Disha Encounter case: ‘మాకు న్యాయం చేయండి’: సిర్పూర్కర్‌ కమిషన్‌ను కోరిన హుస్సేన్‌

దిశ కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌లో కుమారుడిని కోల్పోయిన తమకు న్యాయం చేయాలని ఆరిఫ్‌ తండ్రి హుస్సేన్‌.. సిర్పూర్కర్‌ కమిషన్‌కు విజ్ఞప్తి చేశారు. నష్టపరిహారం కోసమే

Published : 05 Sep 2021 01:08 IST

హైదరాబాద్‌: దిశ కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌లో కుమారుడిని కోల్పోయిన తమకు న్యాయం చేయాలని ఆరిఫ్‌ తండ్రి హుస్సేన్‌.. సిర్పూర్కర్‌ కమిషన్‌కు విజ్ఞప్తి చేశారు. నష్టపరిహారం కోసమే అఫిడవిట్‌ దాఖలు చేశారా? అని ప్రభుత్వ తరఫు న్యాయవాది ఉమామహేశ్వర్‌ రావు అడిగిన ప్రశ్నకు.. న్యాయం కోసమే కమిషన్‌ను ఆశ్రయించినట్లు హుస్సేన్ తెలిపారు. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ ఘటనపై సిర్పూర్కర్‌ కమిషన్‌ విచారణ నిర్వహించింది. ఈ నెల 1న మొదలైన మలి విడత విచారణ శనివారం వరకు కొనసాగింది. సిట్‌ అధికారి సురేందర్‌ రెడ్డితో పాటు సాక్షిగా వ్యవహరించిన ప్రభుత్వ ఉద్యోగి రాజశేఖర్‌ను కమిషన్‌ను ప్రశ్నించింది. ఇవాళ ఉదయం నుంచి సాయంత్రం వరకు హుస్సేన్‌ను ప్రభుత్వ తరఫు న్యాయవాది క్రాస్‌ ఎగ్జామిన్‌ చేశారు.

న్యాయవాది ఉమామహేశ్వర్ రావు అడిగిన పలు ప్రశ్నలకు హుస్సేన్ చెప్పిన సమాధానాలను కమిషన్ నమోదు చేసుకుంది. ఈ నెల 13 నుంచి 17 వరకు మరోసారి విచారణ నిర్వహించాలని కమిషన్ నిర్ణయించింది. మృతుల కుటుంబ సభ్యుల్లో ఆరిఫ్ తండ్రి హుస్సేన్ నుంచి మాత్రమే కమిషన్ వాంగ్మూలం తీసుకుంది. మిగతా ముగ్గురు మృతుల కుటుంబ సభ్యుల నుంచి వాంగ్మూలం నమోదు చేయాల్సి ఉంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌కు నేతృత్వం వహించిన రాచకొండ సీపీ మహేశ్ భగవత్ ఈ రోజు కమిషన్ కార్యాలయానికి వచ్చారు. ఆయన్ను కమిషన్ విచారించాల్సి ఉంది. కానీ, మృతుల కుటుంబ సభ్యుల నుంచి వాంగ్మూలం తీసుకోవడం పూర్తి కాకపోవడంతో ఆయన వెళ్లిపోయారు. ఈ నెల 13 తర్వాత మహేశ్ భగవత్‌ను కమిషన్ విచారించే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని