ICMR: ఇంటి వద్దే కరోనా పరీక్షలు

పల్లెల్లో కరోనా కేసులు నానాటికీ పెరిగిపోతున్న నేపథ్యంలో ఇంటింటికెళ్లి పరీక్షలు నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఆదేశాల మేరకు భారత వైద్య పరిశోధన మండలి

Published : 20 May 2021 11:56 IST

మార్గదర్శకాలు జారీ చేసిన ఐసీఎంఆర్‌ 

ఈనాడు, దిల్లీ: పల్లెల్లో కరోనా కేసులు నానాటికీ పెరిగిపోతున్న నేపథ్యంలో ఇంటింటికెళ్లి పరీక్షలు నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఆదేశాల మేరకు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) కార్యాచరణకు సిద్ధమయింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను బుధవారం రాత్రి విడుదల చేసింది.

లక్షణాలున్నవారు, ఇప్పటికే పాజిటివ్‌గా తేలినవారితో సన్నిహిత సంబంధం ఉన్న వారికి ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్ట్‌ చేయాలి. విచక్షణారహితంగా పరీక్షలు నిర్వహించకూడదు.

గూగుల్‌ప్లేలో ఉన్న హోం టెస్టింగ్‌ మొబైల్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకొని అందులో పేర్కొన్న నిబంధనలను అనుసరించి పరీక్షలు నిర్వహించాలి. రోగికి పాజిటివ్, నెగెటివ్‌ టెస్ట్‌ ఫలితాలు అందించాలి.

పరీక్ష ప్రక్రియ పూర్తయిన తర్వాత దానికి ఉపయోగించిన టెస్ట్‌ స్ట్రిప్‌ను మొబైల్‌యాప్, యూజర్‌ రిజిస్ట్రేషన్‌ చేసిన మొబైల్‌ఫోన్‌లో ఫొటో తీయాలి.

మొబైల్‌ఫోన్‌ యాప్‌లో నమోదు చేసిన డేటాను కేంద్రీకృత సర్వర్‌లో భద్రంగా నిల్వచేస్తారు. ఆ సర్వర్‌ ఐసీఎంఆర్‌ కొవిడ్‌-19 టెస్టింగ్‌ పోర్టల్‌కు అనుసంధానమై ఉంటుంది. అంతిమంగా డేటా అంతా ఇందులోనే నిల్వ ఉంటుంది.

ఈ పరీక్షల్లో పాజిటివ్‌ వచ్చిన రోగులంతా 100% పాజిటివ్‌గానే భావించాలి. మరోసారి పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం లేదు. వారంతా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ జారీచేసిన మార్గదర్శకాల ప్రకారం ఐసోలేషన్‌లో ఉండాలి.

లక్షణాలు ఉన్నప్పటికీ ర్యాట్‌ టెస్టుల్లో నెగెటివ్‌ వచ్చిన వారు వెంటనే ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలు చేయించుకోవాలి. తక్కువ వైరల్‌ లోడ్‌ ఉన్నవారి గుర్తించడంలో ర్యాట్‌ పరీక్షలు విఫలమయ్యే అవకాశం ఉన్నందున నెగెటివ్‌ వచ్చిన వారు ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలకు వెళ్లాలి.

లక్షణాలున్నా ఇందులో నెగెటివ్‌ వచ్చిన వారిని అనుమానిత కొవిడ్‌ రోగులుగా పరిగణించి వెంటనే ఐసోలేషన్‌కు వెళ్లమని చెప్పాలి. ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్ష ఫలితం వచ్చేంతవరకు వారు దాన్ని అనుసరించాలి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని