logo

బంధాలను బలి పెడుతున్నారు

జీవితాంతం తోడుంటానని, కంటికి రెప్పలా కాపాడతానని అగ్నిసాక్షిగా చేసిన ప్రమాణాలు ఆవిరైపోతున్నాయి. వివాహేతర సంబంధం.. తన మాట వినడం లేదన్న అక్కసు.. ఆర్థిక సమస్యలు.. మద్యం మత్తు.. క్షణికావేశం.. కారణమేదైనా భార్యలు బలవుతున్నారు.

Updated : 04 Jun 2023 04:59 IST

క్షణికావేశంలో భార్యలను హతమార్చుతున్న భర్తలు
చిన్న గొడవలకే కూలుతున్నకాపురాలు

ఈనాడు, హైదరాబాద్‌: జీవితాంతం తోడుంటానని, కంటికి రెప్పలా కాపాడతానని అగ్నిసాక్షిగా చేసిన ప్రమాణాలు ఆవిరైపోతున్నాయి. వివాహేతర సంబంధం.. తన మాట వినడం లేదన్న అక్కసు.. ఆర్థిక సమస్యలు.. మద్యం మత్తు.. క్షణికావేశం.. కారణమేదైనా భార్యలు బలవుతున్నారు. నగరంలో ఇరవై రోజుల్లో ఐదుగురు వివాహితల్ని కట్టుకున్నోళ్లే దారుణంగా మట్టుబెట్టారు. అడ్డుకోబోయిన పిల్లలనూ హతమార్చేందుకు యత్నించారు. భావోద్వేగాల్ని నియంత్రించుకోలేని ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. 2022లో హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధి పాతబస్తీలో 21 హత్యలు జరిగాయి. వాటిలో 19 హత్యలకు వివాహేతర సంబంధాలే కారణమని పోలీసులు తేల్చారు.  

అనుమానాలు.. సూటిపోటి మాటలు..

ఫోన్‌ చేసినప్పుడు కాల్‌ వెయిటింగ్‌ వచ్చిందని, భార్య మాట వినడం లేదనే చిన్నపాటి కారణాలను చూపిస్తూ కొందరు భర్తలు మృగాల్లా మారుతున్నారు. ఇతరుల చెప్పుడు మాటలతోనో.. ఊహించుకునో లేనిపోని అనుమానాలు పెంచుకుని సూటిపోటి మాటలతో వేధిస్తూ దారుణంగా హింసిస్తున్నారు. భార్యపై అనుమానాలతో తీవ్ర ఒత్తిడికి గురవుతూ పరువు పోతుందనే ఉద్దేశంతో ఈ దారుణాలకు తెగబడుతున్నారు. కనీసం పిల్లల భవిష్యత్తు గురించి కూడా ఆలోచించలేని దుస్థితికి చేరుకుంటున్నారు. ఇటీవల అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఒక కిరాతకుడు భార్యను బీరు సీసాతో పొడిచి చంపాడు. నెలల వయసున్న కుమారుడిని నీళ్ల ట్యాంకులో విసిరేశాడు. చిన్న కుమార్తెను చంపేందుకు వెంటపడగా త్రుటిలో తప్పించుకుంది. భార్యతో జరిగిన చిన్న గొడవే కారణమని నిందితుడు పోలీసుల వద్ద అంగీకరించాడు.

ఇరవై రోజుల్లో 5 హత్యలు

* మే 12న వనస్థలిపురంలో కానిస్టేబుల్‌ రాజ్‌కుమార్‌ తన భార్యను కిరాతకంగా హతమార్చాడు. అతని వివాహేతర సంబంధం కుటుంబంలో చిచ్చుపెట్టింది. విడాకులు ఇవ్వనందుకు భార్యను హత్య చేశాడు. అడ్డుకోబోయిన కుమారుడ్ని హతమార్చేందుకు ప్రయత్నించాడు.
* మే 15న కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఫోరంమాల్‌ ఫ్లైఓవర్‌ కింద సాదిక్‌ తన భార్యను రాళ్లతో కొట్టి చంపాడు. మద్యం మత్తులో ఇద్దరి మధ్య గొడవ జరగటంతో ఈ హత్యకు పాల్పడ్డాడు.
* మే 16న ఎస్సార్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో భార్యాభర్తల మృతి కలకలం రేపింది. ఎల్లారెడ్డిగూడలో మద్యం మత్తులో భార్యను ఇనుపరాడ్డుతో కొట్టి చంపిన భర్త జనార్దన్‌ ఫ్యానుకు ఉరివేసుకున్నాడు.
* మే 16న రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండల కేంద్రానికి చెందిన యాదయ్య తన భార్య కవితకు కరెంట్‌ షాక్‌ ఇచ్చి ప్రాణాలు తీశాడు. ఆమె విద్యుదాఘాతానికి గురై మృతిచెందినట్లు పోలీసుల్ని నమ్మించాడు. కవిత ఒంటిపై గాయాలుండడంతో అనుమానించిన పోలీసులు లోతుగా దర్యాప్తు చేయగా హత్య విషయం తేలింది.
* మే 20న శంకర్‌పల్లి మండలం జన్వాడలో ఆర్‌ఎంపీ డాక్టర్‌ నాగరాజు భార్యను గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇద్దరి మధ్య గొడవ పెద్దదవడంతో ఇది జరిగింది.


ఇద్దరూ మాట్లాడుకుంటే పరిష్కారమే
- డాక్టర్‌ ఎం.రాంచందర్‌, సైకాలజిస్టు

భార్యపై లేనిపోని అపోహలతో అనుమానం పెంచుకోవడం.. ఇద్దరూ మనసు విప్పి మాట్లాడుకోకపోవడమే విపరిణామాలకు దారి తీస్తోంది. ఇద్దరి మధ్య దాపరికాలు ఉండకూడదు. ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలి. ఏ సమస్య ఉన్నా ఇద్దరూ మనసువిప్పి మాట్లాడుకుంటే అన్నీ సర్దుకుపోతాయి.


2022లో మూడు కమిషనరేట్లలో కేసులు

కారణం హైదరాబాద్‌ రాచకొండ సైబరాబాద్‌
వరకట్న మరణాలు/ఆత్మహత్య 12 21 15
ఆత్మహత్యకు ప్రేరేపించడం 25 4 53
వేధింపులు/గృహహింస 1,418 1,704 1,096


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని