logo

కారు, బొలెరో ఢీకొని ఎనిమిది మందికి గాయాలు

ఆళ్లగడ్డ మండలంలోని కోటకందుకూరు గ్రామ మెట్ట వద్ద 40వ జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున కారు, బొలెరో వాహనం ఢీకొన్నాయి.

Published : 09 Dec 2022 03:44 IST

గాయపడిన వారిలో సినీ రచయిత రాజసింహ

గాయపడిన సినీ  రచయిత రాజసింహ

కోటకందుకూరు (ఆళ్లగడ్డ గ్రామీణం), న్యూస్‌టుడే: ఆళ్లగడ్డ మండలంలోని కోటకందుకూరు గ్రామ మెట్ట వద్ద 40వ జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున కారు, బొలెరో వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. ఇందులో సినీ దర్శకుడు, రచయిత రాజసింహ గాయపడ్డారు. అన్నమయ్య జిల్లా పెద్దమండ్యం మండలం కలిచర్ల (ఎర్రగొట్టపల్లె)కు చెందిన 18 మంది బొలెరో వాహనంలో ఆలయాలను దర్శించుకొనేందుకు ఈ నెల 4న బయలుదేరారు. ఈ క్రమంలో అహోబిలం దర్శించుకుని స్వగ్రామానికి పయనమయ్యారు. కోటకందుకూరు మెట్ట వద్ద దారిని గుర్తించలేక ఆళ్లగడ్డ వైపు రాసాగారు. ఈ క్రమంలో హైదరాబాద్‌ నుంచి చిత్తూరు వైపు వెళ్తున్న కారు ఎదురుగా వస్తున్న వీరి బొలెరోను ఢీకొంది. ఈ ప్రమాదంలో అన్నమయ్య జిల్లాకు చెందిన సహదేవరెడ్డి, శ్రీదేవి, పాపలమ్మ, రమణమ్మ, వెంకటస్వామి, రవీంద్రారెడ్డితోపాటు మరొకరికి, కారు నడుపుతున్న సినీ రచయిత రాజసింహకు గాయాలయ్యాయి. వారిని 108 సిబ్బంది మురళీమోహన్‌, నాగార్జునరెడ్డి ఆళ్లగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం రాజసింహను నంద్యాలకు తీసుకెళ్లారు. హైదరాబాద్‌కు చెందిన రాజసింహ ఒక అమ్మాయి తప్ప అనే సినిమాకు దర్శకత్వంతోపాటు రుద్రమదేవి, సరైనోడు వంటి ప్రముఖ చిత్రాలకు రచయితగా పని చేశారు. ఘటనపై ఫిర్యాదు అందకపోవడంతో కేసు నమోదు చేయలేదని ఎస్సై నరసింహులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని