Top Ten News @ 9PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in Eenadu.net: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 01 Jun 2023 21:04 IST

1. ‘బాబాయిని చంపిందెవరు’.. యువగళం పాదయాత్రలో పోస్టర్లతో ప్రదర్శన

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరులో కొనసాగుతోంది. ఈ సందర్భంగా పాదయాత్రలో ఆ పార్టీ శ్రేణులు వివేకా హత్యకు సంబంధించిన పోస్టర్లు, ప్లకార్డులు పట్టుకుని ర్యాలీ తీశారు. వివేకాని ఎవరు చంపారనే దానిపై వివేకా ఫొటో, జగన్‌ ఫొటో, అవినాష్‌రెడ్డి ఫొటోలను ప్రదర్శిస్తూ ‘బాబాయిని ఎవరు చంపారు?’ అని రాసి ఉన్న పోస్టర్లు, ప్లకార్డులు ప్రదర్శించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. పార్టీలోని కొందరు కావాలనే ఇబ్బంది పెట్టారు.. సీఎంతో భేటీ అనంతరం బాలినేని

సీఎం జగన్‌తో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి భేటీ ముగిసింది. గురువారం సాయంత్రం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌తో సమావేశమైన బాలినేని .. జిల్లాలో తాను ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. సీఎంతో సమావేశం ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లాలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను సీఎం దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. 2025 జూన్‌ నాటికి పోలవరం పూర్తి చేయాలని లక్ష్యం

పోలవరం ప్రాజెక్టును 2025 జూన్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఏపీ నీటిపారుదల ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ నారాయణ రెడ్డి తెలిపారు. ఏడాది ముందుగానే నిర్మాణం పూర్తి చేయాలని ప్రయత్నిస్తున్నామని చెప్పారు. గురువారం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ నేతృత్వంలో పోలవరం ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఆఫీసుకు రాని ఉద్యోగులకు నోటీసులు.. టీసీఎస్‌ క్లారిటీ!

వారంలో మూడు రోజులు ఆఫీసుకు రాని ఉద్యోగులకు నోటీసులు జారీ చేస్తున్నట్లు వచ్చిన వార్తలను ప్రముఖ ఐటీ దిగ్గజం టీసీఎస్‌ ( TCS) ఖండించింది. ఉద్యోగులు ఆఫీసు వాతావరణానికి అలవాటు పడే విధంగా సంస్థ వారిని ప్రోత్సహిస్తుందని తెలిపింది. ఇందుకోసం నెలలో 12 రోజులు ఆఫీసుకు వచ్చి పనిచేయాలనే నిబంధన విధించామని కంపెనీ ప్రతినిధి వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. రెజ్లర్లకు న్యాయం జరిగే వరకు పోరాడుతాం.. రైతు సంఘాలు

లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ను (Brij Bhushan) అరెస్టు చేయాలని కోరుతూ రెజ్లర్లు చేస్తున్న ఆందోళనకు (Wrestlers Protest) పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు హరియాణా రైతులతోపాటు ఖాప్‌ పంచాయతీలు (Khap Panchayat) ప్రకటించాయి. శుక్రవారం నిర్వహించనున్న సమావేశంలో తదుపరి కార్యాచరణపై చర్చిస్తామని భారతీయ కిసాన్‌ యూనియన్‌ నేత రాకేశ్‌ టికాయిత్‌ (Rakesh Tikait) పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. బిల్‌ గేట్స్‌ మెచ్చిన నెట్‌ఫ్లిక్స్‌ సిరీస్‌ ఇదే..!

మైక్రోసాఫ్ట్‌ సహ- వ్యవస్థాపకుడు, ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బిల్‌ గేట్స్‌ (Bill gates) ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలపై తన అభిప్రాయాలను పంచుకుంటుంటారు. యూట్యూబ్‌ సహా సోషల్‌ మీడియాలో వీడియోలు, వ్యాసాలు, ఇంటర్వ్యూలు ఇలా వివిధ రకాలుగా తన ఫాలోవర్లకు కొత్త సమాచారాన్ని అందజేస్తుంటారు. ముఖ్యంగా వ్యాక్సినేషన్‌, అంటువ్యాధులపై ఆయన ప్రధానంగా దృష్టి సారిస్తుంటారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. దిల్లీ ‘ఆర్డినెన్స్‌’పై పోరాటం..! మద్దతు పలికిన స్టాలిన్‌

దిల్లీ (Delhi)లో ప్రభుత్వ అధికారుల నియామకాలు, బదిలీల విషయంలో విషయంలో కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ (Ordinance)పై స్థానిక సీఎం, ఆప్‌ (AAP) అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) తన పోరును ముమ్మరం చేశారు. ఈ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా విపక్షాల మద్దతును కూడగడుతోన్న కేజ్రీవాల్‌.. తాజాగా తమిళనాడు (Tamil Nadu) ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ (MK Stalin)ను కలిశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. హిట్‌ నుంచి సూపర్‌ హిట్‌కు..! నేపాల్‌తో సంబంధాలపై ప్రధాని మోదీ

భారత్‌, నేపాల్‌ల మధ్య సంబంధాల (India- Nepal Ties)ను హిమాలయాలంతా ఉన్నతంగా తీసుకెళ్లేందుకు కృషి చేస్తూనే ఉంటామని ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) తెలిపారు. సరిహద్దు సమస్యలతోసహా అనేక అంశాల పరిష్కారానికి ప్రయత్నిస్తామని చెప్పారు. భారత పర్యటనకు వచ్చిన నేపాల్‌ ప్రధాని పుష్పకమల్ దహల్ ‘ప్రచండ’ (Pushpa Kamal Dahal)తో గురువారం ప్రధాని మోదీ చర్చలు జరిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఆకలికి తట్టుకోలేక 60 మంది చిన్నారులు మృతి.. పాలు లేక నీళ్లు తాగిస్తున్న దృశ్యాలు..!

సూడాన్ (Sudan)లో సైన్యం, పారామిలిటరీ బలగాల మధ్య జరుగుతోన్న ఆధిపత్యపోరు.. అక్కడి ప్రజల పాలిట శాపమైంది. లక్షల్లో ప్రజలు వలసబాట పట్టారు. వందల్లో మరణాలు సంభవిస్తున్నాయి. ఈ క్రమంలో రాజధాని నగరం ఖార్తూమ్‌లోని ఓ అనాథశరణాలయం(orphanage) నుంచి వెలుగులోకి వచ్చిన దృశ్యాలు హృదయాలను మెలిపెడుతున్నాయి. అక్కడి పాలకులు ఆధిపత్య పోరులో పడి పసిప్రాణాల సంగతే మర్చిపోయారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. చైనాలో ఎలాన్‌ మస్క్‌ పర్యటన ఆందోళనకరమే : వివేక్‌ రామస్వామి

ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ చైనాలో బిజీ బిజీగా తన పర్యటన కొనసాగిస్తున్నారు. మూడేళ్ల తర్వాత అక్కడ పర్యటిస్తున్న మస్క్‌.. చైనా ప్రభుత్వ అధికారులు, కీలక నేతలతో మంతనాలు జరుపుతున్నారు. ఇలా చైనాలో టెస్లా అధినేత పర్యటించడం పట్ల అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ అభ్యర్థిగా పోటీచేసేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్న వివేక్‌ రామస్వామి ఆందోళన వ్యక్తం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని