పూర్‌ వాసి ఏర్పుల ధన్‌రాజ్‌కు అదే మండలంలోని బండరావిరాలకు చెందిన కందికంటి లావణ్య(23)తో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వీరికి రెండున్నరేళ్ల కుమార్తె ఆద్య, నెలన్నర వయసున్న (ఫిబ్రవరి 3వ తేదీన జన్మించాడు) కుమారుడు క్రియాన్ష్‌ ఉన్నారు. ధన్‌రాజ్‌ తల్లి పదేళ్ల కిందటే మృతిచెందారు. ప్రస్తుతం వీరంతా తండ్రి బాలయ్యతో కలిసి ఉంటున్నారు. ఇటీవల కుమారుడు జన్మించగా 21వ రోజు వేడుకను ఘనంగా నిర్వహించిన ధన్‌రాజ్‌ ఇటీవలే భార్యను పుట్టింటికి పంపాడు. బుధవారం ఉదయం ఆమెకు ఫోన్‌ చేసి బండరావిరాలకు వస్తున్నానని, కుమారుడికి నెలవారీ ఇంజెక్షన్‌ ఇప్పించాల్సి ఉందన్నాడు. 11 గంటలకు అత్తవారింటికి వెళ్లి భార్యతో కలిసి మధ్యాహ్నం 12 గంటలకు అనాజ్‌పూర్‌ చేరుకున్నారు. అనూహ్యంగా లావణ్యపై ధన్‌రాజ్‌ విరుచుకుపడ్డాడు. బీరు సీసాతో ముఖంపై పొడిచి, గొడ్డలితో నరకడంతో అక్కడికక్కడే ఆమె ప్రాణం పోయింది. మంచం మీదున్న కుమారుడిని నీళ్ల సంపులోకి విసిరేశాడు.

 భీతిల్లిన చిన్నారి

ఈ దారుణమంతా రెండున్నరేళ్ల వారి కుమార్తె ఆద్య కళ్ల ముందే జరిగింది. తండ్రిని చూసి భీతిల్లి ఏడుస్తూ బయటకు వచ్చేసింది. ఆమెను పక్కింటి బాలిక ఎత్తుకొని తమ ఇంట్లోకి తీసుకెళ్లింది. పట్టలేని ఆవేశంతో ఉన్న ధన్‌రాజ్‌ కుమార్తెను హతమార్చేందుకూ వెతికినా... ఆమె కనిపించలేదు. రక్తపు మరకలతో ఉన్న అతణ్ని ఇరుగుపొరుగు ప్రశ్నించారు. ఏమీ జరగలేదంటూ హెల్మెట్‌ పెట్టుకుని బైక్‌పై పరారయ్యాడు. వారికి అనుమానమిచ్చి ఇంట్లోకెళ్లి చూడగా లావణ్య రక్తపు మడుగులో కనిపించింది. బాలుడిని సంపులో నుంచి బయటకు తీయగా అప్పటికే మృతి చెందాడు. అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీసులు వచ్చి మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

ఎందుకీ ఘాతుకం?

‘ఇప్పుడే వచ్చారు.. అంతలోనే ఇలా చేస్తాడనుకోలేదు’ అంటూ లావణ్య తల్లిదండ్రులు గుండెలు బాదుకున్నారు. ధన్‌రాజ్‌ ఎందుకీ హత్యలు చేశాడో తెలియడం లేదని చుట్టుపక్కల వారూ ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. దంపతులు అన్యోన్యంగా మెలిగేవారని, గొడవలు పడినట్లు చూడలేదని తెలిపారు. ఘటనా స్థలాన్ని వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తంరెడ్డి, అబ్దుల్లాపూర్‌మెట్‌ సీఐ స్వామితో కలిసి పరిశీలించారు. నిందితుడిని 24 గంటల్లోగా అరెస్టు చేస్తామన్నారు. అదనపు కట్నం కోసమే ఇలా చేశాడని లావణ్య తండ్రి ఫిర్యాదు ఇచ్చారన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని