logo

ఐటీడీఏలు ఎదగాలి.. గిరిజనం మురవాలి

ఐటీడీఏ.. సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ. కొన్నేళ్లుగా గాడితప్పింది. వీటి ఫలాలు గిరి పుత్రులకు పూర్తి స్థాయిలో అందడం లేదు. ఇప్పుడు పూర్వవైభవం చూడాలని గిరిపుత్రులు ఆశిస్తున్నారు.

Updated : 10 May 2024 05:49 IST

ఎంపీ అభ్యర్థులపై ఆశలు

మహబూబాబాద్‌ జిల్లా గూడూరులో ఐటీడీఏలను బలోపేతం చేయాలని డిమాండ్‌ చేస్తున్న ఆదివాసీలు (పాతచిత్రం)

ఐటీడీఏ.. సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ. కొన్నేళ్లుగా గాడితప్పింది. వీటి ఫలాలు గిరి పుత్రులకు పూర్తి స్థాయిలో అందడం లేదు. ఇప్పుడు పూర్వవైభవం చూడాలని గిరిపుత్రులు ఆశిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ పడుతున్న అభ్యర్థులు రాజకీయాలకతీతంగా వాటి బలోపేతంపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు.

ఈనాడు, మహబూబాబాద్‌, న్యూస్‌టుడే,  ఏటూరునాగారం, భద్రాచలం

‘గిరిజనుల స్వయం ప్రతిపత్తిని కాపాడుతూనే.. షెడ్యూల్‌ ప్రాంతాల్లో అభివృద్ధి, ఆచార సంప్రదాయాల పరిరక్షణ ధ్యేయంగా ఐటీడీఏలను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రత్యేకంగా గిరిజనులకే కలెక్టరేట్‌గా పిలుచుకునే ఈ సంస్థలు రాష్ట్రంలో నాలుగు ప్రాంతాల్లో ఉంటే.. వాటిలో ఏటూరునాగారం, భద్రాచలం కేంద్రాలు మహబూబాబాద్‌ లోక్‌సభ స్థానం పరిధిలో ఉన్నాయి.’  

మారిన స్వరూపం

భద్రాచలం:  రాష్ట్ర విభజనకు ముందు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 29 మండలాలు ఐటీడీఏ పరిధిలో ఉండేవి. విభజన తర్వాత ఐదు మండలాలు పూర్తిగా, రెండు మండలాలు పాక్షికంగా ఏపీలో కలిశాయి. 2016లో జిల్లాల పునర్విభజన, కొత్త మండలాల ఏర్పాటుతో ఐటీడీఏ స్వరూపం మారింది. గతంలో ఒక్క జిల్లాతో కొనసాగింది ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ములుగు, మహబూబాబాద్‌ జిల్లాలకు విస్తరించింది. దీని పరిధిలో 32 మండలాలు ఉండడం విశేషం. 2011 జనాభాల లెక్కల ప్రకారం 5.32 లక్షల ఎస్టీ జనాభా ఉంటుంది. 

ఏటూరునాగారం: ఉమ్మడి వరంగల్‌ జిల్లా పరిధిలోని ఏటూరునాగారం ఐటీడీఏ జిల్లా పునర్విభజనతో దాని పరిధి ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, జనగామ జిల్లాలకు విస్తరించింది. దీని పరిధిలో 75 మండలాలుండగా సుమారు 13 ఏజెన్సీ మండలాలున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం 6.18 లక్షల ఎస్టీ జనాభా ఉన్నట్లు ఒక అధికారి తెలిపారు.

యువ శిక్షణ కేంద్రాలను పెంచాలి

గిరిజన యువతలో నైపుణ్యాలను వెలికితీసేందుకు యూత్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ (వైటీసీ)లను ఏర్పాటు చేశారు. ఏటూరునాగారం పరిధిలో జాకారం, మహబూబాబాద్‌, కాటారం, ఏటూరునాగారం, హనుమకొండ, భద్రాచలం పరిధిలో ఖమ్మం, భద్రాచలం, ఇల్లెందులో శిక్షణ కేంద్రాలున్నాయి. గతంలో ఇవి నిర్విరామంగా కొనసాగేవి. ప్రస్తుతం పడకేశాయి. అన్ని వైటీసీల్లో శిక్షణ కేంద్రాలు జరిగేలా చూడాలి.

స్వయం ఉపాధి రంగాన్ని విస్తృత పరచాలి

సబ్బులను తయారు చేస్తున్నది ఏటూరునాగారం మండలం శివపురం గ్రామానికి చెందిన అడవి బిడ్డలు. వీరు ఏటూరుగారం ఐటీడీఏ ద్వారా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా(ఎంఎస్‌ఎంఈ) పథకం ద్వారా ఆర్థిక ప్రోత్సాహాన్ని పొంది  నాలుగేళ్ల కిందట ఏర్పాటు చేసుకున్నారు.  

ఐటీడీఏల పరిధిలో ప్రస్తుతం సబ్బులు, షాంపులు, నాప్కిన్ల తయారీ, పప్పు మిల్లులను, చిరుధాన్యాలతో పోషకాహారం తయారీ యూనిట్లను నెలకొల్పారు.  ఏజెన్సీ ప్రాంతాల్లోని మహిళలు  ఆర్థికాభివృద్ధిని సాధించేందుకు ఎంఎస్‌ఎంఈ పథకాన్ని విస్తృత పరిచేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపాలి.

ఉప కేంద్రాల ఏర్పాటు అవసరం

భద్రాచలం నలుగురు, ఏటూరునాగారం ఆరుగురు కలెక్టర్ల పరిధిలో ఉంటుంది. ఈ రెండు ఐటీడీఏల విభజన జరగలేదు. ప్రతి జిల్లా కేంద్రంలో ఉప కేంద్రాలను ఏర్పాటు చేయాలి. అధికారుల క్షేత్రస్థాయి పర్యవేక్షణ మారుమూల ప్రాంతాల్లో  లోపించింది. గ్రీవెన్స్‌లో వినతుల స్వీకరణ వరకే కాని పరిష్కారం లేదు.

జీసీసీలను బలోపేతం చేయాలి

గిరిజన కో-ఆపరేటివ్‌ కార్పొరేషన్‌ లిమిటేడ్‌ ఆధ్వర్యంలో ఒకప్పుడు గిరిజనులు ఆర్థికాభివృద్ధిని సాధించేందుకు  మన్యంలో సేకరించిన అటవీ ఉత్పత్తుల కొనుగోలు విస్తృతంగా జరిగేది. ఆ కేంద్రాల నిర్వహణ పూర్తిస్థాయిలో లేక అడవి బిడ్డలు ఉత్పత్తులను సేకరించడంపై దృష్టిసారించడం లేదు. వాటిని బలోపేతం చేసి గతంలో మాదిరిగా ఉత్పత్తుల సేకరణ అయ్యేలా చూడాలి.  

ప్రస్తుత పరిస్థితి

  • పలుశాఖల్లో ఉద్యోగుల ఖాళీల భర్తీ లేక ఆయా విభాగాల వ్యవస్థ పని తీరు పటిష్ఠంగా లేదు. దాంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సెక్టార్ల వారీగా ఖాళీలను గుర్తించి  భర్తీ చేపట్టాలి.
  • పదేళ్లకు ముందు ఎల్‌డబ్ల్యూఈ, డీఆర్పీ, రూరల్‌ ఇంటిగ్రేటెడ్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం వంటి వాటికి నిధులు బాగా వచ్చేవి.  ఇప్పడు పరిస్థితి మారింది. గతంలో మాదిరిగా నిధుల కేటాయింపు చేస్తే ప్రజలు గత వైభవాన్ని చూస్తారు.
  • ట్రైకార్‌, సీఎం గిరి వికాసం, సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమల రూపకల్పన వంటి పథకాలు ఉన్నప్పటికీ నిధులు సరిపడా రావడం లేదు. వ్యవసాయం, మత్స్య, పశు సంవర్ధక శాఖలకు ప్రత్యేక విభాగాలు గతంలో ఉండేవి. ఇప్పుడివి సిబ్బంది కొరతతో కునారిల్లుతున్నాయి.  
  • అటవీ హక్కుల చట్టం ఆశాజనకంగా అమలవుతున్నా పోడు సాగుదారులకు మాత్రం పూర్తి స్థాయిలో పట్టాలు అందలేదు. బాగా వెనుకబడిన కొండరెడ్ల సంక్షేమానికి సరిపడా నిధులు కావాలి.
  • విద్య విభాగాన్ని విస్తరించాలంటే ఏజెన్సీ డీఈఓ వ్యవస్థ రావాలి. వైద్య పరంగా కొన్ని చోట్ల పీహెచ్‌సీలను అందుబాటులోకి తీసుకురావాలి. భద్రాచలం వంటి చోట్ల పీహెచ్‌సీలు లేకపోవడం ప్రధాన లోపం
  • ఐటీడీఏలోని పథకాల తీరుతెన్నులపై పాలక మండలి ప్రతి మూడు నెలలకోసారి సమీక్ష చేయాల్సి ఉన్నప్పటికీ అధికారులు మాత్రం కుదిరినప్పుడు నిర్వహిస్తున్నారు. ఎన్నికల కోడ్‌ ఎత్తివేసిన తర్వాత రెండు ఐటీడీఏల పరిధిలో పూర్తి స్థాయి సమీక్ష చేసి దశ దిశను నిర్దేశించాలి.

మైదాన ప్రాంతంలో  ఏర్పాటుకు కృషి

అజ్మీరా సీతారాంనాయక్‌, భాజపా అభ్యర్థి

గతంలో ఎంపీగా పనిచేసినప్పుడు నిధులు తీసుకొచ్చాను. ఎంపీగా గెలిచాక గత వైభవం తీసుకొస్తాను.  కొత్త జిల్లాల్లోని మైదాన ప్రాంత ఐటీడీల ఏర్పాటుకు కృషి చేస్తాను.


అభివృద్ధికి పాటుపడుతా

పోరిక బలరాంనాయక్‌, కాంగ్రెస్‌ అభ్యర్థి

ఎంపీ అయ్యాక యువతకు నైపుణ్య శిక్షణలు ఇప్పిస్తాను. వారికి ఉపాధి కల్పించడానికి, కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో సంబంధిత కార్యాలయాల నిర్మాణం, అభివృద్ధికి పాటుపడుతా.


మహిళల స్వయం ఉపాధికి తోడ్పడుతా

మాలోత్‌ కవిత, భారాస అభ్యర్థి

జిల్లాల విభజనతో ఐటీడీఏల పరిధి పెరిగింది. దాంతో కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో వాటి ఉపకేంద్రాల నిర్మాణానికి కృషి చేస్తా. మహిళల స్వయం ఉపాధి అవకాశాలను మెరుగుపరచడంపై దృష్టిసారిస్తాను.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని