icon icon icon
icon icon icon

జగన్‌ కుటుంబ ఆస్తుల విలువ రూ.757.65 కోట్లు

పేదలకు, పెత్తందారులకు మధ్య పోరాటం జరుగుతోందని... తాను పేదలకు ప్రతినిధినని పదే పదే ఊదరగొడుతున్న సీఎం జగన్‌ ఒక్కరి పేరిటే రూ.529.87 కోట్ల విలువైన స్థిర, చరాస్తులున్నాయి.

Updated : 23 Apr 2024 10:23 IST

ఆయన ఒక్కరి ఆస్తే రూ.529.87 కోట్లు
జగన్‌ భార్య, కుమార్తెకు రిలయన్స్‌, జియో ఫైనాన్షియల్స్‌లో పెట్టుబడులు
2019తో పోలిస్తే రూ.154.67 కోట్లు పెరిగిన సీఎం ఆస్తి
కుటుంబ ఆస్తుల విలువ రూ.247.27 కోట్ల పెరుగుదల
జగన్‌ కుటుంబంలో ఎవరికీ సొంత కారు లేదని ప్రకటన
ఈనాడు - అమరావతి

పేదలకు, పెత్తందారులకు మధ్య పోరాటం జరుగుతోందని... తాను పేదలకు ప్రతినిధినని పదే పదే ఊదరగొడుతున్న సీఎం జగన్‌ ఒక్కరి పేరిటే రూ.529.87 కోట్ల విలువైన స్థిర, చరాస్తులున్నాయి. ఆయన భార్య వైఎస్‌ భారతిరెడ్డి, కుమార్తెలు వైఎస్‌ హర్షిణిరెడ్డి, వైఎస్‌ వర్షారెడ్డిల పేరిట ఉన్న ఆస్తులనూ కలిపితే వాటి విలువ రూ.757.65 కోట్లు. ఇది జగన్‌ కుటుంబ ఆస్తుల విలువ. వీటిల్లో అత్యధిక మొత్తం వివిధ కంపెనీల్లో వాటాలు, పెట్టుబడుల రూపంలో ఉన్నవే. జగన్‌ తరఫున వైఎస్‌ మనోహర్‌రెడ్డి పులివెందుల రిటర్నింగ్‌ అధికారికి సోమవారం నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. దాంతో అఫిడవిట్‌ దాఖలుచేశారు. అందులో ఆస్తుల విలువను పొందుపరిచారు. 2019లో జగన్‌ ఒక్కరి ఆస్తుల విలువ రూ.375.20 కోట్లు కాగా.. గత ఐదేళ్లలో ఆయన ఆస్తుల విలువ రూ.154.67 కోట్ల మేర.. అంటే 41.22% పెరిగింది. 2019లో జగన్‌ కుటుంబం మొత్తం ఆస్తుల విలువ రూ.510.38 కోట్లు కాగా.. అయిదేళ్లలో రూ.247.27 కోట్లు.. అంటే 48.45% పెరిగింది.

ఒక్కరికి కూడా సొంత కారు లేదట: జగన్‌, ఆయన భార్య భారతిరెడ్డి, కుమార్తెలు హర్షిణిరెడ్డి, వర్షారెడ్డిల్లో ఏ ఒక్కరికీ సొంత కారు లేదట. వాళ్ల పేరుతో కార్లు ఉన్నట్లు అఫిడవిట్‌లో ఎక్కడా పేర్కొనలేదు.

  • జగన్‌ పేరుతో ఒక బుల్లెట్‌ ప్రూఫ్‌ స్కార్పియో వాహనం ఉంది. అది తన సొంతానిది కాదని, హోం మంత్రిత్వశాఖ సమకూర్చిన వాహనమని అఫిడవిట్‌లో ప్రస్తావించారు.

వివిధ కంపెనీల్లో పెట్టుబడులు

  • జగన్‌కు ఏడు కంపెనీల్లో, ఆయన భార్య భారతికి 22 కంపెనీల్లో, వాళ్ల కుమార్తె హర్షిణిరెడ్డికి 7 కంపెనీల్లో, వర్షారెడ్డికి 9 కంపెనీల్లో పెట్టుబడులున్నాయి. వీరందరికీ కలిపి వివిధ కంపెనీల్లో రూ.344,03,77,886 విలువైన పెట్టుబడులున్నాయి. వివరాలివి.

జగన్‌కు రూ.263.64 కోట్ల ఈక్విటీ షేర్లు

  • వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి: రూ.263,64,92,685
  • భారతీ సిమెంట్స్‌ కార్పొరేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, కార్మెల్‌ ఏషియా హోల్డింగ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, క్లాసిక్‌ రియాల్టీ ప్రైవేట్‌ లిమిటెడ్‌, హరీష్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, సండూర్‌ పవర్‌ కంపెనీ ప్రైవేట్‌ లిమిటెడ్‌, సరస్వతి పవర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, సిలికాన్‌ బిల్డర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీల్లో జగన్‌కు రూ.263,64,92,685 విలువైన ఈక్విటీ షేర్లు ఉన్నాయి.

రిలయన్స్‌, జియో ఫైనాన్స్‌లో భారతిరెడ్డి పెట్టుబడులు

  • వైఎస్‌ భారతిరెడ్డి పెట్టుబడులు: రూ.69,42,10,710
  • జగన్‌ భార్య వైఎస్‌ భారతిరెడ్డికి 11 కంపెనీల్లో రూ.53,08,47,931 విలువైన ఈక్విటీ షేర్లు ఉన్నాయి. సండూర్‌ పవర్‌ కంపెనీ ప్రైవేట్‌ లిమిటెడ్‌, సరస్వతి పవర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, కెల్వెన్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, క్లాసిక్‌ రియాల్టీ ప్రైవేట్‌ లిమిటెడ్‌, సిలికాన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, సిలికాన్‌ బిల్డర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, హరీష్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఆకాశ్‌ ఎస్టేట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, భారతి సిమెంట్స్‌ కార్పొరేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, రేవన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, యుటోపియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీల్లో ఈ షేర్లు ఉన్నాయి.
  • మకరియోస్‌ ఎల్‌ఎల్‌పీ, భగవత్‌ సన్నిధి ఎస్టేట్స్‌ ఎల్‌ఎల్‌పీల్లో రూ.13,94,91,693 విలువైన పెట్టుబడులతో పరిమిత భాగస్వామ్యం ఉంది.
  • రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, జియో ఫైనాన్షియల్స్‌, ఎన్‌ఎండీసీ, ఏషియన్‌ పెయింట్స్‌, కోల్గేట్‌ పామోలివ్‌, ఓఎన్‌జీసీ, సెయిల్‌, ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌ లిమిటెడ్‌లో రూ.1,52,17,143 విలువైన పెట్టుబడులున్నాయి. రూ.75.01 లక్షల విలువైన సావరిన్‌ గోల్డ్‌ బాండ్లున్నాయి.

వైఎస్‌ హర్షిణిరెడ్డి, వర్షారెడ్డి పేరిట..

  • జగన్‌ కుమార్తెలు వైఎస్‌ హర్షిణిరెడ్డికి రూ.10,01,65,515, వైఎస్‌ వర్షారెడ్డికి రూ.9,95,08,976 పెట్టుబడులున్నాయి.
  • మకరియోస్‌ ఎల్‌ఎల్‌పీ, భగవత్‌ సన్నిధి ఎస్టేట్స్‌ ఎల్‌ఎల్‌పీల్లో హర్షిణిరెడ్డి, వర్షారెడ్డిలకు చెరో రూ.7,48,71,758 విలువైన పరిమిత భాగస్వామ్య పెట్టుబడులున్నాయి.
  • హర్షిణిరెడ్డికి కెల్వన్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో రూ.2,03,85,500 విలువైన ఈక్విటీ షేర్లున్నాయి. ఎస్‌బీఐ, సనోఫి ఇండియా, ఏషియన్‌ పెయింట్స్‌, గ్లాక్సో స్మిత్‌క్లిన్‌ ఫార్మాలో రూ.26.17 లక్షల విలువైన ఈక్విటీ షేర్లున్నాయి.
  • వర్షారెడ్డికి కెల్వన్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో రూ.2,03,85,500 విలువైన ఈక్విటీ షేర్లున్నాయి. జెన్సర్‌ టెక్‌, సనోఫి ఇండియా, ఏషియన్‌ పెయింట్స్‌, గ్లాక్సో స్మిత్‌క్లిన్‌ ఫార్మా, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, జియో ఫైనాన్షియల్స్‌లలో రూ.19.61 లక్షల విలువైన ఈక్విటీ షేర్లున్నాయి.

జగన్‌ కుమార్తెలకు విదేశాల్లోనూ ఆస్తులు

  • జగన్‌ కుమార్తెలు హర్షిణిరెడ్డికి రూ.1,31,75,471, వర్షారెడ్డికి రూ.1,54,78,466 విలువైన విదేశీ ఆస్తులున్నాయి.

గత అయిదేళ్లలో భారతి పేరిట అరకిలో పైనే బంగారు, వజ్రాభరణాలు పెరిగాయి

  • జగన్‌మోహన్‌రెడ్డికి బంగారు ఆభరణాలేవీ లేవు. భారతి పేరిట రూ.5,29,87,319 విలువ చేసే 6,427.79 గ్రాములు, హర్షిణిరెడ్డి పేరిట రూ.4,43,35,816 విలువైన 4,187.19 గ్రాములు, వర్షారెడ్డి పేరిట రూ.4,46,82,885 విలువైన 3,457.33 గ్రాముల బంగారు, వజ్రాభరణాలున్నాయి.
  • 2019లో భారతిరెడ్డి పేరిట రూ.3,57,16,658 విలువైన 5,862.818 గ్రాములు ఉండేది. గత అయిదేళ్లలో ఆమె అదనంగా 564 గ్రాములు బంగారు, వజ్రాభరణాలు సమకూర్చుకున్నారు.
  • జగన్‌ చేతిలో రూ.7వేలు, భారతిరెడ్డి చేతిలో రూ.10,022, కుమార్తె హర్షిణిరెడ్డి చేతిలో రూ.9వేలు, వర్షారెడ్డి చేతిలో రూ.6,987 మాత్రమే నగదు ఉందట.
  • జగన్‌ ఓ సంస్థకు రూ.43.10 కోట్లు అప్పు ఇచ్చారు. మరికొందరికి రూ.136.15 కోట్లు రుణమిచ్చారు. వివిధ రుణగ్రహీతల నుంచి ఆయనకు రూ.48.95 లక్షలు రావాలి. భారతిరెడ్డికి రుణగ్రహీతల నుంచి రూ.4.37 కోట్లు రావాలి. ఇదికాకుండా రూ.26.54 లక్షల మేర రుణాలిచ్చారు. వాళ్ల కుమార్తె హర్షిణిరెడ్డి రూ.2.43 కోట్లు, వర్షారెడ్డి రూ.2.68 కోట్లు అడ్వాన్సులుగా ఇచ్చారు.
  • జగన్‌కు రూ.1,10,78,350, భారతికి రూ.7,41,79,353, హర్షిణిరెడ్డికి, రూ.9,02,00,000, వర్షారెడ్డికి రూ.9,02,00,000 మేర అప్పులున్నాయి.

తాడేపల్లి ప్యాలెస్‌ భారతిరెడ్డి పేరుతోనే

  • తాడేపల్లిలో వైఎస్‌ భారతిరెడ్డికి 47, 52 నంబర్ల విల్లాలున్నాయి. ఒకటి 41,382 చదరపు అడుగుల విస్తీర్ణంలో, మరోకటి 8,525 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. 2019 జనవరి 31న వీటిని కొన్నారు. ఒక విల్లా ఖరీదు రూ.11.50 కోట్లు కాగా, మరొకదాని విలువ రూ.1.91 కోట్లు.

జగన్‌ పేరిట ఇడుపులపాయలో భూములు

  • జగన్‌మోహన్‌రెడ్డికి ఇడుపులపాయలో వివిధ సర్వే నంబర్లలో 39.52 ఎకరాల్లో రూ.1,54,12,800 విలువైన వ్యవసాయ భూమి ఉంది. పులివెందుల మండలం భాకరాపురంలో రూ.11.03 కోట్ల విలువైన 4,51,282 చదరపు అడుగుల వ్యవసాయేతర భూమి ఉంది. బంజారాహిల్స్‌ రోడ్డు నంబర్‌ 2లో రూ.20.92 కోట్ల విలువైన వాణిజ్య భవనం 37,415 చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంలో ఉంది. బంజారాహిల్స్‌ సాగర్‌ సొసైటీ, భాకరాపురంలో రూ.13.29 కోట్ల విలువైన రెండు వేర్వేరు నివాస భవనాలున్నాయి.
  • భారతిరెడ్డి పేరుతో కాచివారిపల్లెలో, యర్రగుడిపల్లె, భాకరాపురం, పులివెందులల్లోని వివిధ సర్వే నంబర్లలో రూ.28.57 కోట్ల విలువైన వ్యవసాయేతర భూములున్నాయి. పులివెందుల, రాయదుర్గం తదితర ప్రాంతాల్లో రూ.14.28 కోట్ల విలువైన వాణిజ్య భవనాలున్నాయి.

30 సంస్థలతో ఒప్పందాలు

జగన్‌కు సంబంధించిన భారతీ సిమెంట్స్‌ సంస్థ 30 సంస్థలతో పలు ఒప్పందాలు కుదుర్చుకుంది. విద్యుత్తు కొనుగోలు, బొగ్గు కొనుగోలు, మైనింగ్‌ లీజు, లిగ్నైట్‌ సరఫరా, పెట్‌ కోక్‌ కొనుగోలుకు ఈ ఒప్పందాలున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img