TCS: ఆఫీసుకు రాని ఉద్యోగులకు నోటీసులు.. టీసీఎస్‌ క్లారిటీ!

టీసీఎస్‌ (TCS) నిబంధన ప్రకారం నెలకు 12రోజుల పాటు ఆఫీసు నుంచి పనిచేయని ఉద్యోగులకు నోటీసులు జారీ చేస్తున్నట్లు వచ్చిన వార్తలపై కంపెనీ స్పందించింది. క్రమశిక్షణా చర్యల్లో భాగంగా ఉద్యోగులకు మెమోలు జారీ చేయలేదని తెలిపింది. 

Published : 01 Jun 2023 18:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వారంలో మూడు రోజులు ఆఫీసుకు రాని ఉద్యోగులకు నోటీసులు జారీ చేస్తున్నట్లు వచ్చిన వార్తలను ప్రముఖ ఐటీ దిగ్గజం టీసీఎస్‌ ( TCS) ఖండించింది. ఉద్యోగులు ఆఫీసు వాతావరణానికి అలవాటు పడే విధంగా సంస్థ వారిని ప్రోత్సహిస్తుందని తెలిపింది. ఇందుకోసం నెలలో 12 రోజులు ఆఫీసుకు వచ్చి పనిచేయాలనే నిబంధన విధించామని కంపెనీ ప్రతినిధి వెల్లడించారు. అయితే, 12 రోజుల ఆఫీసు నిబంధన పాటించని ఉద్యోగులకు మెమోలు ఇస్తామని హెచ్చరించినట్లు వెల్లడైన సమాచారం పూర్తిగా అవాస్తవమని అన్నారు. 

‘‘గత రెండేళ్లలో ఎంతో మంది కొత్త వారు టీసీఎస్‌లో ఉద్యోగంలో చేరారు. అయితే, కరోనా పరిస్థితుల కారణంగా వారిలో ఎక్కువ శాతం మంది ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితులు కుదుటపడటంతో వారంతా ఆఫీసు వాతావరణానికి అలవాటు పడాలని సంస్థ భావిస్తోంది. ఇందుకోసం వారానికి మూడు రోజులు వారంతా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని సూచించింది. దీనివల్ల సీనియర్‌ ఉద్యోగులతో కలిసి పనిచేయడం, కంపెనీ అభివృద్ధిలో భాగస్వామ్యం కావడంతోపాటు మంచి ఫలితాలను సాధించవచ్చని కంపెనీ భావిస్తోంది. అయితే, కంపెనీ నిబంధన ప్రకారం ఆఫీసుకు రాని ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ ఎలాంటి నోటీసులు వారికి పంపలేదు. కొంతమంది ఉద్యోగులకు క్రమశిక్షణా చర్యల్లో భాగంగా మెమో జారీ చేసినట్లు వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవం’’ అని టీసీఎస్‌ ప్రతినిధి తెలిపారు. 

ఇంటి నుంచి పనిచేసేందుకు 100 శాతం మంది ఉద్యోగుల్ని అనుమతించబోమని టీసీఎస్‌ గతేడాది ప్రకటించింది. ఇందులో భాగంగానే గతేడాది అక్టోబరు నుంచి వారంలో మూడు రోజులు ఆఫీసుకు వచ్చి పనిచేయాలని కంపెనీ ఉద్యోగులకు మెయిల్‌ ద్వారా సమాచారం పంపింది. ఈ మేరకు సీనియర్‌ ఉద్యోగులతోపాటు, కొత్త ఉద్యోగులతో కలిపి రోస్టర్‌ విధానాన్ని రూపొందించింది. దాని ప్రకారం ఉద్యోగులు ఆఫీసుకు వచ్చి పనిచేయాలని సూచించింది. అయితే, ఈ రోస్టర్‌ విధానాన్ని పాటించని ఉద్యోగులకు నోటీసులు జారీ చేస్తున్నట్లు నిన్న పలు వార్తా సంస్థలు కథనాలు ప్రచురించాయి. తాజాగా టీసీఎస్‌ వాటిపై వివరణ ఇచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని