logo

వంతెన లేక గిరిజనుల వెతలు

రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలకు మెరుగైన రవాణాకు పెద్దపీట వేస్తోంది. రహదారుల నిర్మాణానికి రూ.కోట్ల నిధులు వెచ్చిస్తోంది.

Published : 27 Mar 2023 06:04 IST

వెంకటాపురం-మల్లాపురం మధ్య కంకలవాగుపై వారధి నిర్మించాల్సింది ఇక్కడే..

వెంకటాపురం(ములుగు జిల్లా), న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలకు మెరుగైన రవాణాకు పెద్దపీట వేస్తోంది. రహదారుల నిర్మాణానికి రూ.కోట్ల నిధులు వెచ్చిస్తోంది. అయితే ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు ఉన్న చోట వారధుల నిర్మాణం చేపట్టకపోవడంతో గిరిజనం కష్టాలు పడాల్సి వస్తోంది. వెంకటాపురం మండలంలోని మల్లాపురం, కర్రివానిగుంపు గిరిజనులు వర్షాకాలంలో కంకలవాగు వల్ల రాకపోకలకు అవస్థలు పడుతున్నారు. తారుదారి నిర్మించినా ప్రయోజనం లేకుండా పోతోంది. ఓ మోస్తరు వర్షానికే వాగు ఉప్పొంగి రోజుల తరబడి బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోవాల్సిన పరిస్థితి నెలకొంది.


రూ.4.11 కోట్లతో ప్రతిపాదనలు

కంకలవాగుపై వంతెన నిర్మాణానికి పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ అధికారులు ప్రతిపాదించారు. తొలుత ఇక్కడ రూ.25 లక్షలతో శ్లాబ్‌ కల్వర్టు నిర్మించేందుకు నిధులు కేటాయించినా ఆ పనులను రద్దు చేశారు. వరద ప్రభావిత ప్రాంత ప్రత్యేక కోటా కింద రూ.4.11 కోట్ల నిధులతో హైలెవల్‌ వంతెన కట్టేందుకు నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా ఇటీవలే టెండరు ప్రక్రియ సైతం పూర్తైనట్లు తెలుస్తోంది. వారధి నిర్మించేందుకు ఇదే అనువైన సమయం. అధికారులు త్వరితగతిన పనులు చేపడితే వచ్చే వానాకాలంలోనైనా గిరిజనులకు మోక్షం కలిగే అవకాశం ఉంటుంది.


త్వరలో పనులు ప్రారంభిస్తాం: రాజేశ్‌, పీఆర్‌ ఏఈఈ

వంతెన నిర్మాణానికి సంబంధించి ఇటీవల టెండరు ప్రక్రియ పూర్తైనట్లు ఉన్నతాధికారుల నుంచి సమాచారం అందింది. వరంగల్‌కు చెందిన ఓ గుత్తేదారు ఈ పనులు దక్కించుకున్నట్లు తెలిసింది. త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి. నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి వర్షాకాలంలో రాకపోకలు కొనసాగేలా చర్యలు తీసుకుంటాం.


వాగు ఉప్పొంగితే రాకపోకలు బంద్‌

మల్లాపురం, కర్రివానిగుంపు గిరిజన గ్రామాలకు మండల కేంద్రానికి చేరువ చేసేందుకు ప్రభుత్వం సంకల్పించింది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో పీఎంజీఎస్‌వైలో భాగంగా రహదారి ఆధునికీకరణ, కల్వర్టు నిర్మాణానికి రూ.3.62 లక్షలు మంజూరు చేసింది. దాదాపు 5.3 కి.మీ మేరకు అధికారులు మట్టిరోడ్డును తారుదారిగా మార్చారు. గ్రామాల్లో సిమెంట్‌ రహదారులను నిర్మించారు. పలు ప్రాంతాల్లో కల్వర్టులను కట్టారు. కానీ ఈ మార్గంలోని కంకలవాగుపై వారధి నిర్మాణం చేపట్టకపోవడంతో వానాకాలంలో అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. గతేడాది జులై, ఆగస్టులో కురిసిన వర్షాలకు దాదాపు నెల రోజులకు పైగా ఈ మార్గంలో రాకపోకలు నిలిచాయి. అత్యవసర సమయంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడపాల్సి వస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని