logo

సొంత మామతో వివాహేతర సంబంధం.. ఏకాంతంగా ఉన్నప్పుడు కుమార్తె చూసిందని..

సొంత మామ(భర్త తండ్రి)తో వివాహేతర సంబంధం పెట్టుకొన్న ఓ మహిళ కన్న కూతురినే హతమార్చింది. సహజ మరణంగా చిత్రీకరించేందుకు నిందితులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. వారం రోజుల్లోనే పోలీసులు కేసును ఛేదించారు.

Updated : 16 Feb 2022 09:40 IST

మామతో కలిసి కన్న కూతుర్నే చంపిన తల్లి

నిందితులు సునీత, నరసింహారావు

బోనకల్లు, న్యూస్‌టుడే: సొంత మామ(భర్త తండ్రి)తో వివాహేతర సంబంధం పెట్టుకొన్న ఓ మహిళ కన్న కూతురినే హతమార్చింది. సహజ మరణంగా చిత్రీకరించేందుకు నిందితులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. వారం రోజుల్లోనే పోలీసులు కేసును ఛేదించారు. సభ్య సమాజం తలదించుకునే ఈ ఘటన ఖమ్మం జిల్లా బోనకల్లులో చోటుచేసుకుంది. వైరా ఏసీపీ స్నేహామెహ్రా తెలిపిన వివరాల ప్రకారం.. బోనకల్లు మండలానికి చెందిన పాలెపు నరసింహారావు కుమారుడికి సునీతతో వివాహమైంది. సునీతకు 12 ఏళ్ల పాప ఉంది. కొంతకాలంగా ఈమె మామ నరసింహారావుతో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. వీరు ఏకాంతంగా ఉన్నప్పుడు బాలిక చూడటంతో మామతో కలిసి కన్న కూతురినే హతమార్చింది. ఈనెల 9న బాలిక కాళ్లు, చేతులు కట్టేసి వైరుతో గొంతు బిగించి చంపారు. దీన్ని సహజ మరణంగా చిత్రీకరించేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. ముందుగా బాలిక ఫిట్స్‌ వచ్చి కింద పడటంతో దెబ్బ తగిలిందని మృతదేహాన్ని స్థానిక పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు పరిశీలించి అప్పటికే చనిపోయిందని నిర్ధారించుకొన్నారు. పీహెచ్‌సీలో చనిపోయినట్లు నిర్ధారించకూడదని.. ‘వెంటనే ఖమ్మం తీసుకెళ్లమని’ పంపించారు. ఖమ్మం ప్రభుత్వాసుపత్రి వైద్యులు పాప చనిపోయిందని నిర్ధారించారు. తల్లి, తాత బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం చేయకుండా ఇవ్వాలని కోరారు. చిన్నారి మెడపై రాపిడి గుర్తులు ఉండటంతో వైద్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై కవిత సంఘటనా స్థలాన్ని పరిశీలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.
శతవిధాలా ప్రయత్నించినా...: పోస్టుమార్టం జరిగితే అసలు విషయం బయట పడుతుందని నిందితుడు నరసింహారావు ఆపేందుకు పలు ప్రయత్నాలు చేశాడు. చిన్న పిల్లను కోయడం మంచిది కాదని, చూసి తట్టుకోలేమని ప్రాధేయపడ్డాడు. పోలీసులు, వైద్యులు అంగీకరించకుండా పోస్టుమార్టం చేశారు. అసలు విషయం బయట పడుతుండటంతో తప్పించుకునేందుకు గ్రామంలో మరో యువకుణ్ని ఇరికించాడు. ఆ యువకుడికి తన కోడలికి వివాహేతర సంబంధం ఉందని అతనే చంపాడని కోడలితో పోలీసులకు చెప్పించారు. అతణ్ని విచారించగా వివాహేతర సంబంధం నిజమేనని కాని హత్యతో తనకు సంబంధం లేదని చెప్పాడు. పోలీసులు ఆధారాలు సేకరించి తల్లిని గట్టిగా ప్రశ్నించడంతో విషయం బయటపడింది. అప్పటికే పోస్టుమార్టం నివేదికలో హత్యగా నిర్ధారణ అయింది. నిందితులు నేరం అంగీకరించడంతో హత్య కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చినట్లు ఏసీపీ చెప్పారు. చిన్న ఆధారంతో పోలీసులు కేసుని ఛేదించినట్లు ఏసీపీ సేహామెహ్రా వివరించారు. ఇంట్లో చున్ని 75 శాతం ఉంది. 25 శాతం కట్ చేసి ఉంది. 25 శాతం చున్ని ఏమైందని పరిశీలించగా దాంతోనే చిన్నారి కాళ్లు, చేతులు కట్టి గొంతుకు వైరుతో బిగించి చంపారని తేలిందన్నారు. వారంలో మిస్టరీ ఛేదించినందుకు సీఐ మురళి, ఎస్సై కవిత, సిబ్బందిని అభినందించారు. వారికి రివార్డులు అందజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని