Ts News: తెలుగు అకాడమీ డిపాజిట్ల గోల్‌మాల్‌పై ప్రభుత్వానికి త్రిసభ్య కమిటీ నివేదిక

తెలుగు అకాడమీ నిధుల గోల్ మాల్ వ్యవహారంలో త్రిసభ్య కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. కమిటీకి నేతృత్వం వహించిన ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్

Updated : 21 Dec 2022 16:26 IST

హైదరాబాద్‌: తెలుగు అకాడమీ నిధుల గోల్ మాల్ వ్యవహారంలో త్రిసభ్య కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. కమిటీకి నేతృత్వం వహించిన ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్.. విద్యా శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాకు నివేదిక సమర్పించారు. బ్యాంకుల్లో అకాడమీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల గల్లంతుపై సీసీఎస్ పోలీసులు ఇప్పటికే కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. శాఖాపరమైన అంతర్గత లోపాలపై విచారణ జరిపేందుకు ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. అకాడమీ మాజీ డైరెక్టర్ సోమిరెడ్డి సహా అధికారులు, సిబ్బందిని, బ్యాంకు అధికారులను విచారించిన కమిటీ.. ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, బ్యాంకు ఖాతాల నిర్వహణలో శాఖాపరమైన నిర్లక్ష్యం జరిగిందని కమిటీ నిర్ధారించినట్లు సమాచారం. ఔట్ సోర్సింగ్ సిబ్బంది ద్వారా ఆర్థిక లావాదేవీలు జరపడం, అకౌంట్స్ విభాగం, ఇతర ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపాలను ఎత్తిచూపినట్లు తెలుస్తోంది.

పోలీస్‌ కస్టడీకి మస్తాన్ వలీ..

అకాడమీ డిపాజిట్ల గోల్‌మాల్‌ కేసులో యూబీఐ చీఫ్ మేనేజర్ మస్తాన్ వలీని మూడు రోజుల పోలీస్ కస్టడీకి నాంపల్లి న్యాయస్థానం అనుమతించింది. మరో ముగ్గురు నిందితులు సత్యనారాయణ, పద్మావతి, మొహిద్దీన్‌ల కస్టడీపై తీర్పును గురువారానికి వాయిదా వేసింది. మస్తాన్ వలీని రేపటి నుంచి కస్టడీలోకి తీసుకొని 6 రోజుల పాటు ప్రశ్నించనున్నారు.

తెలుగు అకాడమీకి సంబంధించిన రూ.63 కోట్ల డిపాజిట్లు దారి మళ్ళించారు. ఇందులో యూబీఐ బ్యాంకుకు చెందిన కార్వాన్, సంతోష్ నగర్ శాఖల్లో రూ. 53 కోట్లు డిపాజిట్ చేశారు. డిపాజిట్లను ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు విడతల వారీగా ఏపీ మర్కంటైల్ సొసైటీ ఖాతాకు మళ్లించి నగదును తీసుకున్నారు. తెలుగు అకాడమీ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సీసీఎస్ పోలీసులు ప్రధాన నిందితుడు మస్తాన్ వలీతో పాటు ఏపీ మర్కంటైల్ సొసైటీ ఛైర్మన్ సత్యనారాయణ, మేనేజర్ పద్మావతి, క్లర్క్ మొహిద్దీన్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. యూనియన్ బ్యాంకు నుంచి డిపాజిట్లను ఏ విధంగా మళ్లించారనే విషయాలు తెలుసుకోవడానికి... నలుగురు నిందితులను 10రోజుల కస్టడీకి ఇవ్వాల్సిందిగా సీసీఎస్ పోలీసులు నాంపల్లి కోర్టును కోరారు. డిపాజిట్ల గోల్ మాల్ వెనక ఇంకెవరెవరు ఉన్నారనే విషయాలు తెలుసుకొవాల్సి ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మస్తాన్ వలీని ఆరు రోజుల కస్టడీకి న్యాయస్థానం అంగీకరించింది. యూబీఐతో పాటు చందానగర్‌లోని కెనరా బ్యాంకులోనూ రూ.10 కోట్ల డిపాజిట్లను ఏపీ మర్కంటైల్ ఖాతాకు మళ్లించారు. ఈ రెండు బ్యాంకుల్లోని నిధులను ఒకే ముఠా గోల్‌మాల్‌ చేసిందా? ఈ ముఠా వెనక కీలక పాత్ర పోషించిన వాళ్లెవరనే కోణంలో పోలీసులు మస్తాన్ వలీని ప్రశ్నించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని