logo

సర్దుపోట్లు

ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ కొత్త సమస్యలకు దారి తీస్తోంది. సబ్జెక్టు ఉపాధ్యాయుల కొరత ఉన్న చోట సమీపంలోని పాఠశాల నుంచి.. లేదా మండలంలోని ఇతర పాఠశాలలు..

Published : 07 Dec 2022 03:26 IST

ప్రభుత్వ చర్యలతో బోధనపై ప్రభావం

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే: ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ కొత్త సమస్యలకు దారి తీస్తోంది. సబ్జెక్టు ఉపాధ్యాయుల కొరత ఉన్న చోట సమీపంలోని పాఠశాల నుంచి.. లేదా మండలంలోని ఇతర పాఠశాలలు.. అక్కడా లేకపోతే పక్క మండలాల్లో పనిచేస్తున్న వారిని నియమించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విద్యా సంవత్సరం మధ్యలో ఉపాధ్యాయులను కదిలించడం బోధనపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

తెలుగు.. ఆంగ్లం.. ఖాళీలు

కర్నూలు జిల్లాలో 1,437, నంద్యాలలో 1,368 పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 425 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. గత మూడేళ్లలో 16 ప్రాథమికోన్నత పాఠశాలలను ఉన్నత పాఠశాలలుగా ఉన్నతీకరించారు. వీటిలో చాలాచోట్ల ప్రధానోపాధ్యాయులు, సబ్జెక్టు ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటికి అదనంగా విలీన పాఠశాలలు తోడయ్యాయి. వీటన్నింటిలో సబ్జెక్టు ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలంటే 460 మంది వరకు ఉపాధ్యాయులు అవసరం కానున్నారు. ప్రస్తుతం రెండు జిల్లాల పరిధిలో సబ్జెక్టు మార్పిడి ద్వారా 290 మందిని సర్దుబాటు చేస్తున్నారు. మరో 200 మంది వరకు ఉపాధ్యాయుల కొరత కనిపిస్తోంది. తెలుగు, ఆంగ్లం, హిందీలోనే ఎక్కువ ఖాళీలు ఉన్నాయి.

పదోన్నతులు పక్కనపెట్టి

ఉమ్మడి జిల్లాలో గణితం 293, భౌతిక శాస్త్రం 117, జీవ శాస్త్రం 153, సాంఘిక 143, ఆంగ్లం 303, తెలుగు 175, హిందీ 163, ఉర్దూ 11, కన్నడ 11, మరో 184 మందికి ఇప్పటికే పదోన్నతులు ఇచ్చారు. వీరికి పాఠశాలలు కేటాయించలేదు. సబ్జెక్టు ఉపాధ్యాయులుగా పదోన్నతులు పొందిన వారిని పక్కన పెట్టి కొత్తగా మిగులు ఉపాధ్యాయులతో భర్తీ చేసే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. పదోన్నతులు పొందిన ఉపాధ్యాయులతో కాకుండా సబ్జెక్టు నిపుణుల పేరుతో ఎస్జీటీలను ఉన్నత పాఠశాలల్లో సర్దుబాటు చేసేందుకు తెరలేపారు.

బోధనపై తీవ్ర ప్రభావం

ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు ఉపాధ్యాయుల కొరత వేధిస్తోంది. దీనికితోడు ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను సమీప ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో విలీనం చేశారు. దీంతో ఉపాధ్యాయుల కొరత మరింత పెరిగింది. 3, 4, 5 తరగతులకు సంబంధిత సబ్జెక్టు ఉపాధ్యాయులే బోధిస్తారని ప్రభుత్వం చేసిన ప్రకటన, ఉత్తర్వులు నీరుగారిపోయాయి. ఇవేవీ పట్టించుకోకుండా పదోన్నతులు పొందిన వారికి బడులను కేటాయించకుండా పక్కనపెట్టి మిగిలిన వారిని గుర్తించి సర్దుబాటు చేస్తుండటం గమనార్హం.

ప్రారంభమైన పైరవీలు

సర్దుబాటు పేరుతో ఓ వైపు ఉపాధ్యాయులను సమకూర్చే ప్రక్రియ ప్రారంభం కాగా.. ఇదే సమయంలో కొంతమంది ఉపాధ్యాయులు రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులను ఆశ్రయిస్తున్నారు. మిగులు ఉపాధ్యాయుల పేరుతో మారుమూల పాఠశాలకు పంపిస్తారేమోనన్న అనుమానంతో ముందుగానే అప్రమత్తమై సమీప పాఠశాలల్లో పోస్టింగ్‌లు తెచ్చుకునేందుకు పైరవీలు సాగిస్తున్నట్లు చర్చ సాగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని