ఐదేళ్లలో 42% పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధర

గత ఐదేళ్లలో ఎల్‌పీజీ సిలిండర్‌ ధర 42% పెరగ్గా, ప్రభుత్వం ప్రజలకు అందించే సబ్సిడీ మొత్తం 92% తగ్గింది. రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే అడిగిన ప్రశ్నకు కేంద్ర పెట్రోలియంశాఖ సహాయమంత్రి రామేశ్వర్‌ పలు వివరాలతో సమాధానమిచ్చారు.

Updated : 07 Feb 2023 05:15 IST

92% తగ్గిన ప్రభుత్వ రాయితీ

ఈనాడు, దిల్లీ:  గత ఐదేళ్లలో ఎల్‌పీజీ సిలిండర్‌ ధర 42% పెరగ్గా, ప్రభుత్వం ప్రజలకు అందించే సబ్సిడీ మొత్తం 92% తగ్గింది. రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే అడిగిన ప్రశ్నకు కేంద్ర పెట్రోలియంశాఖ సహాయమంత్రి రామేశ్వర్‌ పలు వివరాలతో సమాధానమిచ్చారు. 2018 జనవరి 1 నాడు 14.2 కేజీల గృహావసర ఎల్‌పీజీ సిలిండర్‌ ధర రూ.741 ఉండగా, 2023 ఫిబ్రవరి 1 నాటికి అది రూ.1,053 (42.10%)కి  చేరినట్లు కేంద్రమంత్రి తెలిపారు. ఎల్‌పీజీపై కేంద్ర ప్రభుత్వం అందించే సబ్సిడీ 2017-18లో రూ.23,464 కోట్లమేర ఉండగా, 2021-22లో అది రూ.1,811 కోట్లకు తగ్గినట్లు వెల్లడించారు. ఐదేళ్లలో ఎల్‌పీజీ సబ్సిడీ పొందే వారి సంఖ్య 20,21,20,070 నుంచి 28,36,77,886 (40.35%పెరుగుదల)కి చేరినట్లు తెలిపారు.

కేంద్ర పెట్రో ఆదాయం 5 ఏళ్లలో 46% పెరుగుదల...  రాష్ట్రాలకు పెరిగింది 36%

పెట్రో ఉత్పత్తులపై విధిస్తున్న పన్నుల కారణంగా కేంద్ర ప్రభుత్వ ఖజానాకు చేరే ఆదాయం గత ఐదేళ్లలో 46% పెరగ్గా, రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయం మాత్రం 36% మాత్రమే పెరిగిందని  సహాయమంత్రి రామేశ్వర్‌ మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 2017-18 నుంచి 2021-22 మధ్యకాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కలిపి పెట్రో ఉత్పత్తుల ద్వారా రూ.31,21,173 కోట్ల ఆదాయం వచ్చింది. ఇందులో కేంద్ర ప్రభుత్వ ఖజానాకు రూ.19,65,891 కోట్లు చేరగా, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.11,55,282 ఆదాయం చేకూరినట్లు తెలిపారు. 2017-18లో కేంద్ర ఖజానాకు రూ.3,36,163 ఆదాచం రాగా, 2021-22నాటికి రూ.4,92,303 కోట్లకు పెరిగినట్లు చెప్పారు. రాష్ట్రాల ఆదాయం ఇదే సమయంలో రూ.2,06,863 కోట్ల నుంచి రూ.2,82,122 కోట్లకు చేరినట్లు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని