Macron: గణతంత్ర వేడుకలు.. భారత్‌కు చేరుకున్న ఫ్రాన్స్‌ అధ్యక్షుడు

ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మెక్రాన్‌ భారత్‌కు చేరుకున్నారు. దిల్లీలో గణతంత్ర వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

Published : 25 Jan 2024 16:22 IST

జైపుర్‌: ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మెక్రాన్‌ (Emmanuel Macron) భారత్‌కు చేరుకున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం మధ్యాహ్నం ఆయన రాజస్థాన్‌ రాజధాని జైపుర్‌లో అడుగుపెట్టారు. విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌, రాష్ట్ర గవర్నర్‌ కల్‌రాజ్‌ మిశ్రా, సీఎం భజన్‌లాల్‌ శర్మ ఆయనకు స్వాగతం పలికారు. శుక్రవారం దిల్లీలో నిర్వహించనున్న గణతంత్ర వేడుకలకు (Republic Day) మెక్రాన్‌ ముఖ్య అతిథిగా హాజరుకానున్న విషయం తెలిసిందే.

గణతంత్ర కవాతుకు భారీ బందోబస్తు

జైపుర్‌ సమీపంలోని ఆమెర్‌ కోటను మెక్రాన్‌ సందర్శించనున్నట్లు సమాచారం. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపుపొందిన ‘జంతర్ మంతర్’ వద్దకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనతో కలిసి రానున్నారు. అనంతరం అక్కడినుంచి సంగనేరి గేట్ వరకు వీరిద్దరూ రోడ్‌ షోలో పాల్గొంటారు. మధ్యలో హవా మహల్‌ వద్ద జైపుర్‌ స్పెషల్‌ మసాలా చాయ్‌ ఆస్వాదించనున్నట్లు తెలుస్తోంది. అక్కడే యూపీఐ చెల్లింపుల ద్వారా హస్త కళాకృతులు కొనుగోలు చేయనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. రాంబాగ్ ప్యాలెస్‌లో మెక్రాన్ కోసం ప్రత్యేక విందు ఏర్పాటుచేశారు.

గణతంత్ర వేడుకలకు తొలుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను ఆహ్వానించగా, వివిధ కారణాల వల్ల ఈ కార్యక్రమానికి హాజరుకాలేనని బైడెన్‌ చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్‌ అధ్యక్షుడిని ఆహ్వానించగా ఆయన అంగీకరించారు. గతేడాది జులైలో పారిస్‌లో నిర్వహించిన ఫ్రాన్స్‌ జాతీయ దినోత్సవ ‘బాస్టిల్‌ డే’ పరేడ్‌లో ప్రధాని మోదీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని