logo

34 మంది ఇటుకబట్టీ కార్మికులకు విముక్తి

ఇటుక బట్టీల్లో వెట్టి చాకిరీ చేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న 34 మంది కూలీలను శుక్రవారం అధికారులు కాపాడారు.

Published : 01 Apr 2023 04:11 IST

ఇటుకబట్టిలో బిక్కుబిక్కు మంటూ కూర్చున్న కార్మికులు

ఈనాడు, వరంగల్‌, నర్సంపేట రూరల్‌, న్యూస్‌టుడే: ఇటుక బట్టీల్లో వెట్టి చాకిరీ చేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న 34 మంది కూలీలను శుక్రవారం అధికారులు కాపాడారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రంలోని బొలంగీర్‌, సోనేపుర్‌, బార్గా జిల్లాల్లోని వివిధ గ్రామాలకు చెందిన కొందరు కార్మికులు అయిదు నెలల కిందట వరంగల్‌ జిల్లా నర్సంపేట మండలం రాజుపేట శివారులో చింతగడ్డతండాలోని ఇటుకబట్టిలో పనిచేసేందుకు పిల్లా పాపలతో వచ్చారు. ఒక్కొక్కరికీ రోజుకు రూ.500 ఇస్తామని చెప్పిన బట్టీల యజమానులు వీరితో వెట్టి చాకిరీ చేయిస్తున్నారు. రోజుకు రూ.200 చెల్లిస్తూ. నిత్యం 16 గంటల పాటు పని చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. తాగునీటి వసతి కూడా ఏర్పాటు చేయలేదు. బట్టి యజమానితో పాటు మరికొందరు వ్యక్తులు మహిళలను, చిన్నారులను వేధిస్తూ కార్మికుల ఆధార్‌ కార్డులు, సెల్‌ ఫోన్లు లాక్కున్నారు. ఈ బాధలు భరించలేక 25 మంది కొన్ని రోజుల కిందట రాత్రికిరాత్రి తమ స్వస్థలానికి తప్పించుకుపోయారు. ఒడిశా రాష్ట్ర లీగల్‌ సర్వీస్‌ అథారిటీకి ఫిర్యాదు చేశారు. అక్కడ న్యాయ సేవా సంస్థ సభ్యులు తెలంగాణ రాష్ట్ర లీగల్‌ సర్వీస్‌ అథారిటీకి లేఖ రాసి కూలీలను కాపాడాలని కోరారు. లేఖ అందుకున్న వరంగల్‌ జిల్లా ఛైల్డ్‌ వెల్ఫేర్‌ ఛైర్‌పర్సన్‌ వసుధ, ఇన్‌ఛార్జి డీసీపీవో రాజు, సీఐ రమేష్‌, ఎస్సై రవీందర్‌ ఆధ్వర్యంలో శుక్రవారం ఇటుకబట్టిలో పనిచేస్తున్న కార్మికుల వద్దకు వెళ్లారు. పని ప్రదేశంలో పడుతున్న ఇబ్బందులను అధికారులకు కార్మికులు మొరపెట్టుకున్నారు. 26 మంది కార్మికులతో పాటు ముగ్గురు బాల కార్మికులు, ఐదుగురు పసి పిల్లలతో కలిపి మొత్తం 34 మందిని కాపాడి వరంగల్‌ శివనగర్‌లోని డాన్‌బాస్కో ఆశ్రమానికి తరలించారు. స్వస్థలాలకు సురక్షితంగా పంపుతామని సీడబ్ల్యూసీ ఛైర్‌ పర్సన్‌ వసుధ తెలిపారు.

‘ఈనాడు’ ముందే చెప్పింది

ఇటుక బట్టీల్లో ఇతర రాష్ట్రాల కార్మికుల కష్టాల గురించి ‘ఈనాడు’ ముందే చెప్పింది. ఫిబ్రవరి 23న ‘బట్టీల్లో బతుకులు ఛిద్రం’ శీర్షికన కథనం ప్రచురితమైంది. కార్మికుల పిల్లలు చదువుకు దూరమవుతున్న తీరు, ఉండడానికి గూడు సరిగా లేని వైనం, మహిళలకు సరైన మరుగుదొడ్లు, స్నానాల గదులు లేని దుస్థితి వివరించింది.  కానీ అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరూ బట్టీల్లో తనిఖీలు చేయకపోవడంతో వేధింపులు అలాగే కొనసాగాయి. చివరకు న్యాయ సేవా ప్రాథికార సంస్థ చొరవతో కొందరు కార్మికులకు విముక్తి కలిగింది. వరంగల్‌ రంగశాయిపేట ప్రాంతంలోనూ ఆకస్మిక తనిఖీలు చేస్తే మరికొందరికి విముక్తి కలుగుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని