
నిర్భయ దోషి క్యురేటివ్ పిటిషన్ తిరస్కరణ
ఉరితీతపై కొనసాగుతున్న ఉత్కంఠ
దిల్లీ: నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషుల్లో ఒకడైన పవన్ కుమార్ గుప్తా వేసిన క్యురేటివ్ పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ కేసులో తనకు పడిన మరణశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చాలని కోరుతూ పవన్ ఇటీవల సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై నేడు ఛాంబర్లో విచారణ జరిపిన ధర్మాసనం.. దోషి అభ్యర్థనను కొట్టివేసింది. ఈ పిటిషన్ విచారణకు ఎలాంటి కొత్త అంశాలు లేవని స్పష్టం చేసింది. ఈ కేసులో దోషికున్న చిట్టచివరి న్యాయపరమైన అవకాశం ఇదే. అయితే అతడికి ఇంకా రాష్ట్రపతికి క్షమాభిక్షకు దరఖాస్తు పెట్టుకునే అవకాశం ఉంది. ఓవైపు నిర్భయ దోషులను రేపు(మార్చి 3న) ఉరితీసేందుకు ఏర్పాట్లు జరుగుతుండగా చివరి నిమిషంలో దోషులు న్యాయస్థానాలను ఆశ్రయించడంతో ఉరితీతపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.
ఈ కేసులో ఉరి అమలు వాయిదా పడేందుకు దోషులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. చివరి నిమిషంలో కొత్త పిటిషన్లు దాఖలు చేయడంతో గతంలో రెండు సార్లు శిక్ష అమలు వాయిదా పడింది. నిజానికి జనవరి 22నే వీరిని ఉరితీయాల్సి ఉండగా.. దోషుల్లో ఒకడైన ముకేశ్ క్షమాభిక్ష పిటిషన్ రూపంలో శిక్ష అమలుకు ఆటంకం ఏర్పడింది. ఆ తర్వాత ఫిబ్రవరి 1న ఉరితీయాల్సి ఉండగా.. దీనికి రెండు రోజుల ముందు జనవరి 30న దోషులు మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దోషులు నలుగురు అన్ని న్యాయపరమైన అవకాశాలు వినియోగించుకునే వరకు ఉరిశిక్షపై స్టే విధించాలని అభ్యర్థించారు. దీనికి న్యాయస్థానం అంగీకరించడంతో ఉరి అమలు రెండోసారి వాయిదా పడింది.
ఆ తర్వాత దోషులకు హైకోర్టు ఇచ్చిన గడువు ముగియడం.. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు ఇటీవల దిల్లీ కోర్టు మూడోసారి డెత్ వారెంట్ జారీ చేసింది. మార్చి 3వ తేదీ ఉదయం ఆరు గంటలకు దోషులను ఉరితీయాలని ఆదేశించింది. ఉరి అమలు దగ్గరపడుతున్న సమయంలో దోషుల్లో ఒకడైన పవన్ గుప్తా మరోసారి కోర్టుకు వెళ్లాడు. తన శిక్షను యావజ్జీవ శిక్షకు తగ్గించాలని కోరుతూ క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేశాడు. అయితే అతడి అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చింది.
ఉరిపై ఇంకా సందిగ్ధతే..
ఈ కేసులోని నలుగురు దోషుల్లో ముగ్గురు ఇప్పటికే అన్ని న్యాయపరమైన అవకాశాలను వినియోగించుకున్నారు. రాష్ట్రపతి క్షమాభిక్షకు కూడా దరఖాస్తు చేస్తున్నారు. వాటిని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తిరస్కరించారు. పవన్ గుప్తా ఒక్కడే తాజాగా క్యురేటివ్ పిటిషన్ వేయగా.. దాన్ని కోర్టు కొట్టేసింది. అయితే అతడికి ఇంకా క్షమాభిక్ష పెట్టుకునే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. మరో దోషి అక్షయ్ కుమార్ రెండోసారి రాష్ట్రపతికి క్షమాభిక్ష దరఖాస్తు పెట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో ఉరి అమలుపై స్టే విధించాలని కోరుతూ అక్షయ్ పటియాల హౌస్కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై నేడు విచారణ జరుగుతోంది. దీంతో ఉరితీతపై అనేక అనుమానాలు నెలకొన్నాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.