Telangana News: 100 మందితో వచ్చి యువతి కిడ్నాప్‌.. సాయంత్రానికి ఆమె నుంచి ఫోన్‌

ఆదిభట్లలో కలకలం సృష్టించిన యువతి కిడ్నాప్‌ కేసును పోలీసులు ఛేదించారు. 10 గంటల్లోనే కేసును ఛేదించి యువతిని రక్షించినట్లు రాచకొండ అదనపు సీపీ సుధీర్‌బాబు తెలిపారు.

Updated : 10 Dec 2022 00:15 IST

తుర్కయంజాల్‌ పురపాలిక (హైదరాబాద్‌): ఆదిభట్లలో కలకలం సృష్టించిన యువతి కిడ్నాప్‌ కేసును పోలీసులు ఛేదించారు. 10 గంటల్లోనే కేసును ఛేదించి యువతిని రక్షించినట్లు రాచకొండ అదనపు సీపీ సుధీర్‌బాబు తెలిపారు. ఈ కేసులో ఇప్పటివరకు 8 మందిని అరెస్టు చేశామన్నారు. ప్రధాన నిందితుడు నవీన్‌రెడ్డి, మరికొందరి కోసం గాలిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో ఇవాళ ఉదయం యువతి (దంత వైద్యురాలు) అపహరణకు గురైంది. నాటకీయ పరిణామాల మధ్య సాయంత్రానికి కొత్త మలుపు తిరిగింది. తాను క్షేమంగా ఉన్నట్లు తండ్రి దామోదర్‌రెడ్డికి ఆమె ఫోన్‌ ద్వారా తెలిపింది. కిడ్నాప్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. యువతి ఫోన్‌ చేసిన సెల్‌టవర్‌ లొకేషన్‌ ఆధారంగా ఆమె నల్గొండలో ఉన్నట్లు గుర్తించారు. అనంతరం నల్గొండ పోలీసులకు సమాచారం ఇచ్చి ఆమెను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. యువతిని అపహరిస్తుండగా వెంబడించిన పోలీసులు ఆంధ్ర, తెలంగాణ సరిహద్దులోనే నిందితుల వాహనాన్ని అడ్డుకున్నట్లు సమాచారం. ఆ తర్వాతే యువతి తన తండ్రికి ఫోన్‌ చేసి క్షేమంగా ఉన్నానని చెప్పినట్టు తెలుస్తోంది. 

 

ఉదయం సినీ ఫక్కీలో కిడ్నాప్‌ ఘటన

ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని మన్నెగూడలో కుటుంబ సభ్యులపై దాడి చేసి యువతిని అపహరించిన ఘటన కలకలం రేపింది. డీసీఎం, కార్లలో 100మందికి పైగా యువకులతో వచ్చిన నవీన్‌రెడ్డి.. తమ కుమార్తెను తీసుకెళ్లినట్టు దామోదర్‌రెడ్డి, నిర్మల దంపతులు ఆరోపించారు. ఇంట్లోని సామగ్రి, సీసీ కెమెరాలు, కార్లను ధ్వంసం చేశారని తెలిపారు. గతంలో నవీన్‌రెడ్డిపై ఆదిభట్ల పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు యువతి కుటుంబ సభ్యులు వెల్లడించారు. అయినప్పటికీ వేధిస్తున్న నవీన్‌రెడ్డి.. పోలీసుల అండతోనే దాడికి తెగబడ్డారని ఆరోపించారు. ఇంటిపై దాడికి పాల్పడుతున్న సమయంలో పోలీసులు, 100 నంబర్‌కు కాల్‌ చేసినా పోలీసులు స్పందించలేదన్నారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ సాగర్‌ రహదారిపై యువతి కుటుంబ సభ్యులు, బంధువులు ధర్నాకు దిగారు. దీంతో సాగర్‌ హైవేపై భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది. యువతి అపహరణకు గురైన విషయం తెలుసుకున్న ఆమె బంధువులు భారీగా తరలివచ్చారు. నవీన్‌రెడ్డికి చెందిన టీ స్టాల్‌కు నిప్పు పెట్టి దగ్ధం చేశారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితి అదుపు చేశారు. ఈ ఘటనలతో ఇవాళ మధ్యాహ్నం నుంచి మన్నెగూడలో ఉద్రిక్తత నెలకొంది. గతంలో నవీన్‌రెడ్డితో యువతికి పరిచయం ఉన్నట్టు తెలుస్తోంది. ఘటనాస్థలికి చేరుకున్న ఇబ్రహీంపట్నం ఏసీపీ ఉమామహేశ్వరరావు బాధితుల ఫిర్యాదు మేరకు కిడ్నాప్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో యువతి తండ్రికి ఫోన్‌ చేసి క్షేమంగా ఉన్నానని చెప్పడంతో కిడ్నాప్‌ కేసు కొత్త మలుపు తిరిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని