దళిత అధికారి అచ్చెన్నది హత్యే!

దళిత ఉద్యోగి, పశుసంవర్ధకశాఖ ఉపసంచాలకుడు డాక్టర్‌ చిన్న అచ్చెన్న (58) హత్యకు గురైనట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆయన్ను కిడ్నాప్‌ చేసి అంతమొందించినట్లు వెల్లడైంది.

Updated : 27 Mar 2023 09:45 IST

కిడ్నాప్‌ చేసి అంతమొందించిన నిందితులు
సీఎం జగన్‌ సొంత జిల్లాలో దారుణం
ఈ నెల 14నే అదృశ్యంపై ఫిర్యాదు.. దర్యాప్తులో నిర్లక్ష్యం
24న అనుమానాస్పద స్థితిలో బయటపడ్డ మృతదేహం
కుటుంబానికి సమాచారం ఇవ్వకుండానే శవపరీక్ష...
తన తండ్రిని కులం పేరుతో దూషించి వేధించారన్న అచ్చెన్న తనయుడు
విచారణకు కమిటీని నియమించిన మంత్రి సీదిరి

ఈనాడు డిజిటల్‌-కడప, న్యూస్‌టుడే-కడప నేరవార్తలు: దళిత ఉద్యోగి, పశుసంవర్ధకశాఖ ఉపసంచాలకుడు డాక్టర్‌ చిన్న అచ్చెన్న (58) హత్యకు గురైనట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆయన్ను కిడ్నాప్‌ చేసి అంతమొందించినట్లు వెల్లడైంది. ఈ హత్యలో సహోద్యోగులు కొందరితో పాటు ఇతర వ్యక్తుల ప్రమేయమూ వెలుగుచూసింది. అపహరించిన రోజే అచ్చెన్నను చంపేసినట్లు సమాచారం. పూర్తి వివరాలు పోలీసులు సోమవారం మీడియాకు వెల్లడించనున్నారు. ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి సొంత జిల్లా (వైయస్‌ఆర్‌ జిల్లా)లో దళిత అధికారి ఇలా దారుణ హత్యకు గురికావడం కలకలం రేపుతోంది. అచ్చెన్న కనిపించడం లేదంటూ ఆయన కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినా.. ఆయన ఆచూకీ కనుగొనేందుకు పోలీసులు తగిన చొరవ చూపలేదు. అనుమానితులనూ విచారించలేదు. అదృశ్యమైన 12 రోజుల తర్వాత అనుమానాస్పద స్థితిలో మృతదేహం బయటపడితే తప్ప పోలీసులు కదల్లేదు. జిల్లా స్థాయి ఉన్నతాధికారి.. అది కూడా దళిత వర్గానికి చెందిన వ్యక్తి కనిపించట్లేదంటూ అందిన ఫిర్యాదు పట్ల పోలీసులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో, దాని ఫలితం ఎంత తీవ్రంగా ఉందో  చెప్పేందుకు ఈ ఉదంతం తార్కాణంగా నిలుస్తోంది. అంతే కాదు.. అచ్చెన్న మృతదేహం లభించిన తరవాత.. కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండానే శవపరీక్ష నిర్వహించేసి హడావుడిగా వారికి మృతదేహాన్ని అప్పగించడం కూడా అనుమానాలకు తావిస్తోంది.

విధుల్లో చేర్చుకునేందుకు నిరాకరించిన కొద్ది రోజుల్లోనే అదృశ్యం...

కడప బహుళార్థ పశువైద్యశాలలో ఉపసంచాలకుడిగా పనిచేస్తున్న అచ్చెన్నకు అదే వైద్యశాలలో సహాయ సంచాలకులుగా పనిచేసే శ్రీధర్‌ లింగారెడ్డి, సురేంద్రనాథ్‌ బెనర్జీ, సుభాష్‌ చంద్రబోస్‌కు మధ్య విధి నిర్వహణకు సంబంధించి ఆరు నెలలుగా వివాదం నడుస్తోంది. శ్రీధర్‌ లింగారెడ్డి, సురేంద్రనాథ్‌ బెనర్జీ, సుభాష్‌ చంద్రబోస్‌లు విధి నిర్వహణలో ప్రభుత్వ నిబంధనలు, ఉన్నతాధికారుల ఆదేశాలు పాటించట్లేదని, తనకు సహకరించట్లేదని పేర్కొంటూ వారిని అచ్చెన్న ప్రభుత్వానికి సరెండర్‌ చేశారు. అచ్చెన్నే తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ ఆ ముగ్గురూ రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపైన త్రిసభ్య కమిటీ విచారణ చేపట్టింది. సరెండర్‌ చేసిన ఆ ముగ్గురినీ విధుల్లో చేర్చుకోవాలంటూ అచ్చెన్నను ఉన్నతాధికారులు ఆదేశించగా.. ఆయన అందుకు నిరాకరించారు. ఈ ఘటన జరిగిన తర్వాత కొద్ది రోజులకే అంటే ఈ నెల 12న ఆయన అదృశ్యమయ్యారు.

మృతదేహం దొరికేదాకా పోలీసులు కదల్లేదు

బాధితుడి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ నెల 14న కేసు నమోదు చేసినా.. 24వ తేదీ వరకూ దర్యాప్తులో పోలీసులు ఎలాంటి పురోగతీ సాధించలేదు. అన్నమయ్య జిల్లా రామాపురం మండలం గువ్వల చెరువు ఘాట్లో రహదారి గోడ కింద ఈ నెల 24న అనుమానాస్పద స్థితిలో ఓ మృతదేహం కనిపించగా స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఆ మృతదేహం అచ్చెన్నదిగా పోలీసులు గుర్తించారు. ఆ తర్వాతే  కదిలి..ఆయనది హత్యకు గురైనట్లు తేల్చారు.

పోలీసులు వెంటనే స్పందించుంటే

కడపలోని కోటిరెడ్డి సర్కిల్‌ సమీపంలోని చర్చి వద్ద నుంచే అచ్చెన్నను నిందితులు కిడ్నాప్‌ చేసినట్లు సమాచారం. ఆయన అదృశ్యంపై ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు స్పందించి ఉంటే ఫలితం ఉండేది. సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించినా బాధ్యులెవరో గుర్తించేందుకు వీలుండేది. పోలీసులు ఈ అదృశ్యం ఘటనలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.


పూర్తిస్థాయి విచారణకు కమిటీ: మంత్రి సీదిరి

ఈనాడు, అమరావతి: అచ్చెన్న మృతికి సంబంధించి పూర్తిస్థాయి విచారణ జరపాలని కలెక్టర్‌, ఎస్పీలను ఆదేశించినట్లు రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తిస్థాయి విచారణకు ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ‘ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని విచారించాలని ఆదేశించాం. పశు సంవర్ధక శాఖలో పనిచేసే వారు బాధ్యులైనట్లు తేలితే చర్యలకు వెనుకాడం. నివేదిక వచ్చాక బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. అచ్చెన్న కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది’ అని మంత్రి పేర్కొన్నారు.

సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలి: అఖిలపక్షం

డీడీ అచ్చెన్న మృతిపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేయించాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్‌ చేశారు. కడపలోని వీపీసీ ఎదుట అఖిలపక్ష నేతలు ఆదివారం ఆందోళన చేపట్టారు.


ఫిర్యాదిస్తే.. సస్పెన్షన్‌ అంటూ ఉత్తర్వులు

అచ్చెన్న కుటుంబం కర్నూలులో నివసిస్తుండగా.. ఆయన ఉద్యోగరీత్యా కడపలో ఒంటరిగా ఉంటున్నారు. ఈ నెల 12న ఉదయం 11.30 గంటల నుంచి అచ్చెన్న ఫోన్‌ స్విచ్ఛాఫ్‌లో ఉండటం, 14వ తేదీ వరకూ కూడా ఆయన ఫోన్‌కు అందుబాటులోకి రాకపోవడంతో అనుమానం వచ్చిన ఆయన కుమారుడు క్లింటన్‌ చక్రవర్తి...అచ్చెన్న సహోద్యోగి ఒకర్ని సంప్రదించారు. ఈ నెల 12న చర్చికి వెళ్తానంటూ బయటకు వెళ్లి తిరిగి రాలేదంటూ ఆయన సమాధానమిచ్చారు. దీంతో క్లింటన్‌ చక్రవర్తి వెంటనే కడప చేరుకుని తన తండ్రి కనిపించట్లేదంటూ ఒకటో పట్టణ పోలీసుస్టేషన్‌లో ఈ నెల 14న ఫిర్యాదు చేశారు.  శ్రీధర్‌ లింగారెడ్డి, సుభాష్‌ చంద్రబోస్‌, సురేంద్రనాథ్‌ బెనర్జీలపై అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసినా దర్యాప్తును ముందుకు తీసుకెళ్లలేదు. అచ్చెన్న అదృశ్యంపై స్పందించని ప్రభుత్వ యంత్రాంగం.. ఆయన్ను సస్పెండ్‌ చేస్తూ ఈ నెల 15న ఉత్తర్వులు పంపించింది.


నా తండ్రిని వేధించి చంపేశారు..
-క్లింటన్‌ చక్రవర్తి, అచ్చెన్న కుమారుడు

నా తండ్రిని తీవ్ర వేధింపులకు గురిచేసి చంపేశారు. కడప బహుళార్థ పశువైద్యశాలలో పనిచేసే సహాయ సంచాలకులు ఆయనను కులం పేరుతో దూషించేవారు. విధులు  నిర్వహించకుండా అడ్డుకునేవారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన ఉండేది కాదు. ఈ విషయాలను మా నాన్న తరచూ మాతో చెబుతూ బాధపడేవారు. ఆయన కనిపించట్లేదంటూ ఈ నెల 14న ఫిర్యాదు చేశాం. కేసు ఏమైందో తెలుసుకునేందుకు నాలుగైదు సార్లు పోలీసుస్టేషన్‌కు వెళ్లి కలిశాం. సీసీ టీవీ ఫుటేజీ పరిశీలిస్తున్నామంటూ దాటవేత వైఖరి ప్రదర్శించారే తప్ప.. సరిగ్గా స్పందించలేదు. అనుమానితుల పేర్లు మేము ఫిర్యాదులోనే పేర్కొన్నా వారినీ విచారించలేదు. చివరికి ఈ నెల 21న మా కుటుంబ సభ్యుల్నే గంటపాటు విచారించారు. మేము ఫిర్యాదు చేసిన మరుసటి రోజే మా నాన్నను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులివ్వడం ఆశ్చర్యం కలిగింది. సహాయ సంచాలకుల పనితీరుపై లోకాయుక్తకు మా తండ్రి ఫిర్యాదు చేశారు. పశు సంవర్ధక శాఖ డైరెక్టర్‌, వైయస్‌ఆర్‌ జిల్లా జేడీ సైతం మా నాన్నను వేధించారు.


హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణచేపట్టాలి: మందకృష్ణ మాదిగ

అచ్చెన్నది ముమ్మాటికీ హత్యేనని, దీనిపై సమగ్ర విచారణ జరిపి ఆయన కుటుంబానికి న్యాయం చేయాలని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్‌ చేశారు. ఈ కేసును హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేయించాలని కోరారు. జిల్లా ఎస్పీని కలిసి కేసుపై మాట్లాడారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని