Antilia Case: అంబానీని భయపెట్టేందుకే.. ఆయన ఇంటి ముందు పేలుడు పదార్థాలు!

అంబానీల మదిలో భయాన్ని కల్పించాలనే ఉద్దేశంతో మాజీ పోలీసు అధికారి సచిన్‌ వాజే (Sachin Vaze) ఆయన ఇంటి ముందు పేలుడు పదార్థాలు పెట్టినట్లు ఎన్‌ఐఏ విచారణలో తేలింది.

Published : 22 Sep 2023 19:59 IST

ముంబయి: ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్‌ అంబానీ (Mukesh Ambani) ఇంటి సమీపంలో పేలుడు పదార్థాలతో ఉన్న వాహనం కనిపించిన ఘటన రెండేళ్ల క్రితం సంచలనం సృష్టించింది. అయితే, అంబానీల మదిలో భయాన్ని రేకెత్తించాలనే ఉద్దేశంతోనే మాజీ పోలీసు అధికారి సచిన్‌ వాజే (Sachin Vaze) వాటిని పెట్టినట్లు విచారణలో తేలింది. ఇదే విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న ఎన్‌ఐఏ కోర్టు.. నిందితుడు సచిన్‌ వాజేకు బెయిల్‌ ఇచ్చేందుకు నిరాకరించింది.

అంబానీ కుటుంబీకులను భయభ్రాంతులకు గురిచేసేందుకు మాజీ పోలీసు అధికారి సచిన్‌ వాజే ప్రయత్నించినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏ వెల్లడించింది. ఈ క్రమంలో యాంటిలియా (అంబానీ ఇల్లు) సమీపంలో జిలెటిన్‌ స్టిక్స్‌ పెట్టినట్లు గుర్తించింది. అయితే, వాటిని డిటోనేటర్‌కు అమర్చలేదని ఎన్‌ఐఏ తెలిపింది. దీంతో ఎన్‌ఐఏ ప్రత్యేక న్యాయమూర్తి ఏఎం పాటిల్‌.. సచిన్‌ వాజేకు బెయిల్‌ నిరాకరిస్తూ సెప్టెంబర్ 16న ఆదేశాలు జారీచేశారు. ఇందుకు సంబంధించిన ఆర్డర్‌ కాపీలు శుక్రవారం అందుబాటులోకి వచ్చాయి.

ఆ పేలుడు పదార్థాలు కొన్నది సచిన్‌ వాజేనే

ఫిబ్రవరి 25, 2021లో దక్షిణ ముంబయిలోని అంబానీ నివాసం సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు పేలుడు పదార్థాలతో కూడిన వాహనం పార్క్‌ చేయడం కలకలం సృష్టించింది. దర్యాప్తు చేపట్టిన ముంబయి పోలీసులు.. సీసీటీవీ రికార్డుల్లో చూసి ఆ వాహనాన్ని నిలిపిన వ్యక్తి పీపీఈ కిట్‌ వేసుకున్నట్లుగా గుర్తించారు. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన ఎన్‌ఐఏ.. ఆ వ్యక్తి మాజీ పోలీస్‌ అధికారి సచిన్‌ వాజేనేనని, అంబానీలను భయపెట్టేందుకు ఆయన కుట్ర పన్నినట్లు తేల్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని