logo

మండు వేసవిలో నిండు కుండ

ఉమ్మడి నల్గొండ జిల్లాలో నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు తర్వాత రెండో పెద్ద జలాశయంగా పేరున్న మూసీ రిజర్వాయర్‌ పూర్తిగా నిండింది.

Published : 02 Jun 2023 04:48 IST

గరిష్ఠ నీటి మట్టానికి చేరిన మూసీ జలాశయం
నేడో రేపో గేట్లు ఎత్తే అవకాశం

గరిష్ఠ స్థాయి నీటిమట్టంతో మూసీ రిజర్వాయర్‌

కేతేపల్లి, న్యూస్‌టుడే: ఉమ్మడి నల్గొండ జిల్లాలో నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు తర్వాత రెండో పెద్ద జలాశయంగా పేరున్న మూసీ రిజర్వాయర్‌ పూర్తిగా నిండింది. నల్గొండ జిల్లా కేతేపల్లి మండలంలో ఉన్న రిజర్వాయర్‌ పూర్తిగా నిండేందుకు ఇంకో అర అడుగు మేర మాత్రమే నీరు చేరాల్సి ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న నీటితో ప్రాజెక్టు నీటిమట్టం ఎప్పటికప్పుడు పెరుగుతుండటంతో నేడో, రేపో గేట్లు ఎత్తే అవకాశం ఉందని ఇంజినీరింగ్‌ అధికారులు చెబుతున్నారు. మూసీ ఎగువ ప్రాంతాలైన హైదరాబాద్‌ నగరంతో పాటు మేడ్చల్‌-మల్కాజిగిరి, రంగారెడ్డి, యాదాద్రిభువనగిరి, జనగామ జిల్లాల వాగులు, వంకల ద్వారా ఇటీవలి అకాల వర్షాలకు వరదనీరు వచ్చి చేరింది. దీంతో మండు వేసవిలో మూసీ ప్రాజెక్టు జలాశయం నీటిమట్టం రోజురోజుకు పెరుగుతూ నిండుకుండలా మారింది. రిజర్వాయర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా, గురువారం సాయంత్రం వరకు 644.50 అడుగులకు చేరుకుంది. నీటినిలువ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 4.32 టీఎంసీల నీరు రిజర్వాయర్‌లో ఉందని నీటిపారుదలశాఖ ఇంజినీరింగ్‌ అధికారులు తెలిపారు. మూసీ ఎగువప్రాంతాల నుంచి 1004 క్యూసెక్కుల వరదనీరు వస్తోంది. ప్రాజెక్టు పూర్తిగా నిండే దశలో ఉన్నందున అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు