బస్సులో ప్రయాణికుడికి గుండెపోటు.. మృతుడి వద్ద వజ్రాలు పొదిగిన 47 బంగారు అభరణాలు

ఏపీఎస్‌ ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికుడికి గుండెపోటు రావడంతో బస్సులోనే మృతిచెందాడు. ఈ సంఘటన బాపట్ల జిల్లాలోని కొరిశపాడు సమీపంలో ఆదివారం ఆర్ధరాత్రి చోటుచేసుకుంది. మృతుడి వద్ద సుమారు రూ.కోటి విలువైన వజ్రాలు పొదిగిన 47 బంగారు అభరణాలను పోలీసులు గుర్తించారు.

Published : 21 Nov 2022 22:40 IST

గుంటూరు (మేదరమెట్ల): ఏపీఎస్‌ ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికుడికి గుండెపోటు రావడంతో బస్సులోనే మృతిచెందాడు. ఈ సంఘటన బాపట్ల జిల్లాలోని కొరిశపాడు సమీపంలో ఆదివారం ఆర్ధరాత్రి చోటుచేసుకుంది. మేదరమెట్ల ఎస్సై ఎంవీ శివకుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం భీమవరం గ్రామానికి చెందిన బొబ్బా పవన్‌కుమార్‌(41) మూడు నెలల నుంచి గుంటూరులోని కిస్నా జ్యువెల్లర్స్‌లో సేల్స్‌ విభాగంలో పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం ఒంగోలులోని బీఎంఆర్‌ జ్యువెల్లర్స్‌ దుకాణంలో ఆభరాణాలు చూపించి తిరిగి గుంటూరు వెళ్లేందుకు కనిగిరి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఎక్కారు. బస్సు కొరిశపాడు జాతీయ రహదారి వంతెన దాటే సమయంతో అతడికి ఛాతీనొప్పి రావడంతో పక్కన కూర్చున్న ప్రయాణికుడు బస్సు డ్రైవర్‌కు సమాచారం ఇచ్చాడు. డ్రైవర్‌ వెంటనే 108కి సమాచారం అందించాడు. 108 వాహనం వచ్చేలోపే పవన్‌కుమార్‌ మృతిచెందాడు.

సంఘటనా స్థలానికి చేరుకున్న మేదరమెట్ల ఎస్సై.. మృతుని సెల్‌ఫోన్‌ను అన్‌లాక్‌ చేసి అందులో ఉన్న నంబర్ల ఆధారంగా వారికి ఫోన్‌ చేసి మృతుని వివరాలు తెలుసుకున్నారు. మృతుడి బ్యాగును పరిశీలించగా అందులో వజ్రాలు పొదిగిన 47 బంగారు అభరణాలను పోలీసులు గుర్తించారు. వాటి విలువ సుమారు రూ.కోటి ఉంటుందని తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అద్దంకి వైద్యశాలకు తరలించారు. అనంతరం మృతుడు పనిచేస్తున్న కిస్నా జ్యువెల్లర్స్‌ యజమానులకు ఎస్సై సమాచారం అందించారు. కిస్నా జ్యువెల్లర్స్‌ ప్రతినిధులు హితేష్‌మెహతా, సుధీర్‌ ఆభరణాలకు సంబంధించిన రశీదులను పోలీసులకు చూపించారు. వాటిని పరిశీలించిన ఎస్సై స్థానిక గ్రామ పెద్దల సమక్షంలో ఆభరణాలను జ్యువెల్లర్స్‌ ప్రతినిధులకు అందజేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటంబసభ్యులకు అప్పగించారు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని