అభ్యర్థులందరూ కోటీశ్వరులే!
రాష్ట్రంలో పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ కొనసాగుతోంది. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా పలువురు ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు నామపత్రాలను రిటర్నింగ్ అధికారులకు సమర్పించారు.
తెదేపా అభ్యర్థులపై ఐదేళ్లలో అనేక కేసులు
న్యూస్టుడే యంత్రాంగం
రాష్ట్రంలో పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ కొనసాగుతోంది. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా పలువురు ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు నామపత్రాలను రిటర్నింగ్ అధికారులకు సమర్పించారు. వీరిలో కొందరు వ్యాపారవేత్తలు, వైద్యులు, వృత్తి నిపుణులు తమ ఆస్తులను కోట్లలో చూపించారు. పోలీసు కేసులు, ఆస్తులు, అప్పులకు సంబంధించిన వివరాలను అఫిడవిట్లో ప్రస్తావించారు. తెదేపా అభ్యర్థులపై గత ఐదేళ్లలో పలు స్టేషన్ల పరిధిలో పోలీసు కేసులు నమోదైనట్లు అఫిడవిట్లను బట్టి అవగతమవుతోంది.
వెలంపల్లి కుటుంబ ఆస్తులు రూ.22.66 కోట్లు
విజయవాడ సెంట్రల్ వైకాపా అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాసరావు కుటుంబ సభ్యుల మొత్తం ఆస్తుల విలువ రూ.22.66 కోట్లు. ఆయన పేరున రూ.16.32 కోట్లు, భార్య శ్రీవాణి పేరిట రూ.6.33 కోట్ల స్థిర, చరాస్తులు ఉన్నాయి. శ్రీనివాస్పై రూ.3.14 కోట్లు, శ్రీవాణి పేరుతో రూ.64.85 లక్షల అప్పు ఉంది. వెలంపల్లి ఐటీ సంస్థకు రూ.9.32 లక్షలు బకాయి ఉన్నారు. 2019లో ఆయనపై 2 కేసులుండగా, ఈసారి ఏమీ లేవని పేర్కొన్నారు. వెలంపల్లి పేరిట మెర్సిడెస్ బెంజ్ (రూ.1.55 కోట్లు), కియా కార్నివాల్ (రూ.39.46), మహీంద్ర స్కార్పియో (రూ.16.63 లక్షలు) కార్లు, ఏడు లారీలు, ఒక ఆటో, ఒక వ్యాన్ ఉన్నాయి. బంగారు నగలు భార్య పేరిట 800 గ్రాములు (రూ.52లక్షలు), అతని పేరిట 200 గ్రాముల చొప్పున ఉన్నాయి.
కేశినేని నానికి 6 లగ్జరీ కార్లు
విజయవాడ లోక్సభ వైకాపా అభ్యర్థి కేశినేని శ్రీనివాస్(నాని) కుటుంబ స్థిర, చరాస్తులు రూ.77.32 కోట్లు. ఇందులో స్థిరాస్తులు రూ.69.26 కోట్లు, చరాస్తులు రూ.8.06 కోట్లు. అప్పులు రూ.38.69 కోట్లు. నాని పేరుతో రూ.35.04 కోట్లు, భార్య పావని పేరుతో రూ.1.37 కోట్ల అప్పులున్నాయి. నాని పేరుతో మరో రూ.2.27 కోట్ల అప్పు వివాదంలో ఉంది. మెర్సిడెస్ బెంజ్, రేంజ్ రోవర్, మహీంద్రా థార్, టాటా సఫారీ, టాటా హారియర్, మహీంద్రా ఎక్స్యూవీ రకం 6 లగ్జరీ కార్లున్నాయి. నానిపై ఒక క్రిమినల్ కేసు ఉంది.
కైకలూరు ఎమ్మెల్యే ఆస్తి రెట్టింపు
ఏలూరు జిల్లా కైకలూరు వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు దంపతుల ఆస్తులు 2019తో పోల్చితే రెట్టింపయ్యాయి. నాగేశ్వరరావు పేరిట ఆస్తి రూ.17.80 కోట్లు కాగా, భార్య వీరకుమారి ఆస్తి రూ.15.80 కోట్లు. 2019లో వీరి ఉమ్మడి ఆస్తి 14.63 కోట్లు. 2019లో ఆయనపై 3 పోలీసు కేసులుండగా ఇప్పుడు లేవు. భార్య పేరిట 1.01 కిలోల బంగారముంది. ఇరువురికీ రూ.10 లక్షల చొప్పున అప్పులున్నాయి.
డాక్టర్ సింహాద్రి ఆస్తులు 138.41 కోట్లు
మచిలీపట్నం లోక్సభ వైకాపా అభ్యర్థి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావు ఆస్తులు రూ.138.41 కోట్లు. ఇందులో రూ.21.64 కోట్లు హిందూ అవిభక్త కుటుంబ(హెచ్యూఎఫ్) ఆస్తి. సింహాద్రి పేరున రూ.42.32 కోట్లు, భార్య నీలిమ పేరుతో రూ.14.04 కోట్ల చరాస్తులున్నాయి. సింహాద్రి పేరుపై రూ.34.81 కోట్లు, నీలిమ పేరున రూ.25.60 కోట్ల స్థిరాస్తి ఉంది. ఆయనపై అప్పులు, పోలీసు కేసులు లేవు.
మిథున్రెడ్డికి ఏపీలో రూ.వేల కోట్ల కాంట్రాక్టులు
రాజంపేట లోక్సభ వైకాపా అభ్యర్థి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి రూ.వేల కోట్ల కాంట్రాక్టులు చేస్తున్నారు. మిథున్రెడ్డి, లక్ష్మీదివ్య దంపతుల చరాస్తులు రూ.47.54 కోట్లు, స్థిరాస్తులు రూ.163.79 కోట్లు. రుణాలు రూ.54.44 కోట్లు. వీరికి పీఎల్ఆర్ ప్రాజెక్ట్స్తో పాటు వివిధ కంపెనీల్లో రూ.13.91 కోట్ల పెట్టుబడులున్నాయి. పీఎల్ఆర్ ప్రాజెక్ట్స్ కింద రూ.11,955 కోట్ల విలువైన 55 కాంట్రాక్టు పనులు చేస్తుండగా, వీటిలో ఏపీలోనే రూ.6,646 కోట్ల విలువైన 41 పనులు జరుగుతున్నాయి. ఉమ్మడి చిత్తూరు, కడప.. ముఖ్యంగా పుంగనూరు, మదనపల్లె, పీలేరు నియోజకవర్గాల్లో ఎక్కువగా పనులు చేపట్టారు. ఆయనపై పోలీసు కేసుల్లేవు.
ద్వారంపూడిపై కేసుల్లేవట
కాకినాడ నగర వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి కుటుంబ ఆస్తులు రూ.76.01 కోట్లు. వీటిలో చరాస్తులు రూ.11.89 కోట్లు, స్థిరాస్తులు రూ.64.11 కోట్లు. అప్పులు రూ.51.45 కోట్లు. 3.43 కిలోల బంగారం, 260 కిలోల వెండితో పాటు తన పేరిట ఇన్నోవా కారు, భార్య పేరిట హోండా సిటీ, వెర్న కార్లు ఉన్నట్లు చూపారు. ఆయనపై ఎలాంటి కేసులూ లేవు.
స్థిరాస్తులు లేని కన్నబాబు
కాకినాడ గ్రామీణ వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే కురసాల కన్నబాబుకు ఎలాంటి స్థిరాస్తులూ లేవు. అతనితో పాటు కుటుంబ సభ్యుల పేరిట రూ.2.32 కోట్ల చరాస్తులు మాత్రమే ఉన్నట్లు పేర్కొన్నారు. కన్నబాబు వద్ద 100 గ్రాములు, భార్య వద్ద అర కిలో, కుమార్తె వద్ద 300 గ్రాముల బంగారం ఉంది. రూ.21.58 లక్షల విలువైన కారు, ఉంది.
కాకాణిపై ఓటర్లకు కల్తీ మద్యం సరఫరా కేసు
నెల్లూరు జిల్లా సర్వేపల్లి వైకాపా అభ్యర్థి, మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డిపై 7 పోలీసు కేసులుండగా.. వాటిలో రాపూరు, నెల్లూరు ఠాణాల పరిధిలో ఓటర్లకు కల్తీ మద్యం సరఫరా చేయడంపై సీఐడీ పెట్టిన 4 కేసులు విచారణలో ఉన్నాయి. ఫోర్జరీ, చట్టసభల నిబంధనల ఉల్లంఘన వంటి కేసులూ ఉన్నాయి. కాకాణి కుటుంబ ఆస్తులు రూ.28.66 కోట్లు. అందులో మంత్రి పేరున రూ.2.43 కోట్లు, భార్య విజిత పేరిట రూ.2.36 కోట్ల చరాస్తులు ఉన్నాయి. గోవర్ధన్రెడ్డిపై రూ.13.70 కోట్లు, భార్య పేరున రూ.10.17 కోట్ల విలువైన స్థిరాస్తులున్నాయి. వీరికి అప్పుల్లేవు.
విక్రమ్రెడ్డిపై దేశవ్యాప్తంగా 8 కేసులు
ఆత్మకూరు వైకాపా అభ్యర్థి మేకపాటి విక్రమ్రెడ్డిపై దేశవ్యాప్తంగా 8 కేసులున్నాయి. కేరళలో టోల్ వసూళ్లలో అక్రమాలు, కేరళ, ఉత్తర్ప్రదేశ్లలో చెక్ బౌన్స్, కంపెనీ వ్యవహారాల్లో అక్రమాలు, బిల్లుల చెల్లింపుల్లో జాప్యం వంటి అక్రమాలపై ఈడీ, ఐటీ కేసులు నమోదయ్యాయి. వీరి కుటుంబ ఆస్తుల విలువ రూ.209.22 కోట్లు. విక్రమ్రెడ్డి పేరున రూ.191.33 కోట్లు, భార్య వైష్ణవిరెడ్డి పేరుతో రూ.17.82 కోట్ల స్థిర, చరాస్తులు ఉన్నాయి. వీరికి రూ.32.64 కోట్లు అప్పు ఉంది.
కొడాలి నానికి వాహనాలే ఎక్కువ
గుడివాడ వైకాపా అభ్యర్థి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు అలియాస్ కొడాలి నాని కుటుంబ స్థిర, చరాస్తుల మొత్తం రూ.16 కోట్లు. అప్పులు రూ.4.92 కోట్లు. మరో రూ.5.51 కోట్ల అప్పు వివాదంలో ఉంది. దంపతుల పేరుతో 2.14 కిలోల బంగారముంది. నానికి 3 లారీలు, ఒక ఫార్చ్యూనర్, 2 మహీంద్రా స్కార్పియోలు, ఒక మహీంద్రా జీపు, ఒక అంబాసిడర్ కారు ఉన్నాయి. నానిపై 2005-2018 మధ్య 5 కేసులు నమోదు కాగా, వాటిలో 4 కేసులను 2023-2024 మధ్య కొట్టేశారు. ప్రభుత్వ అధికారి విధులకు ఆటంకం కలిగించిన కేసులో గుడివాడ కోర్టు శిక్ష వేయగా, దీనిపై ఎగువ కోర్టులో అప్పీల్ చేశారు. ప్రస్తుతం ఈ ఒక్క కేసే పెండింగ్లో ఉంది. నాని పదో తరగతి ఫెయిల్ అయ్యారు.
బొత్స ఝాన్సీకి ఆస్తులెన్నో.. అప్పులూ అంతే
విశాఖ వైకాపా ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీపై ఎలాంటి కేసులూ లేవు. ఆమెకు ఆస్తులు ఎన్నున్నాయో.. అప్పులూ అంతే ఉన్నట్లు చూపించారు. ఆమెకు రెండు కార్లు (రూ.73.33 లక్షలు, రూ.8 లక్షలు), 325 తులాల బంగారం, భర్త బొత్సకు ఒక కారు (రూ.15.95 లక్షలు), 31 తులాల ఆభరణాలున్నాయి. ఇద్దరి పేరున రూ.21.19 కోట్ల స్థిర, చరాస్తులున్నాయి. చరాస్తుల్లో ఝాన్సీ పేరుతో రూ.4.75 కోట్లు, బొత్స పేరుతో రూ.3.78 కోట్లు ఉన్నాయి. ఝాన్సీ చేతిలో రూ.4.50 లక్షలు, మంత్రి వద్ద రూ.4.75 లక్షల నగదు ఉంది. స్థిరాస్తుల్లో ఝాన్సీ పేరుతో రూ.4.46 కోట్లు, భర్త పేరుతో రూ.6.75 కోట్ల విలువైన భవనాలు, భూములున్నాయి. ఝాన్సీకి రూ.2.32 కోట్లు, బొత్సకు రూ.1.92 కోట్ల అప్పులున్నాయి.
భారీగా పెరిగిన భరత్రామ్ స్థిరాస్తులు
రాజమహేంద్రవరం నగర వైకాపా ఎమ్మెల్యే, ఎంపీ భరత్రామ్ కుటుంబ సభ్యుల ఆస్తులు రూ.95.02 కోట్లు. 2019లో భరత్ దంపతుల ఆస్తుల వివరాలు చూపించగా, ఈసారి హిందూ అవిభాజ్య కుటుంబం (హెచ్యూఎఫ్)గా పేర్కొంటూ అందరి ఆస్తులను ప్రస్తావించారు. 2019లో భరత్ దంపతుల చరాస్తులు రూ.3.60 కోట్లు. ప్రస్తుతం భరత్ పేరిట రూ.7.99 కోట్లు, భార్య పేరిట రూ.35 లక్షలు, హెచ్యూఎఫ్లో రూ.15 లక్షలున్నాయి. బీఎండబ్ల్యూ ఎక్స్-7 (రూ.1.15 కోట్లు), జాగ్వార్ (రూ.31.93 లక్షలు) కార్లు ఉన్నాయి. 2019లో భరత్ పేరిట రూ.42.21 కోట్ల స్థిరాస్తి ఉండగా, ఇప్పుడు అతని పేరిట రూ.33.69 కోట్లు, హెచ్యూఎఫ్ పేరిట రూ.52.84 కోట్లు మొత్తంగా రూ.86.53 కోట్ల ఆస్తిని పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక భరత్పై 3 కేసులు నమోదయ్యాయి.
రాంబాబుపై ‘సంక్రాంతి సంబరాల’ కేసు
పల్నాడు జిల్లా సత్తెనపల్లి వైకాపా అభ్యర్థి, మంత్రి అంబటి రాంబాబు చర, స్థిరాస్తులు ఐదేళ్లలో పెరిగాయి. రాంబాబు, విజయలక్ష్మి దంపతులకు 2019లో చెరో కారు ఉండగా, ప్రస్తుతం రాంబాబు పేరుపై 3 కార్లున్నాయి. ఆయన పేరిట చరాస్తులు 2019లో రూ.1.12 కోట్లు కాగా, నేడు 3.41 కోట్లు. దంపతుల స్థిరాస్తులు 2019లో రూ.6.63 కోట్లు కాగా, ప్రస్తుతం రూ.25.07 కోట్లు. మంత్రికి రూ.6.82 కోట్లు, భార్యకు రూ.4.37 కోట్ల అప్పు ఉంది. మంత్రి రాంబాబుపై 2 కేసులుండగా, వాటిలో సంక్రాంతి సంబరాల పేరుతో టికెట్లు అమ్ముతూ లక్కీ డ్రా నిర్వహించడంపై ఒక కేసు నమోదైంది.
లోకేశ్ కుటుంబ ఆస్తి రూ.542 కోట్లు
మంగళగిరి తెదేపా అభ్యర్థి నారా లోకేశ్ కుటుంబ ఆస్తులు రూ.542.17 కోట్లు. ఇందులో లోకేశ్ పేరిట చరాస్తులు రూ.341.68 కోట్లు. స్థిరాస్తులు రూ.92.31 కోట్లు. అప్పు రూ.18.44 కోట్లు. భార్య బ్రాహ్మణికి రూ.45.06 కోట్ల చరాస్తులు, రూ.35.59 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. ఆమె అప్పు రూ.14.34 కోట్లు. వీరి కుమారుడు దేవాన్ష్ చరాస్తులు రూ.7.35 కోట్లు కాగా, స్థిరాస్తులు రూ.20.17 కోట్లు. ముగ్గురి పేరుతోనూ హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్లో షేర్లు ఉన్నాయి. రాష్ట్రంలో వివిధ ఠాణాల్లో లోకేశ్పై 23 కేసులున్నాయి.
శ్రీభరత్ దంపతుల సంపద రూ.393 కోట్లు
విశాఖపట్నం లోక్సభ తెదేపా అభ్యర్థి ఎం. శ్రీభరత్, భార్య తేజస్విని పేరిట ఆస్తుల విలువ రూ.393.41 కోట్లు. చరాస్తుల్లో భరత్ పేరిట రూ.16.89 కోట్లు, తేజస్విని పేరుతో రూ.48.36 కోట్లు ఉన్నాయి. వెరసి రూ.65.26 కోట్లు. శ్రీభరత్ పేరిట 7 కిలోల బంగారం, 51.80 కిలోల వెండి, తేజస్విని పేరుతో 5.3 కిలోల బంగారం, 52.50 కిలోల వెండి ఉంది. భరత్కు కియా, ఆడి క్యూ-7 మోడల్ కార్లున్నాయి. స్థిరాస్తుల్లో శ్రీభరత్ పేరున రూ.183.95 కోట్లు, భార్య పేరుతో రూ.44.20 కోట్ల ఆస్తులున్నాయి. భరత్ అప్పు రూ.36 లక్షలు. తేజస్విని అప్పు రూ.1.52 కోట్లు. బెంగళూరులోని ఓ ఠాణాలో శ్రీభరత్పై 2 పోలీసు కేసులున్నాయి.
నారాయణ దంపతుల ఆస్తులు రూ.824.05 కోట్లు
నెల్లూరు నగరం తెదేపా అభ్యర్థి పొంగూరు నారాయణ, రమాదేవి దంపతుల మొత్తం ఆస్తి రూ.824.05 కోట్లు. నారాయణ పేరిట చరాస్తులు రూ.78.66 కోట్లు. రమాదేవి పేరిట ఉన్నవి రూ.100.87 కోట్లు. ఆయన స్థిరాస్తులు రూ.207.50 కోట్లు. రమాదేవి స్థిరాస్తులు రూ.437.02 కోట్లు. నారాయణకు రూ.62.43 కోట్లు, భార్యకు రూ.127.16 కోట్ల అప్పులున్నాయి. నారాయణపై 8 కేసులున్నాయి. వీటిలో వరకట్న వేధింపులు, విద్యార్థి ఆత్మహత్య, రాజధాని అమరావతి వ్యవహారంలో సీఐడీ నమోదు చేసిన కేసులున్నాయి.
వసంత కుటుంబ ఆస్తులు రూ.188 కోట్లు
ఎన్టీఆర్ జిల్లా మైలవరం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి వసంత వెంకట కృష్ణప్రసాద్పై 6 పోలీసు కేసులున్నాయి. వీటిలో సీబీఐ, ఈడీ కేసులు 2 ఉన్నాయి. వసంత స్థిరాస్తులు రూ.91.94 కోట్లు. భార్య పేరిట రూ.9.87 లక్షలు, కుమారుడి పేరిట రూ.6.18 కోట్లు, కుమార్తె పేరిట రూ.2.33 కోట్ల ఆస్తులున్నాయి. చరాస్తుల్లో అతని పేరిట రూ.81.18 కోట్లు, భార్య పేరిట రూ.6.70 కోట్లు, కుమారుడి పేరిట రూ.18.35 కోట్లు, కుమార్తె పేరున రూ.24 లక్షల చొప్పున ఉన్నాయి. వీరి అప్పులు రూ.48 కోట్లు.
వేమిరెడ్డి కుటుంబ ఆస్తులు రూ.716.31 కోట్లు
నెల్లూరు లోక్సభ తెదేపా అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి కుటుంబ ఆస్తులు రూ.716.31 కోట్లు. వీటిలో ప్రభాకర్రెడ్డి పేరుతో రూ.639.26 కోట్ల చర, స్థిరాస్తులుండగా, భార్య ప్రశాంతిరెడ్డి పేరుపై రూ.77.05 కోట్లున్నాయి. ఉమ్మడి రుణం రూ.197.29 కోట్లు. రూ.6.96 కోట్ల విలువైన 19 కార్లున్నాయి. ప్రభాకర్రెడ్డిపై ఆదాయ పన్నుకు సంబంధించి 6 కేసులున్నాయి. హైదరాబాద్లోని ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టులో ఓ కేసు పెండింగ్లో ఉంది.
బుద్ధప్రసాద్ ఆస్తులకు.. అప్పులు సరి!
కృష్ణా జిల్లా అవనిగడ్డ జనసేన అభ్యర్థి, మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్ స్థిరాస్థి విలువ రూ.33 లక్షలు. చరాస్తుల విలువ రూ.12 లక్షలు. అప్పులు రూ.32.50 లక్షలు. భార్య పేరిట 300 గ్రాముల బంగారం ఉంది. కుటుంబ ఉమ్మడి ఆస్తి రూ.77 లక్షలు.
అచ్చెన్నాయుడిపై 23 కేసులు
శ్రీకాకుళం జిల్లా టెక్కలి తెదేపా అభ్యర్థి, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడి పేరిట రూ.1.32 కోట్లు, భార్య విజయమాధవి పేరిట రూ.4.68 కోట్ల చరాస్తులున్నాయి. అచ్చెన్న పేరిట రూ.2.31 కోట్లు, ఆమె పేరిట 6.13 కోట్ల విలువైన స్థిరాస్తులున్నాయి. అప్పులు అచ్చెన్నకు రూ.42.90 లక్షలు, భార్యకు రూ.3.36 కోట్లు ఉన్నాయి. ఆయన పేరిట రాష్ట్రవ్యాప్తంగా పలు స్టేషన్లలో 23 పోలీసు కేసులున్నాయి.
తెదేపా దళిత ఎమ్మెల్యే అభ్యర్థి సౌమ్యపై 23 కేసులు
ఎన్టీఆర్ జిల్లా నందిగామ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి, దళిత నాయకురాలు తంగిరాల సౌమ్యపై 23 కేసులు పెట్టారు. వైకాపా ప్రభుత్వం ఏర్పడ్డాక 2020 నుంచి ఆమె తరచూ ధర్నాలు, ఆందోళనల్లో పాల్గొంటున్నారు. ఈ కారణంగా నందిగామ, కంచికచర్ల, వీరులపాడు, ఇబ్రహీంపట్నం, గన్నవరం ఠాణాల్లో కలిపి 23 కేసులు నమోదయ్యాయి.
వంగలపూడి అనితపై 7 కేసులు
అనకాపల్లి జిల్లా పాయకరావుపేట తెదేపా అభ్యర్థి వంగలపూడి అనితపై 2019 తర్వాత 6 కేసులు నమోదయ్యాయి. అంతకు ముందు ఒక కేసు ఉండేది. తెలుగు మహిళ అధ్యక్షురాలిగా వివిధ ఆందోళనల్లో పాల్గొన్న ఆమెపై విశాఖ, పులివెందుల, తూర్పు గోదావరి జిల్లా కోటనందూరు, నర్సీపట్నం, నక్కపల్లి, నందిగామ స్టేషన్లలో ఈ కేసులున్నాయి. ఆమె పేరిట చరాస్తులు రూ.35.64 లక్షలు. స్థిరాస్తి (ఇల్లు) విలువ రూ.1.06 కోట్లు. బ్యాంకుల్లో రూ.1.07 కోట్ల అప్పు ఉంది.
యరపతినేనిపై 22 కేసులు
పల్నాడు జిల్లా గురజాల తెదేపా అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావుపై 2019లో ఒక్క కేసూ లేకపోగా, ఈ ఐదేళ్లలో 22 కేసులు నమోదయ్యాయి. అతని చరాస్తులు రూ.16 లక్షలు, స్థిరాస్తులు రూ.4.కోట్లు, రూ.43 లక్షల అప్పు ఉంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
160కి పైగా అసెంబ్లీ.. 25 ఎంపీ స్థానాలు కూటమివే: చంద్రబాబు
తాజా ఎన్నికల్లో 160కి పైగా అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో కూటమి గెలుస్తుందని తెదేపా అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. -
ఏపీలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం.. షెడ్యూల్ ఖరారు
ఏపీలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పర్యటన ఖరారైంది. -
మన భూములపై జగన్ పెత్తనం.. అరాచకానికి పరాకాష్ట: చంద్రబాబు
రాష్ట్రంలో పింఛనుదారుల మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
ఏంటీ దారుణం.. మన ఆస్తి మనదని రుజువు చేసుకోవాలా?: పవన్
వైకాపా ప్రభుత్వం యువతను గంజాయి మత్తుకు బానిస చేసిందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ విమర్శించారు. -
పేదల ప్రాణాలతో రాజకీయం చేస్తారా?: సీఎస్కు చంద్రబాబు లేఖ
పింఛన్ల పంపిణీలో ప్రజల ఇబ్బందులపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డికి తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. -
వైకాపా అభ్యర్థి పేర్ని కిట్టు సహా ఆరుగురిపై హత్యాయత్నం కేసు
మచిలీపట్నం శాసనసభ వైకాపా అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)పై హత్యాయత్నం కేసు నమోదైంది. -
ప్రపంచంలో ఎక్కడా లేని మద్యం బ్రాండ్లు ఏపీలో..: షర్మిల ఎద్దేవా
ఏటా సంక్రాంతికి జాబ్ క్యాలెండర్ అని జగన్ అన్నారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు. జగన్ సీఎం అయ్యాక 5 సంక్రాంతులొచ్చాయి.. -
పిఠాపురంలో పవన్కే జై.. ముద్రగడ కుమార్తె కీలక వ్యాఖ్యలు
జనసేన (Janasena) అధినేత పవన్కల్యాణ్ (Pawan Kalyan)ను ఉద్దేశించి మాజీ మంత్రి, వైకాపా నేత ముద్రగడ పద్మనాభం చేసిన వ్యాఖ్యలను ఆమె కుమార్తె క్రాంతి ఖండించారు. -
పింఛన్ల పంపిణీ.. ప్రతి నెలా ఇంత మందిని చంపాలని టార్గెట్ పెట్టుకున్నారా?: వైఎస్ షర్మిల
వృద్ధులకు పింఛన్ల పంపిణీలో వైకాపా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దుర్మార్గమని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. -
పింఛన్ల పంపిణీపై సీఎస్ అబద్ధాలు: తెదేపా
రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ 90 శాతం పూర్తి అయిందంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) జవహర్రెడ్డి అబద్ధాలాడుతున్నారని తెదేపా నేతలు ధ్వజమెత్తారు. -
ఎంత ధైర్యం.. మమ్మల్నే ప్రశ్నిస్తావా?
ప్రచారానికి వచ్చిన వైకాపా నాయకులను... తాగునీరు, పారిశుద్ధ్య సమస్యల గురించి ప్రశ్నించిన మహిళపై ఆ పార్టీ వారు దాడి చేసి గాయపరిచారు. -
భీమిలిలో గంటా X బొత్స
విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో రాజకీయం.. పోలింగ్ తేదీ సమీపించే కొద్దీ రసవత్తరంగా మారుతోంది. అక్కడ తెదేపా అభ్యర్థి గంటా శ్రీనివాసరావు, మంత్రి బొత్స సత్యనారాయణ మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్టుగా సాగుతోంది. -
కాగితాలపైనే గ్రామాలు.. కనిపించరక్కడ ప్రజలు!
ఎన్నికలొచ్చాయంటే నాయకులకు ఎక్కడెక్కడో ఉన్న ఊళ్లన్నీ గుర్తుకొస్తాయి. ఏనాడూ వెళ్లని ఊళ్ల రికార్డులు తెప్పించుకొని మరీ అక్కడికి వెళ్లి ఓట్ల వేట మొదలుపెడతారు. -
పెయిడ్ ఆర్టిస్టులు ఎవరు జగన్?: చీపురుపల్లి సభలో బాలకృష్ణ
అమరావతి రాజధానిపై ఉద్యమిస్తున్న రైతులను పెయిడ్ ఆర్టిస్టులన్న సీఎం జగన్ విశాఖలో జరిగిన పెట్టుబడుల సదస్సులో ఎంత పెట్టుబడులు? ఎన్ని పరిశ్రమలు తీసుకువచ్చారో చెప్పాలంటూ శాసనసభ సాక్షిగా అడిగితే సమాధానం చెప్పలేకపోయారని.. దీన్ని బట్టి ఎవరు పెయిడ్ ఆర్టిస్టులో తెలుస్తుందని సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. -
వృద్ధులపై ప్రభుత్వానికి కనికరం లేదా?: డీఎల్ రవీంద్రారెడ్డి
పింఛను డబ్బు బ్యాంకులో జమ చేశామని, వెళ్లి తెచ్చుకోవాలని చెబుతున్న ప్రభుత్వానికి ప్రజలు, వృద్ధులపై ఏమాత్రం కనికరం లేదని మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. -
మీ వెనుక నేనుంటా.. మాటకు కట్టుబడి ఉంటా
‘దశాబ్దం తర్వాత ప్రజలను ఓటేయమని అడగట్లేదు.. వేడుకుంటున్నా.. కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రార్థిస్తున్నా.. కూటమి ప్రభుత్వం వచ్చేస్తోంది. -
జగన్వి నవ దందాలు
‘పొరపాటున వైకాపాకు ఓటేశారో మీ ఇంటికి గొడ్డలి వస్తుంది.. జాగ్రత్త’ అంటూ తెదేపా అధినేత చంద్రబాబు ఓటర్లను హెచ్చరించారు. సీఎం జగన్ నవ దందాలకు పాల్పడ్డారని ఆరోపించారు. -
ఏలూరు పోరు.. కూటమిదే జోరు!
గోదారి గలగలలు.. కొల్లేటి పక్షుల కిలకిలలు.. ఆత్మీయ పలకరింపుల సంగమమైన ఏలూరు జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల్లో గెలుపుపై ధీమా కనిపిస్తోంది. ఏలూరు జిల్లా వాసులు ఈసారి మార్పు కోరుకుంటున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. -
జమీందార్ల ప్రచార పత్రం ఎలా ఉండేదంటే?
జమీందారీ వ్యవస్థలు ఉన్నప్పుడు 1937లో తొలిసారి ఎన్నికలు జరిగాయి. 1937 ఫిబ్రవరి 9న విజయనగరం గ్రామ సంస్థానానికి ఎన్నిక నిర్వహించారు. -
నువ్వెంత.. నీ అంతు చూస్తా
విధుల్లో ఉన్న గిరిజన మహిళా కానిస్టేబుల్పై రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అనుచరుడు రెచ్చిపోయారు. కులం పేరుతో దూషించారు. -
పోలవరం పనుల్లో వైకాపా సర్కారు ఘోర వైఫల్యం
ఆంధ్రప్రదేశ్కు మేలు చేసే పోలవరం ప్రాజెక్టును రాజకీయ కారణాలతో పూర్తి చేయకపోవడం బాధాకరమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.