logo

జాబ్‌ క్యాలెండర్‌ పేరుతో మోసం చేశారు

రాష్ట్రంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ పతనానికి నిరుద్యోగులు నాంది పలకనున్నారని కర్నూలు పార్లమెంట్‌ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు.

Published : 02 Apr 2023 02:49 IST

సోమిశెట్టి ధ్వజం

మాట్లాడుతున్న సోమిశెట్టి, పక్కన నాగేశ్వరరావు యాదవ్‌ తదితరులు

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ పతనానికి నిరుద్యోగులు నాంది పలకనున్నారని కర్నూలు పార్లమెంట్‌ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. ఆయన శనివారం నగరంలోని తెదేపా కార్యాలయంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వై.నాగేశ్వరరావు యాదవ్‌తో కలిసి మాట్లాడారు. తనను గెలిపిస్తే అధికారంలోకి రాగానే రాష్ట్రానికి పరిశ్రమలు తెచ్చి ఉద్యోగావకాశాలు కల్పిస్తానని.. ఏటా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేసి ఉద్యోగాల భర్తీ చేపడుతామని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చాక యువతను పూర్తిగా విస్మరించారని ధ్వజమెత్తారు. లోకేశ్‌ పాదయాత్రకు ప్రజలు రాకుండా చేసేందుకు పోలీసులను అడ్డుపెట్టుకొని నానా ఇబ్బందులకు గురిచేశారన్నారు. లోకేశ్‌కు యువత అండగా ఉంటోందని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డిపై వైకాపా వారు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. పరిశ్రమల స్థాపన, ఉద్యోగావకాశాలు, విద్యాభివృద్ధి కోసం చంద్రబాబునాయుడు అహర్నిశలు కృషి చేశారని, ఈ నేపథ్యంలో మరోసారి చంద్రబాబు పాలన రావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారని చెప్పారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు సోమిశెట్టి నవీన్‌, నంది మధు, పి.రవికుమార్‌, హనుమంతరావు చౌదరి, నాగరాజు యాదవ్‌, చంద్రకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.


ఆర్యవైశ్యులపై దాడులు అధికమయ్యాయి..

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో అన్నివర్గాల ప్రజలపై దాడులు జరిగాయని, ప్రస్తుతం ఆర్యవైశ్యులపై దాడులు ఎక్కువయ్యాయని కర్నూలు పార్లమెంట్‌ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. తెనాలిలో అభివృద్ధి పనులపై ప్రశ్నించిన కౌన్సిలర్‌ యుగంధర్‌పై వైకాపా వారు దాడికి పాల్పడ్డారని.. దీనిని ఖండిస్తున్నామన్నారు. కౌన్సిలర్‌పై దాడికి నిరసనగా తెనాలిలో బంద్‌కు పిలుపునివ్వగా ఆర్యవైశ్యులు స్వచ్ఛందంగా దూకాణాలు మూసివేసి నిరసన తెలిపారన్నారు. శాంతియుతంగా ధర్నాకు దిగిన వారిని బజారులో ధర్నా చేయకూడదంటూ పోలీసులు తరిమికొట్టడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. ఆర్యవైశ్యులందరూ మేల్కొని రానున్న రోజుల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి తగిన బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని