logo

భాజపాను ఆశీర్వదించండి

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన భాజపాను ఖమ్మం ప్రజలు లోక్‌సభ ఎన్నికల్లో ఆశీర్వదించాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ కోరారు.

Published : 20 Apr 2024 02:19 IST

కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌

రోడ్‌ షోలో అభివాదం చేస్తున్న కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, చిత్రంలో భాజపా అభ్యర్థి తాండ్ర వినోద్‌రావు

ఈటీవీ- ఖమ్మం, న్యూస్‌టుడే, ఖమ్మం నగరం: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన భాజపాను ఖమ్మం ప్రజలు లోక్‌సభ ఎన్నికల్లో ఆశీర్వదించాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ కోరారు. భాజపా అభ్యర్థి తాండ్ర వినోద్‌రావుకు మద్దతుగా ఖమ్మంలో శుక్రవారం నిర్వహించిన రోడ్‌షోలో మాట్లాడారు. రాష్ట్రంలో గత భారాస ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్‌ సర్కారు అవినీతిని పెంచి పోషిస్తున్నాయని విమర్శించారు. దేశానికి మోదీ నేతృత్వంలోని భాజపా ఒక్కటే భరోసా కల్పిస్తోందన్నారు. ఖమ్మం లోక్‌సభ భాజపా అభ్యర్థి తాండ్ర వినోద్‌రావును గెలిపించి పార్లమెంట్‌కు పంపించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ జిల్లా ప్రజలకు అందించేలా వినోద్‌రావు కృషిచేస్తారని పేర్కొన్నారు. అంతకుముందు తాండ్ర వినోద్‌రావు మాట్లాడుతూ భారాస, కాంగ్రెస్‌ పాలనలో ఖమ్మం జిల్లాకు ఒరిగిందేమీ లేదన్నారు. ఖమ్మం జిల్లా బాగుపడాలంటే భాజపాకు పట్టం కట్టాలని కోరారు.

ఘనస్వాగతం పలికిన కాషాయ శ్రేణులు.. మధ్యాహ్నం విజయవాడ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో ఖమ్మం సర్దార్‌ పటేల్‌ మైదానంలో కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ దిగారు. ఆయనకు భాజపా నేతలు ఘనస్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి మయూరి సెంటర్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. ఓపెన్‌ టాప్‌ వాహనంపై రాజ్‌నాథ్‌సింగ్‌ అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల భాజపా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ, రంగాకిరణ్‌,  నాయకులు పొంగులేటి సుధాకర్‌రెడ్డి, కొండపల్లి శ్రీధర్‌రెడ్డి, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, డాక్టర్‌ గోంగూర వెంకటేశ్వర్లు, కార్పొరేటర్‌ దొంగల సత్యనారాయణ, సన్నె ఉదయ్‌ ప్రతాప్‌, నంబూరి రామలింగేశ్వరరావు, నున్నా రవికుమార్‌, డాక్టర్‌ శీలం పాపారావు, భాజపా, ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తలు పాల్గొన్నారు.

తాండ్ర నామినేషన్‌

ఆర్‌ఓ గౌతమ్‌కు నామపత్రం అందజేస్తున్న తాండ్ర వినోద్‌రావు, చిత్రంలో పొంగులేటి సుధాకర్‌రెడ్డి, సత్యనారాయణ

ఖమ్మం నగరం, న్యూస్‌టుడే: ఖమ్మం లోక్‌సభ స్థానంలో భాజపా అభ్యర్థిగా తాండ్ర వినోద్‌రావు శుక్రవారం నామినేషన్‌ వేశారు. భాజపా నాయకులు పొంగులేటి సుధాకర్‌రెడ్డి, గల్లా సత్యనారాయణ, వెంకట రంగాకిరణ్‌ పాల్గొన్నారు. వినోద్‌రావు స్వస్థలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం తిమ్మంపేట. ఈ సందర్భంగా వినోద్‌రావు మాట్లాడుతూ ఖమ్మం లోక్‌సభ స్థానంలో భాజపా విజయం ఖాయమని చెప్పారు. కేంద్రంలో నరేంద్రమోదీ మూడోసారి అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని