సంక్షిప్తవార్తలు(20)
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆయన మంత్రివర్గ సహచరులు దేశ వనరులను వినియోగించుకుని విస్తృతంగా ప్రచారం చేయడానికే కేంద్ర ఎన్నికల సంఘం ఏడు దశల్లో ఎన్నికల షెడ్యూల్ను రూపొందించిందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు.
భాజపా ప్రచారం కోసమే 7 దశల్లో ఎన్నికలు: మమత
మాల్దా: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆయన మంత్రివర్గ సహచరులు దేశ వనరులను వినియోగించుకుని విస్తృతంగా ప్రచారం చేయడానికే కేంద్ర ఎన్నికల సంఘం ఏడు దశల్లో ఎన్నికల షెడ్యూల్ను రూపొందించిందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. శనివారం మాల్దా జిల్లాలోని గాజోల్లో మాజీ ఐపీఎస్ అధికారి, టీఎంసీ అభ్యర్థి ప్రసూన్ బెనర్జీకి మద్దతుగా నిర్వహించిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి తాత్కాలిక పాలనా యంత్రాంగంగా వ్యవహరించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం భాజపా కనుసన్నల్లో పనిచేస్తోందని ఆరోపించారు. ఒకప్పుడు ఎన్నికలు మే లోనే ముగిసేవని, ఇప్పుడు జూన్ వరకు వచ్చాయన్నారు.
దోపిడీ ప్రభుత్వం వద్దు : ఖర్గే
దిల్లీ: ‘దోపిడీ ప్రభుత్వాన్ని (భాజపా సర్కారు) ఎన్నుకోవద్దు. మార్పును కోరుకోండి. కాంగ్రెస్కు ఓటెయ్యండి’ అని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఓ వీడియోను ‘ఎక్స్’లో పోస్టు చేశారు. మరోపక్క కరవు కోరల్లో చిక్కుకున్న కర్ణాటక రాష్ట్రానికి రూ.18 వేల కోట్ల సహాయాన్ని ఎందుకు విడుదల చేయడంలేదంటూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ చిక్కబళ్లాపుర్ ఎన్నికల ర్యాలీలో ప్రశ్నించారు.
మొరాదాబాద్ భాజపా అభ్యర్థి మృతి
లఖ్నవూ: ఉత్తర్ప్రదేశ్లోని మొరాదాబాద్ నియోజకవర్గ భాజపా లోక్సభ అభ్యర్థి సర్వేశ్ కుమార్ శనివారం మృతి చెందారు. ఆయన దిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 72 ఏళ్ల సర్వేశ్ కుమార్ గత కొంతకాలంగా అనారోగ్యంగా ఉన్నారు. తొలి దశ ఎన్నికల్లో భాగంగా మొరాదాబాద్లో శుక్రవారమే పోలింగ్ జరిగింది. ఐదు సార్లు భాజపా ఎమ్మెల్యేగా నెగ్గిన సర్వేశ్ కుమార్ 2014 నుంచి 2019 వరకు మొరాదాబాద్ లోక్సభ ఎంపీగా ఉన్నారు.
గురుకులాలపై కాంగ్రెస్ నిర్లక్ష్యం: హరీశ్రావు
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో గురుకులాల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ఇటీవల వరుసగా జరుగుతున్న విషాద సంఘటనలే ఇందుకు నిదర్శనం అని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి టి.హరీశ్రావు ‘ఎక్స్’ వేదికగా శనివారం విమర్శించారు. మొన్న భువనగిరి గురుకుల హాస్టల్లో కలుషిత ఆహారం తిని చనిపోయిన ప్రశాంత్ ఉదంతాన్ని మరవక ముందే.. తాజాగా నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో శుక్రవారం 11 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ప్రభుత్వం బాధిత విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గురుకులాల్లో పనిచేస్తున్న ఐసీటీ కంప్యూటర్ టీచర్లకు మూణ్నెళ్లుగా వేతనాలు ఇవ్వడం లేదని వెంటనే జీతాలు చెల్లించాలని హరీశ్రావు డిమాండ్ చేశారు.
‘ఇండియా’ కూటమికి సానుకూల పవనాలు
కాంగ్రెస్ సేవాదళ్ తెలంగాణ ఇన్ఛార్జి సంగ్రామ్ త్రావ్డే
హైదరాబాద్, న్యూస్టుడే: దేశ వ్యాప్తంగా ‘ఇండియా’ కూటమికి సానుకూల పవనాలు వీస్తున్నాయని, రాహుల్గాంధీ ప్రధానమంత్రి కావడం ఖాయమని సేవాదళ్ జాతీయ కార్యదర్శి, సేవాదళ్ తెలంగాణ ఇన్ఛార్జి సంగ్రామ్ త్రావ్డే ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ సర్వసభ్య సమావేశం రాష్ట్ర అధ్యక్షుడు మిద్దెల జితేందర్ అధ్యక్షతన శనివారం గాంధీభవన్లోని ఇందిరాభవన్లో జరిగింది. ఈ సందర్భంగా సంగ్రామ్ త్రావ్డే మాట్లాడుతూ..మోదీ పాలనలో ద్రవ్యోల్బణం పెరిగిందని, ఇంధనం, నిత్యావసర వస్తువుల ధరలూ పెరుగుతున్నాయని విమర్శించారు. లోక్సభ ఎన్నికల్లో సేవాదళ్ శ్రేణులు కష్టపడి పనిచేసి తెలంగాణలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలన్నారు.
దేశ ప్రధానిలా కాకుండా భాజపా పీఎంలా మోదీ
ప్రధానిగా యావద్దేశానికి నాయకత్వం వహించి ముందుకు నడపాల్సిన మోదీ కేవలం భాజపా ప్రధానిలా మాట్లాడుతున్నారు. ఆయన ప్రసంగాలు దానిని తేటతెల్లం చేస్తున్నాయి. విపక్షంపై విరుచుకుపడే బదులు దేశానికి ఏం చేయబోయేదీ మోదీ, భాజపా చెప్పాలి. ఎంతసేపూ నెహ్రూ, రాహుల్గాంధీ, లేదా కొన్నిసార్లు నన్ను విమర్శించడంతోనే వారికి సరిపోతోంది.
మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్లో ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్పవార్
ఇది మోదీ-రాహుల్ మధ్య పోరు
లోక్సభ ఎన్నికలు కుటుంబ సంబంధాలకు సంబంధించినవి కావు. ఇవి ప్రధాని మోదీ- కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ మధ్య పోరు. బారామతిలో అన్ని సంస్థల్నీ శరద్పవార్ తెచ్చారని చెప్పేందుకు ఓ సభలో వక్తలు ప్రయత్నించారు. అలాగైతే గత 30 ఏళ్లలో ఈ నియోజకవర్గానికి నేను ఏం చేసినట్లు?
పుణెలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్
440 వోల్టుల షాక్ ఇవ్వాలి
ఈసారి ఎన్నికల్లో 400 పైబడిన స్థానాలు పొందాలని లక్ష్యంగా పెట్టుకున్న భాజపాకి ప్రజలంతా 440 వోల్టుల షాక్ ఇవ్వాలి. ఆ షాక్ దిల్లీ వరకు తగలాలి. ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలి.
బెంగాల్లోని రాయ్గంజ్ సభలో తృణమూల్ యువ నేత అభిషేక్ బెనర్జీ
తొలి దశలోనే భాజపా ఫ్లాప్
భాజపాకి ఓటు వేయాలని ఎవరూ అనుకోవడం లేదు. మొదటి దశ ఎన్నికలు యూపీలో వాతావరణాన్ని మార్చేశాయి. భాజపా సినిమా ఫ్లాప్ అని ఈ దశలోనే తేలిపోయింది. వారు పదేపదే చెప్పే కథను ఎవరూ వినాలనుకోవడం లేదు. పోరాటాల గడ్డ అయిన మేరఠ్ ప్రజలు మన దేశానికి భాజపా నుంచి విముక్తి కల్పించాలి.
మేరఠ్ (యూపీ)లో సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్
కాపుల్ని అణచివేయడమే లక్ష్యంగా కుట్ర
తెదేపా నేతలు చినరాజప్ప, గంటా, నిమ్మల ధ్వజం
ఈనాడు డిజిటల్, అమరావతి: కాపుల్ని అణచివేయడమే లక్ష్యంగా సీఎం జగన్ అడుగడుగునా కుట్రలకు తెరలేపుతున్నారని తెదేపా నేతలు చినరాజప్ప, గంటా శ్రీనివాసరావు, నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. జగన్పై రాయి దాడి కేసులో తెదేపా అభ్యర్థి, కాపు నాయకుడు బోండా ఉమామహేశ్వరరావును ఇరికించాలని చూడటాన్ని శనివారం ఉమ్మడి ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. వైకాపాకు ఊడిగం చేసే కొంతమంది అధికారుల్ని అడ్డంపెట్టుకుని తప్పడు నివేదికలు తయారు చేయిస్తున్నారని మండిపడ్డారు. ‘‘జగన్ గులకరాయి డ్రామాను చూసి ప్రజలంతా అసహ్యించుకుంటున్నారు. నిజంగా జగన్కు గులకరాయి తగిలితే అదెందుకు దొరకలేదు? ఘటనతో ఎలాంటి సంబంధం లేని బీసీ బిడ్డని అరెస్టు చేసి, ఆ కేసులో కాపుల్ని కూడా ఇరికించే కుట్ర చేయడం దుర్మార్గం. ఇలాంటి ప్రయత్నాల్ని కాపు జాతి సహించబోదని గుర్తుంచుకోవాలి’’ అని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
వివేకా హత్య కేసులో నిందితుడు దేవిరెడ్డి నామినేషన్
ఈనాడు, కడప: వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు దేవిరెడ్డి శివశంకర్రెడ్డి కడప లోక్సభ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా శనివారం నామినేషన్ దాఖలు చేశారు. ఆయన తరఫున ప్రతిపాదకులు రిటర్నింగ్ అధికారి వద్ద నామినేషన్ పత్రాలు సమర్పించారు. గతంలోనూ ఆయన స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. పోలింగ్ రోజున బూత్లలో వైకాపా అభ్యర్థి అవినాష్రెడ్డికి ప్రయోజనం చేకూర్చడానికే స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయనపై పలు కేసులు నమోదైనప్పటికీ, వివేకా హత్య కేసును మాత్రమే అఫిడవిట్లో ప్రస్తావించారు. ఇతర కేసులు కొట్టివేయించుకున్న కారణంగా పేర్కొనలేదని సమాచారం.
మూడో రోజు 264 నామినేషన్లు
ఈనాడు డిజిటల్, అమరావతి: రాష్ట్రంలో శనివారం శాసనసభ స్థానాలకు 227, లోక్సభ స్థానాలకు 37 కలిపి మొత్తంగా 264 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా ఓ ప్రకటనలో తెలిపారు.
ఉగ్రవాదులకు బిర్యానీ ఇచ్చిన కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీ కులతత్వ, మతతత్వ ఆలోచనలతో దేశమెంతో ఇబ్బంది పడింది. దేశ భద్రతతో, ప్రజల విశ్వాసాలతో ఆ పార్టీ ఆడుకునేది. ఉగ్రవాదులకు బిర్యానీ తినిపించేది. ఈరోజు మన దేశంలో ఏ చిన్న పేలుడు ఘటన జరిగినా పాకిస్థాన్ వివరణ ఇచ్చుకోవాల్సి వస్తోందంటే దానికి కారణం మోదీ సర్కారు చేపట్టిన చర్యలే. శ్రీరాముడు లేడని చెప్పిన కాంగ్రెస్కు అధికారంలో ఉండే అర్హత లేదు.
రాజస్థాన్లోని చిత్తోడ్గఢ్, జోధ్పుర్లలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్
విపక్ష కూటమిలో విభేదాలున్నాయి
కీలకాంశాల్లో విపక్ష కూటమిలో ఐక్యత లేదు. విభేదాలతో అది సతమతమవుతోంది. సీపీఐ అగ్రనేత డి.రాజా సతీమణి అన్నీరాజా పోటీచేస్తున్న వయనాడ్ నుంచి రాహుల్గాంధీ బరిలో ఉండడాన్ని ఆ కూటమి పక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. కేరళ, వయనాడ్ల గురించి ఐదేళ్లలో ఆయన ఎన్నడూ పార్లమెంటులో మాట్లాడలేదు. ఇప్పుడాయన తమ పార్టీ జెండానూ వయనాడ్లో చేతపట్టడం లేదు. పార్టీ పతాకాన్నే కాపాడుకోలేని వ్యక్తి దేశాన్ని రక్షించగలరా?
అహ్మదాబాద్లో విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
కుటుంబ సభ్యుల అందలానికే లాలు ప్రాధాన్యం
ఆర్జేడీ అధ్యక్షుడు లాలూప్రసాద్ తన కుటుంబ సభ్యులకే ప్రాధాన్యమిస్తారు. కుమారులు, కుమార్తెలను అందలమెక్కించేందుకు ఆరాటపడతారు. మొదట కుమారుల వంతు, ఇప్పుడు కుమార్తెల వంతు. అసలు ఎవరైనా అంతమంది పిల్లల్ని కంటారా? ఆర్జేడీ పాలనలో బిహార్ ఎలా ఉండేదో అందరికీ తెలుసు.
బిహార్లోని కటిహార్లో సీఎం నీతీశ్కుమార్
మే నెల నుంచైనా ఇంటింటికీ పింఛన్లు అందజేయాలి
మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు
ఈనాడు డిజిటల్, అమరావతి: వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు ఇతర వర్గాలకు మే ఒకటో తేదీ నుంచైనా ఇళ్ల వద్దే సామాజిక భద్రత పింఛన్లు పంపిణీ చేయాలని తెదేపా నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రభుత్వాన్ని కోరారు. ఈ దశగా చర్యలు తీసుకోవాలని సీఎస్ జవహర్రెడ్డిని డిమాండ్ చేశారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ఇంటింటికీ పింఛన్ల పంపిణీకి తగిన సిబ్బంది ఉన్నా.. కావాలనే శవ రాజకీయాలు చేసి, 60 మంది పింఛనుదారుల మృతికి సీఎం జగన్తో పాటు సెర్ప్ సీఈవో మురళీధర్రెడ్డి కారణమయ్యారు. వచ్చే నెల నుంచైనా ఈ తరహా రాజకీయాలు మానుకోవాలి’ అని పేర్కొన్నారు.
జగన్ నాటకాల రాయుడు: లోకేశ్
ఈనాడు డిజిటల్, అమరావతి: ఓ కులాన్ని కించపరుస్తూ వైకాపా నేత మేకపాటి రాజమోహన్రెడ్డి చేసిన వ్యాఖ్యలను తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ శనివారం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా తీవ్రంగా ఖండించారు. ‘బయటకు నటిస్తూ.. లోపల జగన్రెడ్డి, ఆ పార్టీ నేతలు ఇలా అహంకార ధోరణితో వ్యవహరిస్తున్నారు. జగన్ ఓ అపరిచితుడు, నాటకాల రాయుడని ప్రజలు ఇందుకే అంటారు’ అని పేర్కొన్నారు. ‘ఈటీవీ’లో ప్రసారమైన రాజమోహన్రెడ్డి వ్యాఖ్యల వీడియోనూ లోకేశ్ పోస్టు చేశారు.
వేధింపులు ఆపకపోతే భారీ మూల్యం తప్పదు
తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు
ఈనాడు డిజిటల్, అమరావతి: సీఎం జగన్పై రాయి దాడి కేసులో తెదేపా అభ్యర్థి బొండా ఉమామహేశ్వరరావును ఇరికించాలని చూస్తూ...వేధిస్తున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వేధింపులు ఆపకపోతే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించక తప్పదని పోలీసు అధికారుల్ని హెచ్చరించారు. జగన్ చెప్పినట్టల్లా ఆడి మీ జీవితాల్ని నాశనం చేసుకోవద్దని వారికి హితవుపలికారు. ఈ కేసులో విజయవాడ పోలీస్ కమిషనర్ ప్రకటనపై ఈసీ విచారణకు ఆదేశించాలని శనివారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. ‘‘ఈ కేసుపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రధాన ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేస్తాం. రాబోయేది ఎన్డీయే ప్రభుత్వమే. అప్పుడు ఈ గులకరాయి గూడుపుఠాణీ వెనకున్న వారందరినీ శిక్షిస్తాం’’ అని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
మద్యాన్ని ఏరులై పారిస్తున్న వైకాపా
సీపీఐ నేత రామకృష్ణ ధ్వజం
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో అధికార వైకాపా మద్యాన్ని ఏరులై పారిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ధ్వజమెత్తారు. ‘‘2019 ఎన్నికల సందర్భంగా తాము అధికారంలోకి వస్తే మద్యాన్ని సంపూర్ణంగా నిషేధిస్తామని జగన్ హామీ ఇచ్చారు. కానీ.. అధికారం చేపట్టినప్పటి నుంచి నాసిరకం మద్యం అమ్మకాలు సాగిస్తూ కోట్లాది రూపాయలు అక్రమంగా సంపాదించారు. మద్యాన్ని నిషేధించిన తర్వాతే 2024 ఎన్నికల్లో ఓట్లు అడుగుతానన్నా జగన్ ఆ మాట తప్పారు. చివరికి వాటి అమ్మకాలను తాకట్టుపెట్టి రూ.కోట్లు అప్పులు తెచ్చిన ఘనత ఆయనకే దక్కుతుంది. డబ్బు పంపిణీ ద్వారా ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టి లబ్ధిపొందేందుకు వైకాపా ప్రయత్నిస్తోంది’’ అని రామకృష్ణ శనివారం ఓ ప్రకటనలో ఆరోపించారు.
రెండు బటన్లు నొక్కి జగన్ను ఇంటికి పంపడానికి ప్రజలు ‘సిద్ధం’
జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివశంకర్
ఈనాడు డిజిటల్, అమరావతి: జనసేన అధినేత పవన్కల్యాణ్ వ్యక్తిగత జీవితంపై సీఎం జగన్ చేసిన వాఖ్యలు హేయమైనవని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్ మండిపడ్డారు. ప్రధాన ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసినప్పటికీ.. జగన్ తీరులో మార్పులేదని శనివారం అసహనం వ్యక్తం చేశారు. ‘రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలోనైనా పోటీచేసే సత్తా పవన్కు ఉంది. 130సార్లు బటన్ నొక్కి నిధులు విడుదల చేశానని చెప్పిన జగన్ను.. రెండు బటన్లు నొక్కి ఆయనను ఇంటికి పంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. వైకాపా తెచ్చిన సున్నా వడ్డీ పథకం వల్ల పేదలకు మిగిల్చింది గుండు సున్నానే. ఈ పథకం ద్వారా అర్హులైన వారికి లబ్ధి చేకూరలేదు. రూ.లక్ష రుణం ఇచ్చామంటున్న ప్రభుత్వం.. ఎంతమందికి లబ్ధి చేకూరిందో చెప్పాలి?’ అని ఆయన నిలదీశారు.
మోదీకి మంత్రి అవినీతి కనిపించదా? : కాంగ్రెస్
దిల్లీ: ఈడీ దాడులతో విపక్షాలను బెదిరించే ప్రధాని మోదీ అవినీతి ఆరోపణల కింద విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తిని కేబినెట్లోకి ఎలా తీసుకున్నారని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. కేంద్ర మంత్రిగా ఉన్న ఉత్తర బెంగళూరు లోక్సభ అభ్యర్థిపై రూ.105 కోట్ల హవాలా కేసులో ఈడీ విచారణ గత పదేళ్లుగా కొనసాగుతూనే ఉందని, ఎలాంటి పురోగతి లేదని పేర్కొంది. భాజపా వాషింగ్మెషిన్ పనితీరు మందగించిందా లేదా స్వపక్షంలోని నేతలకు మినహాయింపు ఏమైనా ఉందా అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ శనివారం ‘ఎక్స్’ ద్వారా ప్రశ్నించారు. భాజపా వాషింగ్మెషిన్ మంత్రి శోభా కరాంద్లజే విషయంలో వేగంగా పనిచేయడం లేదేమని అడిగారు. కర్ణాటకలో బయటపడిన రూ.2,500 కోట్ల శ్రీ గురు రాఘవేంద్ర సహకార బ్యాంకు కుంభకోణంలో డిపాజిటర్లకు భాజపా నేతలు ఇచ్చిన హామీలను మళ్లీ పట్టించుకోలేదని, ఈ విషయంలో మోదీ జోక్యం చేసుకొని బాధితులకు ఎందుకు న్యాయం చేయడం లేదో చెప్పాలని జైరాం రమేశ్ డిమాండ్ చేశారు.
ఈడీ, సీబీఐ మీ హయాంలోనివే!
కాంగ్రెస్ విమర్శలకు కేంద్ర మంత్రి మేఘ్వాల్ కౌంటర్
దిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐలను మోదీ సర్కారు తమపై ప్రయోగిస్తోందని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తిప్పికొట్టారు. వీటిని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ప్రారంభించారని గుర్తు చేస్తూ ఆ పార్టీ నేతలపై విమర్శలు గుప్పించారు. భారతీయ న్యాయసంహిత చట్టాలపై నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న మేఘ్వాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘కేంద్ర దర్యాప్తు సంస్థలను తమపైకి ఉసిగొల్పుతుందంటూ భాజపాపై ప్రతిపక్షాలు ఆరోపించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. నిజానికి మీరు (కాంగ్రెస్ను ఉద్దేశిస్తూ) అధికారంలో ఉన్నప్పుడే వీటి ఆవిర్భావం జరిగింది కదా. అప్పటి నుంచే అవి పనిచేస్తున్నాయి. మీరు ఎందుకు ఆందోళన చెందుతున్నారు. చట్ట నిబంధనల ప్రకారమే చర్యలుంటాయి. ప్రతిపక్షాల అసత్య ప్రచారాలు ఎన్నికల వేళ చర్చనీయాంశంగా మారుతున్నాయి’ అని మేఘ్వాల్ పేర్కొన్నారు. కొత్త నేర న్యాయ చట్టాలపై ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్, పలువురు న్యాయమూర్తులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఈడీ చీఫ్ రాహుల్ నవీన్, సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫలితాలను చూసి జగన్ షాక్ అవుతారు: దేవినేని ఉమా
ఎన్నికల ఫలితాలను చూసి సీఎం జగన్ షాక్ అవుతారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జోస్యం చెప్పారు. -
తాడిపత్రిలో ఉంటే బయటకు రానివ్వం.. జేసీ తనయుడికి పోలీసుల హెచ్చరిక
అనంతపురం జిల్లా తాడిపత్రిలో తెదేపా నేతలు జేసీ దివాకర్రెడ్డి, జేసీ ప్రభాకర్రెడ్డి కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని పోలీసులు వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
తెదేపాకు ఓటేశారని వైకాపా మూకల దాడి
తెదేపాకు ఓటు వేశారన్న అక్కసుతో ఓ కుటుంబంపై బుధవారం వైకాపా మూకలు దాడికి తెగబడ్డాయి. ప్రశాంత విశాఖలో రెచ్చిపోయి రక్తపాతం సృష్టించాయి. -
తెదేపా ఏజెంట్లుగా కూర్చున్నందుకు ఇంటికెళ్లి పిల్లలపై దాడి
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు ఎన్నికల సందర్భంగా సాగించిన దాష్టీకాలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. -
హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ముకాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది. -
విధ్వంసానికి వైకాపా కుట్ర!
పల్నాడు జిల్లాలో భారీ విధ్వంసానికి వైకాపా మూకలు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల రోజు, అనంతరం జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. -
ఓటు కోసం నాలుగు నుంచి ఆరున్నర గంటలు క్యూ లైన్లో ఉండాలా?
ఓటు వేయడమంటే పండగ... కానీ ఈ ప్రజాస్వామ్య పర్వాన్ని ఓటర్ల సహనానికి, ఓర్పునకు పరీక్షగా మార్చేసిన ఘనత ఎన్నికల సంఘానికే దక్కింది. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా, సులువుగా ఓటు వేసేందుకు తగిన ఏర్పాట్లు, సదుపాయాలు కల్పించాల్సిన ఎన్నికల సంఘం... ఓటు వేయడానికి ఇంతగా నరకం అనుభవించాలా అనే భావనను కలిగించింది. -
దుర్మార్గంగా దాడులు చేస్తోంది కాక.. మాపై తప్పుడు కథనాలా?
పోలింగ్ సమయంలో, అనంతరం వైకాపా శ్రేణులు పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలకు పాల్పడ్డా.. సాక్షి, వైకాపా అనుకూల మీడియాలో మాత్రం ప్రతిపక్షాలపై బురదజల్లుతూ తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారని తెదేపా సీనియర్ నేత, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి ధ్వజమెత్తారు. -
వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం
ఏపీలో వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం వల్లే పోలింగ్ అనంతరం పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చెలరేగుతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
‘ఈ-ఆఫీస్’ అప్గ్రేడ్ నిలిపివేయండి
గ్రామ, వార్డు సచివాలయాలకు ‘ఈ-ఆఫీస్’ను విస్తరించడం, ప్రస్తుతం వాడుకలో ఉన్న వెర్షన్ను అప్గ్రేడ్ చేసే పేరుతో వైకాపా ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
ప్రజలు చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు
గతంలో ఎన్నడూ లేనంతగా 81.86 శాతం మంది తెలుగు ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడం ఆనందాన్ని కలిగించిందని జనసేన అధినేత పవన్కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. -
గతం కంటే ఎక్కువ స్థానాల్లో గెలుస్తున్నాం
‘రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో 175కి 151 అసెంబ్లీ స్థానాల్లో, 25కి 22 లోక్సభ సీట్లలో వైకాపా గెలిచింది. ఈ ఎన్నికల్లో ఆ రికార్డును బ్రేక్ చేయబోతున్నాం. -
ఎస్సై, పోలీసులపై వైకాపా మూకల దాడి
వైకాపా మూకల అరాచకానికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ప్రతిపక్ష కార్యకర్తలతో పాటు అడ్డుచెప్పిన పోలీసులను సైతం వదలకుండా దాడులకు తెగబడుతున్నారు. -
పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో 13 మంది అరెస్టు
తిరుపతి జిల్లా చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం కేసులో 13 మంది నిందితులను గురువారం అరెస్టుచేశారు. -
పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడే, అనుచరులపై కేసు
ఎన్నికల నేపథ్యంలో కృష్ణా జిల్లా పోరంకిలో జరిగిన ఘర్షణలపై మరో కేసు నమోదైంది. ఇప్పటికే మంత్రి జోగి రమేష్, ఆయన కుమారులు, అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
కాసుల కక్కుర్తితో పేదల సొమ్మును దారి మళ్లించాలని చూస్తారా?
కాసుల కక్కుర్తితోనే సంక్షేమ పథకాల అమలు కోసం ఉంచిన రూ.14 వేల కోట్ల నిధుల్ని వైకాపా అనుకూల గుత్తేదార్లకు దోచిపెట్టాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి జవహర్రెడ్డి చూస్తున్నారని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ధ్వజమెత్తారు. -
తాడిపత్రి అల్లర్లలో 91 మంది అరెస్టు
పోలింగ్ తర్వాత రోజు అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన అల్లర్ల ఘటనలో పోలీసులు 91 మందిని అరెస్టు చేశారు. గురువారం వారిని ఉరవకొండ న్యాయస్థానంలో హాజరుపర్చగా జడ్జి 14 రోజుల రిమాండు విధించారు. -
కౌంటింగ్కు ఏజెంట్లు రారని జగన్ భయం: లంకా దినకర్
ఓట్ల లెక్కింపురోజు ఏజెంట్లు కూడా కరవవుతారన్న భయంతోనే ఎన్నికల్లో గెలుస్తామని ముఖ్యమంత్రి జగన్ చెబుతున్నారని భాజపా ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ విమర్శించారు. -
అనర్హత వేటు వేయడం కక్ష సాధింపే
శాసనమండలి సభ్యుడిగా ఉన్న తనపై ఛైర్మన్ అనర్హత వేటు వేయడం ముమ్మాటికీ వైకాపా కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని తెదేపా నేత జంగా కృష్ణమూర్తి విమర్శించారు. -
ఎన్నికల పరిశీలకుడు దీపక్ మిశ్ర అండతోనే తెదేపాకు అనుకూలంగా పోలీసులు వ్యవహరించారు
‘రాష్ట్రంలో నిష్పాక్షిక, స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణకోసం ప్రత్యేక పరిశీలకుడిగా కేంద్ర ఎన్నికల సంఘం తనకు అప్పగించిన బాధ్యతను దీపక్ మిశ్ర విస్మరించారు. -
ఆ అధికారుల వైఫల్యం వల్లే హింసాకాండ
రాష్ట్రంలో పోలింగ్ రోజు, ఆ తర్వాత పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో చోటుచేసుకున్న హింసాకాండకు ఆ మూడు జిల్లాల ఎస్పీలతో పాటు, పల్నాడు జిల్లా కలెక్టర్ వైఫల్యమే కారణమని కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి గురువారం నివేదిక ఇచ్చారు.
తాజా వార్తలు
-
నరసరావుపేటలో ‘సిట్’ దర్యాప్తు.. హింసాత్మక ఘటనలపై ఆరా
-
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో మంటలు.. బెంగళూరులో ఎమర్జెన్సీ ల్యాండింగ్
-
15 శాతం స్థానికేతర కోటా యథాతథం
-
ట్రంప్నకు జాతీయ రైఫిల్ అసోసియేషన్ మద్దతు..!
-
బుక్ చేస్తే 24 గంటల్లో నీటి ట్యాంకర్
-
ఇంటి దొంగల గుండెల్లో రైళ్లు.. పల్నాట రంగంలోకి దిగిన ప్రత్యేక దర్యాప్తు బృందం