logo

Chandrayaan-3: చంద్రయాన్‌-3లో జోగులాంబ గద్వాల జిల్లా యువకుడు

జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లికి చెందిన కృష్ణ కుమ్మరి చంద్రయాన్‌ - 3 మిషన్‌లో 2 పేలోడ్స్‌ (ఏహెచ్‌వీసీ), (ఐఎల్‌ఎస్‌ఏ)కి డేటా ప్రాసెసింగ్‌ సాఫ్ట్‌వేర్‌ రాశారు.

Updated : 23 Aug 2023 07:58 IST

ఉండవల్లి, న్యూస్‌టుడే: జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లికి చెందిన కృష్ణ కుమ్మరి చంద్రయాన్‌ - 3 మిషన్‌లో 2 పేలోడ్స్‌ (ఏహెచ్‌వీసీ), (ఐఎల్‌ఎస్‌ఏ)కి డేటా ప్రాసెసింగ్‌ సాఫ్ట్‌వేర్‌ రాశారు. కూలి పనులు చేస్తూ జీవనం సాగించే ఉండవల్లికి చెందిన లక్ష్మీదేవి, మద్దిలేటి దంపతుల కృష్ణ కుమ్మరి, శకుంతల సంతానం. కృష్ణ విద్యాభ్యాసం 1 నుంచి 10 వరకు ఉండవల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో కొనసాగింది. 10వ తరగతి 2008 పూర్తి చేసి మూడేళ్లు తిరుపతిలో డిప్లొమా ఇన్‌ కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ (డీసీఎంఈ) చేశాడు. ఈ-సెట్‌ పరీక్ష రాసి హైదరాబాదులో (2011 - 2014 ) సీఎస్‌ఈ (కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌) చేశారు. కళాశాల ప్లెస్‌మెంట్‌లో భాగంగా టెరా డేటా రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థలో మూడున్నర సంవత్సరాలు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేశారు. ఉద్యోగం చేస్తూనే ఇస్రోలో ఐసీఆర్‌బీ (ఇస్రో సెంట్రలైజడ్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు పరీక్ష) రాసి ఆల్‌ఇండియా స్థాయిలో 4వ ర్యాంకు సాధించారు. అనంతరం 2018 జనవరిలో సైంటిస్ట్‌ లెవల్‌ ఉద్యోగం (గ్రూప్‌ ‘ఏ’ గెజిడెట్‌ అధికారి) యూఆర్‌ రావు శాటిలైట్‌ సెంటర్‌ (యూఆర్‌ఎస్‌సీ) / ఇస్రోలో ఓ యూనిట్‌ ల్యాబొరేటరీ ఫర్‌ ఎలక్ట్రో ఆప్టిక్స్‌ సిస్టమ్‌ (ఎల్‌ఈఓఎస్‌) బెంగళూరులో సాధించారు.

చంద్రయాన్‌ - 3లో ప్రస్థానం..: చంద్రయాన్‌ - 3 అనేక కేంద్రాలు పనిచేశాయి. మిషన్‌లోని 2 పేలోడ్స్‌లో 5 మంది సభ్యులు పనిచేసినా, వీటిలో ఎల్‌హెచ్‌వీసీ, ఐఎల్‌ఎస్‌ఏకు కృష్ణ కుమ్మరి డేటా ప్రాసెసింగ్‌ అనాలసిస్‌ సాఫ్ట్‌వేర్‌ రాసినట్లు తెలిపారు. ఎల్‌హెచ్‌వీసీ అంటే హారిజాంటల్‌ వెలాసిటీని చెబుతుందని, ఐఎల్‌ఎస్‌ఏ అంటే చంద్రుడిపై వచ్చే కంపనాలు గుర్తించి రికార్డు చేస్తుందని కృష్ణ తెలిపారు. ఈ సాఫ్ట్‌వేర్‌ పేలోడ్స్‌ నుంచి వచ్చే డేటాని ఐఎస్‌టీఆర్‌ఏసీ, బెంగళూరు అందుకుంటుందన్నారు. చంద్రయాన్‌ -3 మిషన్‌కు 6 నెలల పాటు పని చేసినట్లు వివరించారు. చంద్రయాన్‌ -3 మిషన్‌ 100 శాతం విజయవంతం అవుతుందని ఆశిస్తున్నారు.

క్యారమ్స్‌లోనూ ప్రతిభ: ల్యాబోరేటరీ ఫర్‌ ఎలక్ట్రో ఆప్టిక్స్‌ సిస్టమ్‌ (ఎల్‌ఈఓఎస్‌), బెంగళూరులో తోటి సెంటిస్టులతో ఆడే క్యారమ్స్‌ పోటీల్లో రెండేళ్లు వరుసగా ఛాంపియన్‌గా నిలిచారు. తిరువనంతపురంలో జరిగిన నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ ఏరోస్పేస్‌ క్వాలిటీ అండ్‌ రిలయబిలిటీ (ఎన్‌సీఏక్యూఆర్‌-2022) కార్యక్రమంలో నేషనల్‌ వైడ్‌ మెంబర్‌గా పాల్గొన్నట్లు వివరించారు.


పోలియోకు ఆయుర్వేద వైద్యం: ఐదేళ్ల వయస్సులో తనకు పోలియో సోకి నరాలు చచ్చుబడ్డాయని దీనికి అయిజలోని ఆయుర్వేద వైద్యుడు రామేశ్వర్‌రెడ్డి వద్ద వైద్యం పొందినట్లు వివరించారు. 10 సంవత్సరాల వయస్సు వచ్చేసరికి స్వతంత్రంగా లేచి తన పనులు చేసుకునేవాడనని వివరించారు. దాదాపు 23 ఏళ్ల పాటు ఆయుర్వేద మందులు వాడినట్లు చెబుతున్నారు. తోకవడ్లతో చేసిన గంజి శరీరానికి పూసి గంట తర్వాత స్నానం చేస్తే నరాల్లో రక్తప్రసరణ జరిగి కండరాలు వదులు అయ్యేవని వివరిస్తున్నారు. తల్లిదండ్రులు జన్మనిచ్చారని వైద్యుడు పునర్జన్మ నిచ్చారని, తాత స్ఫూర్తితో రాణిస్తున్నట్లు కృష్ణ అంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని