INSACOG: మూడు రాష్ట్రాల్లో JN.1 సబ్‌వేరియంట్.. 21 కేసులు నమోదు

కొవిడ్‌-19 కొత్త ఉపరకానికి సంబంధించి మూడు రాష్ట్రాల్లో ఇప్పటివరకు 21 కేసులు గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ పరిధిలోని ఇండియన్‌ సార్స్‌-కోవ్‌2 జీనోమిక్స్‌ కన్సార్టియం (INSACOG)తెలిపింది.

Updated : 20 Dec 2023 16:07 IST

దిల్లీ: దేశంలో కొన్నిరోజుల క్రితం వెలుగు చూసిన కొవిడ్‌-19 ఉపరకం జేఎన్‌.1 (subvariant JN.1) వ్యాప్తిపై కేంద్ర ఆరోగ్యశాఖ ఇప్పటికే అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఇదే సమయంలో ఈ ఉపరకానికి సంబంధించి మూడు రాష్ట్రాల్లో ఇప్పటివరకు 21 కేసులు గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ పరిధిలోని ఇండియన్‌ సార్స్‌-కోవ్‌2 జీనోమిక్స్‌ కన్సార్టియం (INSACOG) వెల్లడించింది. గోవాలో అత్యధికంగా 19, కేరళ, మహారాష్ట్రలో ఒక్కొక్కటి చొప్పున కొవిడ్‌-19 ఉపరకం కేసులు నమోదైనట్లు తెలిపింది.

Covid: అప్రమత్తంగా ఉండండి.. రాజకీయం చేయొద్దు: కొవిడ్ వ్యాప్తిపై రాష్ట్రాలకు కేంద్రం సూచన

దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి (Covid 19) క్రమంగా పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం వెల్లడించిన సమాచారం ప్రకారం, ఒక్కరోజే 614 కేసులు, మూడు మరణాలు నమోదయ్యాయి. మే 21 తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. దీంతో దేశంలో కొవిడ్‌ క్రియాశీల కేసుల సంఖ్య 2311కు చేరింది. ఈ నేపథ్యంలో కొవిడ్‌ వ్యాప్తిని ఎదుర్కొనే సన్నద్ధతపై అన్ని రాష్ట్రాల అధికారులతో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. తాజా వ్యాప్తిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేనప్పటికీ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ క్రమంలో ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో సన్నద్ధతపై మాక్‌ డ్రిల్‌ నిర్వహించాలన్నారు.

నాలుగు దేశాల్లో కొత్త వేరియంట్‌ : WHO

కొవిడ్‌ సబ్‌వేరియంట్‌ జేన్‌.1 ఇప్పటికే పలు దేశాల్లో వెలుగు చూసినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా వెల్లడించింది. అమెరికా, చైనా, సింగపూర్‌తోపాటు భారత్‌లోనూ ఈ కేసులు నమోదైనట్లు తెలిపింది. దీన్ని ‘వేరియంట్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌’గా పేర్కొన్న డబ్ల్యూహెచ్‌వో.. ఇది ప్రజల ఆరోగ్యంపై పెద్దగా ప్రభావం చూపదని పేర్కొంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు జేఎన్‌.1తోపాటు ఇతర వేరియంట్ల నుంచి రక్షణ కల్పిస్తాయని తెలిపింది. మరోవైపు గత వారం రోజుల్లోనే సింగపూర్‌లో 56వేల కొవిడ్‌ కేసులు నమోదు కావడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు