Crime News: ట్రాక్టర్‌తో ఢీకొట్టి.. గొడ్డలితో నరికి.. తెరాస కౌన్సిలర్‌ దారుణహత్య

మహబూబాబాద్‌ మున్సిపాలిటీలో దారుణం చోటుచేసుకుంది. పత్తిపాకలో 8వ వార్డు కౌన్సిలర్‌ బానోతు రవిపై దుండగులు గొడ్డలితో దాడి చేశారు.

Updated : 21 Apr 2022 17:30 IST

మహబూబాబాద్‌: మహబూబాబాద్‌ మున్సిపాలిటీలో దారుణం చోటుచేసుకుంది. 8వ వార్డు కౌన్సిలర్‌ బానోతు రవి (32) దారుణ హత్యకు గురయ్యాడు. ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన రవి.. ఆ తర్వాత తెరాసలో చేరారు. గురువారం మున్సిపల్‌ కార్యాలయంలో అధికారులతో మాట్లాడిన అనంతరం ద్విచక్ర వాహనంపై పత్తిపాకలోని తన మిత్రుడి ఇంటి సమీపంలోకి వెళ్లారు. ఈ క్రమంలో ఆయన్ను గుర్తుతెలియన వ్యక్తులు ట్రాక్టర్‌తో ఢీకొట్టి కిందపడేశారు. అనంతరం మరో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు గొడ్డలితో ఆయనపై దాడి చేసి పరారయ్యారు.

తీవ్రగాయాల పాలైన రవిని ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ హత్యకు పాత కక్షలే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. ఆస్పత్రిలో కౌన్సిలర్‌ మృతదేహాన్ని ఎంపీ మాలోతు కవిత, డీసీసీ అధ్యక్షుడు భరత్‌చంద్రారెడ్డి పరిశీలించారు.

వ్యాపార లావాదేవీలే కారణం: ఎస్పీ

కౌన్సిలర్‌ రవి బైక్‌పై వెళ్తుండగా ట్రాక్టర్‌ అడ్డంపెట్టి ఆపారని.. దుండగులు కారులో వచ్చి అతడిపై దాడిచేశారని ఎస్పీ శరత్‌చంద్ర తెలిపారు. రవి హత్యకు వ్యాపార లావాదేవీలే కారణమని చెప్పారు. నిందితులను పట్టుకునేందుకు 4 బృందాలు ఏర్పాటు చేశామని.. ఇప్పటికే ఇద్దరిని గుర్తించామని తెలిపారు. నిందితలందరినీ త్వరలోనే అరెస్ట్‌ చేస్తామని ఎస్పీ చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని