logo

క్షమాపణ చెప్పమని పిలిచి దాడి... వ్యక్తి మృతి

ఓ అమ్మాయిని వేధించాడనే కారణంతో క్షమాపణ చెప్పమని పిలిచి దాడి చేయడంతో తీవ్ర గాయాలై ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.

Published : 25 Jun 2022 06:42 IST

వేణుగౌడ్‌

సిరిసిల్ల గ్రామీణం, న్యూస్‌టుడే: ఓ అమ్మాయిని వేధించాడనే కారణంతో క్షమాపణ చెప్పమని పిలిచి దాడి చేయడంతో తీవ్ర గాయాలై ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్‌కు చెందిన నాగుల వేణుగౌడ్‌ (40) యంత్రాలు, తాయత్తులు కడుతూ, జాతకాలు చెబుతూ కుటుంబాన్ని పోషించేవాడు. ఈ క్రమంలో తన వద్దకు వచ్చిన సిరిసిల్లకు చెందిన యువతిని వేధించాడని, సదరు యువతి ఎస్పీకి ఫిర్యాదు చేస్తుందని, నీవు వచ్చి క్షమాపణ చెబితే ఫిర్యాదు చేయదంటూ ఓ విలేకరి (ఈనాడు కాదు) వేణుగౌడ్‌కు ఫోన్‌ చేసి సిరిసిల్లకు రావాలని చెప్పాడు. దీంతో వేణుగౌడ్‌ అతని స్నేహితునితో కలిసి మధ్యాహ్నం సిరిసిల్లకు వచ్చాడు. ఎస్పీ క్యాంపు ఆఫీస్‌ ప్రాంతంలోని రైతు బజార్‌ సమీపంలో వేణుగౌడ్‌పై అప్పటికే వేచి ఉన్న కొందరు వ్యక్తులు కర్రలతో దాడి చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దాడికి గురైన వేణును చికిత్స నిమిత్తం కరీంనగర్‌ తరలించగా మృతి చెందినట్లు వారు పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించగా, సిరిసిల్ల టౌన్‌ సీఐ అనిల్‌కుమార్‌ పరిశీలించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు బోరున విలపించారు. మృతునికి భార్య వైష్ణవి, ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. దాడి చేసిన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని