logo

రామా.. శాశ్వత వనవాసమేనా!?

రెండో భద్రాద్రిగా పేరుగాంచిన అల్లూరి సీతారామరాజు జిల్లా వరరామచంద్రాపురం మండలం శ్రీరామగిరి కనుమరుగు కానుందా? శ్రీరామగిరిలో సీతారాములకు ఇదే చివరి కల్యాణమా? అంటే.. అవుననే జవాబు వస్తోంది.

Updated : 28 Mar 2023 06:18 IST

వరరామచంద్రాపురం, న్యూస్‌టుడే

రెండో భద్రాద్రిగా పేరుగాంచిన అల్లూరి సీతారామరాజు జిల్లా వరరామచంద్రాపురం మండలం శ్రీరామగిరి కనుమరుగు కానుందా? శ్రీరామగిరిలో సీతారాములకు ఇదే చివరి కల్యాణమా? అంటే.. అవుననే జవాబు వస్తోంది. పోలవరం ముంపు గ్రామాల్లో మొదటిదశలో తరలించే జాబితాలో (కాంటూరు41.15) శ్రీరామగిరి ఉండడమే ఇందుకు ప్రధాన కారణం. ఏటా ముక్కోటి, కృష్ణాష్టమి, ఉగాది, శ్రీరామనవమి ఉత్సవాలకు భద్రాచలం వెళ్లలేని భక్తులకు రెండో భద్రాద్రిగా పేరుగాంచిన ఈ ఆలయంలోని సీతారామయ్య ఆ భాగ్యాన్ని ఇన్నేళ్లు కల్పించారు. రాములోరి కల్యాణం ఇక్కడ మళ్లీ వీక్షించలేమన్న నిజాన్ని స్థానిక భక్తులు  జీర్ణించుకోలేకపోతున్నారు. శ్రీరామగిరి వాసుల పూజలు అందుకున్న రామయ్య వారికి వరద కష్టకాలంలో అండగా తన కొండపైన ఆశ్రయం కల్పిస్తూనే ఉన్నారు.

రాముడు నడయాడిన ప్రాంతం

వనవాస కాలంలో సీతారామ లక్ష్మణులు భద్రాద్రి, దుమ్ముగూడెం మండలంలోని పర్ణశాల, వరరామచంద్రాపురం మండలంలోని శ్రీరామగిరిలో తిరిగారనేది స్థల పురాణం. సీతాపహరణం తరవాత రామ లక్ష్మణులు ఈ ప్రాంతంలోని మాతంగ మహాముని ఆశ్రమానికి చేరుకున్నారు. జటాయువుకు అంతిమసంస్కారం చేసిన గుర్తులు ఇక్కడ బండరాళ్లపై ఇంకా ఉన్నాయి. మాతంగముని సలహామేరకు దక్షిణ ముఖంగా తపస్సు చేశారని, రావణ సంహారం తరవాత ఇక్కడ దక్షిణముఖంగానే రామ, లక్ష్మణులు వెలిశారు. ఈ ఆధారాలతోనే శ్రీరామగిరి దేవాలయం రెండో భద్రాద్రి ఆలయంగా పేరుగాంచింది. ప్రధానంగా శ్రీరామనవమి ఉత్సవాల్లో కల్యాణానికి కార్యక్రమానికి పక్క రాష్ట్రాలైన తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ నుంచి వేలాది భక్తులు ఇక్కడకు తరలివస్తారు. ఇంతటి ప్రాధాన్య పుణ్యక్షేత్రం పోలవరం ముంపులో కనుమరుగు అవుతోంది. శ్రీరామగిరి గ్రామానికి చెందిన 264 కుటుంబాలకు తాడ్వాయి మండలంలో పునరావాసం ఏర్పాటు చేశారు. దేవాలయంపై ఇప్పటివరకు సరైన నిర్ణయం తీసుకోకపోవడం  గమనార్హం.

పట్టువస్త్రాలతో అప్పటి పీవో చినబాబు, తహసీల్దారు ప్రసాద్‌ తదితరులు


నిర్వాసితుల తరలింపు విషయంపై జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ను ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా.. పునరావాస కాలనీల్లో అన్ని వసతులు సమకూర్చిన తర్వాత తరలిస్తామన్నారు.


25 ఏళ్లగా పల్లకి సేవ : దాదాపుగా 25 ఏళ్ల నుంచి స్వామి ఉత్సవాల్లో పల్లకి సేవలో ఉంటున్నాను. శ్రీరామనవమి, ముక్కోటి ఏకాదశి, పర్వదినాల్లో స్వాములోరి పల్లకిని మోస్తున్నాను. మరో రెండు నెలల్లో గ్రామాన్ని ఖాళీ చేయిస్తామని అధికారులు చెబుతుంటే, అక్కడ ఎవరి పల్లకి మోయాలి, ఎలా రాములోరి సేవలు చేయాలి? రామయ్యను వదిలి ఉండగలమా?

 దానేబోయిన రంగయ్య, శ్రీరామగిరి


మాకు జీవితాంతం వియోగమా?  : రావణాసురుడు కేవలం సీతమ్మను ఏడాదిపాటు మాత్రమే రామయ్యకు దూరం చేస్తే, పోలవరం ముంపు మా శ్రీరామగిరి రామయ్యకు మమ్మల్ని శాశ్వతంగా దూరం చేస్తోంది. దాదాపుగా 60 ఏళ్ల నుంచి సేవలో ఉన్నాం. మానాన్న, తరువాత నేను, ఇప్పుడు నా పిల్లలు స్వామివారి కైంకర్యంలో తరిస్తున్నాం. రామయ్య సేవలేని మమ్మల్ని మేము ఊహించుకోలేక పోతున్నాం.

పురుషోత్తమాచార్యులు, అర్చకులు


పునరావాసం వద్ద ఏర్పాటు చేయాలి : 30 ఏళ్ల నుంచి రాములోరి ఉత్సవాలు చూస్తున్నాను. ఆయన మా గ్రామస్థులో ఒకరిగా మారిపోయారు. నిద్రలేచి ఆలయంవైపు తిరిగి ఒక్క నమస్కారం పెట్టుకుంటే చాలు. మా పనులు అన్నీ సక్రమంగా సాగిపోతాయి. మాకు పునరావాసం కల్పిస్తున్నచోట శ్రీరామగిరి రాములోరి విగ్రహాలతో గుడి నిర్మించాలి. మా రాముడు మా వెంటే ఉన్నాడని మా గ్రామాల ప్రజలకు కొండత ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఎప్పటిలా ఉత్సవాలు మేము నిర్వహించుకుంటాం.

సత్తిబాబు, శ్రీరామగిరి


కలెక్టర్‌కు విన్నవించాం : ప్రధాన ఆలయం పోలవరం పూర్తయినా మునిగిపోదు. చుట్టూ జలమయమవుతుంది. నిర్వాసిత గ్రామాలను తరలించేలోపు పోలవరం ముంపులోని దేవాలయాలకు మరొక చోట స్థలాలు చూపించాలని జిల్లా కలెక్టర్‌కు విన్నవించాం. స్థలం చూపకముందే గ్రామాలు ఖాళీ చేస్తే, అప్పుడు ఏం చేయాలో మాశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం.

లక్ష్మీకుమార్‌, ఆలయ ఈవో

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని