ఆన్‌లైన్‌ జూదంలో అప్పులపాలు.. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు ఆత్మహత్య

ఆన్‌లైన్‌ గేములతో డబ్బులు కోల్పోయిన ఓ యువ సాఫ్ట్‌వేరు ఇంజినీరు మనోవేదనతో బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Updated : 08 May 2024 13:49 IST

గంగాధర, న్యూస్‌టుడే: ఆన్‌లైన్‌ గేములతో డబ్బులు కోల్పోయిన ఓ యువ సాఫ్ట్‌వేరు ఇంజినీరు మనోవేదనతో బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కరీంనగర్‌ జిల్లా గంగాధరలోని మధురానగర్‌కు చెందిన నాగుల లక్ష్మణ్‌, లక్ష్మిల కుమారుడు పృథ్వీ(25) బీటెక్‌ పూర్తి చేసి ఏడాది క్రితం హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేరు ఇంజినీరుగా చేరారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడాకు వెళ్లాలని కంపెనీ సూచించడంతో రెండు నెలల కిందట అక్కడకు వెళ్లారు. స్నేహితులతో కలిసి ఓ గదిలో ఉండేవాడు. ఈ క్రమంలో ఆన్‌లైన్‌లో పరిచయమైన ముగ్గురు వ్యక్తులు అతన్ని ఆన్‌లైన్‌ జూదంలోకి దింపారు. ఇందు కోసం పృథ్వీ వివిధ కారణాలు చెప్పి స్నేహితుల వద్ద రూ.12 లక్షలు అప్పు చేశారు. కానీ నాలుగు రోజుల్లోనే మొత్తం పోగొట్టుకున్నారు. దీంతో 15 రోజులుగా ఉద్యోగానికి వెళ్లకుండా గదిలోనే ఉండేవారు. అప్పులు ఎలా చెల్లించాలో తెలియక ఆందోళనకు గురై శనివారం రాత్రి గదిలో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకున్నారు. ఈ మేరకు నోయిడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కుటుంబసభ్యులు మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని