logo

ఉగ్ర సంబంధాలపై ఆరా

రాజధాని నగరంలో రామేశ్వరం కేఫ్‌ పేలుడు కేసులో ప్రధాన నిందితుడు అబ్దుల్‌ మథీన్‌ తాహా తీవ్రవాద సంస్థ ఐసిస్‌లో కీలక సభ్యునిగా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అనుమానిస్తోంది.

Published : 16 Apr 2024 01:07 IST

బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే : రాజధాని నగరంలో రామేశ్వరం కేఫ్‌ పేలుడు కేసులో ప్రధాన నిందితుడు అబ్దుల్‌ మథీన్‌ తాహా తీవ్రవాద సంస్థ ఐసిస్‌లో కీలక సభ్యునిగా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అనుమానిస్తోంది. దర్యాప్తు లోతులకు వెళ్లే కొద్దీ ఒళ్లు జలదరించే నిజాలు బయటపడుతున్నాయి. ఐసిస్‌లో కర్నల్‌గా గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తితో తాహాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని గుర్తించారు. భారత్‌లో ఆ సంస్థకు తాహా కీలక వ్యక్తి అని అనుమానిస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లో అరెస్టు చేసిన తర్వాత గత శుక్రవారమే తాహాతోపాటు ముసావిర్‌లను బెంగళూరుకు తీసుకు వచ్చి, మడివాళ ఫోరెన్సిక్‌ ప్రయోగశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెల్‌లో ఎన్‌ఐఏ అధికారులు విచారణ చేపట్టారు. వారిని రామేశ్వరం కేఫ్‌కు తీసుకెళ్లి వివరాలు రాబట్టారు. ఇప్పటికే కోరమంగళలోని తాహా ఇంటికి వెళ్లి తనిఖీలు చేశారు.

‘కర్నల్‌’తో టచ్‌లో..

తాహా గతంలో 2022 నవంబరులో మంగళూరు కుక్కర్‌ బాంబ్‌ కేసులో నిందితుడు. దీనికి ఐసిస్‌ నగదు సమకూర్చినట్లు అనుమానిస్తున్నారు. అదే ఏడాది శివమొగ్గలో జరిగిన పేలుళ్లలో ఇతడి హస్తం ఉంది. అంతకు ముందు 2020లో ‘అల్‌ హింద్‌ మాడ్యూల్‌’ కేసులోనూ భాగస్వామిగా గుర్తించారు. దక్షిణ, మధ్య భారత్‌లో జరిగిన అనేక ఉగ్రవాద కేసులతో సంబంధం ఉన్న ‘కర్నల్‌’ అనే వ్యక్తితో తాహా టచ్‌లో ఉన్నట్లు తేలింది. కర్నల్‌తో ఉన్న సంబంధాలు, అతను ఎక్కడ ఉంటాడు, నగదు ఎలా పంపించేవాడు.. తదితర విషయాలను గుర్తించే దిశలో విచారణను కొనసాగించారు.

స్పాట్ల కోసం రెక్కీ

రామేశ్వరం కేఫ్‌లో తాహానే స్వయంగా వారం రోజులు రెక్కీ నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇక్కడి బ్లైండ్‌ స్పాట్లు (సీసీ కెమెరాలు చిత్రీకరించలేని ప్రదేశాలు) గుర్తించడమే లక్ష్యంగా దీనిని చేపట్టాడు. కెఫేలోకి బాంబర్‌ ఎటు నుంచి రావాలి? ఎటునుంచి వెళ్లిపోవాలి? అనే వివరాలు నిర్ణయించింది ఇతడే అని తెలుస్తోంది. బాంబింగ్‌ తర్వాత తాను తమిళనాడు నుంచి, షాజిబ్‌ బెంగళూరు  నుంచి పరారయ్యేందుకు మార్గాలను ఎంపిక చేశాడు.

సాయం చేసిందెవరు?

ఈ కేసులో ప్రధాన నిందితులు తాహా, షాజిబ్‌లకు పశ్చిమబెంగాల్‌లో ఒకరు సాయం చేసినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) భావిస్తోంది. రామేశ్వరం కేఫ్‌ కేసులో తొలుత చెన్నైలో అరెస్టైన ముజమ్మిల్‌ షరీఫే నిందితులకు లాజిస్టికల్‌ సపోర్ట్‌ అందించినట్లు అధికారులు చెబుతున్నారు. పేలుడు తర్వాత నిందితులు రాంచీలో వారం రోజులు బస చేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత కోల్‌కతాకు వెళ్లగా అక్కడ షరీఫ్‌ వారిని కలిసి నగదు అందించాడు. వేర్వేరు హోటళ్లు మారుతూ నిందితులు కోల్‌కతాలోనే నక్కారు. దాడి తర్వాత తొలినాళ్లలో అప్రమత్తంగా ఉన్న నిందితులకు తర్వాత ధైర్యం వచ్చింది. షరీఫ్‌ ఇచ్చిన సొమ్ముతో తాహా, షాజిబ్‌ కలిసి కోల్‌కతా, డార్జిలింగ్‌, పురులియా, డిఘాలో తిరిగారు. ఈ సందర్భంగా మొత్తం నగదు రూపంలో చెల్లింపులు చేశారని అధికారులు చెప్పినట్లు ఓ ఆంగ్లపత్రిక ప్రస్తావించింది. దర్యాప్తు సంస్థల నుంచి తప్పించుకొనేందుకు అవసరమైతే బంగ్లాదేశ్‌ పారిపోయేందుకు వీలుగా వీరు కోల్‌కతాను ఎంచుకొన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు