logo

హవ్వా! అపుడే డీపీఆర్‌లా?

గుంటూరు నగరపాలక సంస్థలో కొందరు అధికారులు అవసరం లేని పనులకు అత్యుత్సాహం చూపుతున్నారు. అమృత్‌-2 కింద గుంటూరుకు రూ.174 కోట్లు నిధులు రాబోతున్నాయని, ఆ పనుల కేటాయింపు లేకుండానే డీపీఆర్‌లు తయారీకి బాక్సు టెండర్లు పిలవటంపై దుమారం రేగింది

Published : 04 Feb 2023 06:51 IST

అధికారుల తీరుపై రుసరుస
ఈనాడు-అమరావతి

గుంటూరు నగరపాలక సంస్థలో కొందరు అధికారులు అవసరం లేని పనులకు అత్యుత్సాహం చూపుతున్నారు. అమృత్‌-2 కింద గుంటూరుకు రూ.174 కోట్లు నిధులు రాబోతున్నాయని, ఆ పనుల కేటాయింపు లేకుండానే డీపీఆర్‌లు తయారీకి బాక్సు టెండర్లు పిలవటంపై దుమారం రేగింది. శుక్రవారం ‘ఈనాడు’ రూ.కోట్ల పనులకు బాక్సు టెండర్లు శీర్షికన ప్రచురితమైన కధనం కౌన్సిల్‌, అధికార యంత్రాంగంలో చర్చనీయాంశమైంది. రూ.174 కోట్ల పనుల్లో నగరపాలకకు దక్కేవి ఏమిటో స్పష్టత లేకుండా డీపీఆర్‌లు తయారుచేసి ప్రజాధనం దుర్వినియోగానికి పాల్పడతారా? గతంలో యూజీడీ పనుల విషయంలోనూ ఇలానే తొందరపాటు ప్రదర్శించి ఓ కన్సల్టెన్సీతో డీపీఆర్‌ తయారుచేయించి రూ.6 కోట్లకు పైగా  చెల్లింపులు చేశారు. తీరా ఆ పనులను నగరపాలకకు కాకుండా ప్రజారోగ్య ఇంజినీరింగ్‌ విభాగం(పబ్లిక్‌ హెల్త్‌ డిపార్టుమెంట్‌)కు కట్టబెట్టడంతో కార్పొరేషన్‌ డీపీఆర్‌లు పనికిరావని అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో వాటి తయారీకి వెచ్చించిన రూ.6 కోట్లు వృథా అయ్యాయి. అయినా మరోసారి అమృత్‌-2 పనులకు మున్ముందే టెండర్లు పిలవటం అంటే అధికారుల అత్యుత్సాహం కాదా? కనీసం ఇలాంటివి కౌన్సిల్‌కు తెలియజేయకపోయినా స్టాండింగ్‌ కౌన్సిల్‌లో అయినా చర్చకు పెట్టరా అంటూ పలువురు కార్పొరేటర్లు రుసరుసలాడుతున్నారు. నగరంలో చెరువుల అభివృద్ధి, పార్కుల నిర్మాణం, తాగునీటి పథకాలు, ఘనవ్యర్దాల నిర్వహణకు అమృత్‌-2లో నిధులు ఇచ్చేలా మాత్రమే ప్రభుత్వం ఉత్తర్వు ఇచ్చింది. కొన్ని పనులకు వర్క్‌ ఏజెన్సీ కేటాయింపులే జరగలేదు. చెరువులు అభివృద్ది పనులను ఏపీ గ్రీన్‌బ్యూటిఫికేషన్‌ కార్పొరేషన్‌ చేపట్టేలా నిర్ణయం జరిగింది. ఈ పనులకు సంబంధించిన డిజైన్లను ఆ సంస్థ గీయించుకుంటుందని, ఆ పనులకు నగరపాలక డీపీఆర్‌లు తయారుచేసినా అవి వృథాప్రయాసగా మారతాయని ఇంజినీరింగ్‌వర్గాలే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని