logo

ఆఖరి నిమిషంలో సద్వినియోగం ఎలా?

ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు మంజూరు చేస్తున్నాయి. పాఠశాల సముదాయ (స్కూల్‌ కాంప్లెక్స్‌), మండల వనరుల కేంద్రం (ఎమ్మార్సీ)ల నిర్వహణకు ఆర్థిక చేయూతనిస్తున్నాయి.

Updated : 28 Mar 2023 06:32 IST

ఎమ్మార్సీలకు నిర్వహణ ఖర్చులు మంజూరు
ఉపయోగించుకోవడానికి మార్చి నెలాఖరే గడువు

విద్యార్థులకు పాఠాల బోధన

న్యూస్‌టుడే, పెద్దపల్లి కలెక్టరేట్‌: ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు మంజూరు చేస్తున్నాయి. పాఠశాల సముదాయ (స్కూల్‌ కాంప్లెక్స్‌), మండల వనరుల కేంద్రం (ఎమ్మార్సీ)ల నిర్వహణకు ఆర్థిక చేయూతనిస్తున్నాయి. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఏటా విడతల వారీగా నిధులు కేటాయిస్తున్నారు. ఈ క్రమంలో ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి తొలి విడతలో సగం కంటే ఎక్కువ నిధులు విడుదల చేశారు. వార్షిక ఏడాది ముగింపు దశలో రెండో విడత వాటా జమ అయ్యాయి. ఈ నెలా ఖరులోపు ఖర్చు చేయకుంటే నిధులు వెనక్కి వెళ్లిపోనున్నాయి. కార్యాలయ నిర్వహణకు ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ఎమ్మార్సీలకు నిధులు మంజూరు చేశారనే ఊరట ఆందోళన కలిగిస్తోంది. ఆఖరి నిమిషంలో ఎలా ఖర్చు చేయాలనే అయోమయం నెలకొంది.

నిర్వహణకు ఆర్థిక చేయూత

విద్యాభివృద్ధిలో ఎమ్మార్సీలు కీలకంగా వ్యవహరిస్తున్నాయి. మండలాల్లో విధులు నిర్వహిస్తున్న సీఆర్పీలు పాఠశాలల వారీగా సేకరిస్తున్న పలు రకాల సమాచారాన్ని ఎమ్మార్సీల పరిధిలో పర్యవేక్షిస్తున్నారు. కార్యాలయ సామగ్రి, విద్యుత్తు బిల్లులు, సమావేశాలు, కంప్యూటర్ల నిర్వహణ ఇతరత్ర అవసరాలకు విద్యాశాఖ గ్రాంట్లను మంజూరు చేస్తోంది. ఈ నిధులతో ఆర్థిక సమస్యలు తీరుతున్నాయి. నిధుల ఖర్చులో పారదర్శకత పాటిస్తున్నారు. ప్రతి పైసాకు లెక్క చెప్పాల్సి ఉంది.  

ఉమ్మడి జిల్లాకు రూ.39.48 లక్షలు

ఉమ్మడి జిల్లాలో 47 ఎమ్మార్సీలు ఉన్నాయి. ఒక్కో ఎమ్మార్సీకి ఏటా రూ.84 వేల చొప్పున నిధులు విడుదల చేస్తున్నారు. ఈ ఏడాదిలో తొలి విడతలో రూ.45 వేలు, ప్రస్తుతం రెండో విడతలో రూ.39 వేలు జమ చేశారు. ఉమ్మడి జిల్లాలో తొలిసారి రూ.21.15 లక్షలు, రెండోసారి రూ.18.33 లక్షలు మొత్తం రూ.39.48 లక్షలు మంజూరయ్యాయి. మార్చిలోపు నిధులు ఖర్చు చేయాలని ఆదేశించడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. మూడు రోజుల గడువు మిగిలి ఉండటంతో ఎలా ఖర్చు చేస్తామని ప్రశ్నిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని