దిల్లీ నుంచి చండీగఢ్‌కు లారీలో రాహుల్‌గాంధీ

కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ లారీలో ప్రయాణించి అందరినీ అశ్చర్యపరిచారు. దిల్లీ నుంచి చండీగఢ్‌ వరకూ 250 కి.మీ.ల మేర ఆయన ప్రయాణం సోమవారం రాత్రంతా సాగింది.

Updated : 24 May 2023 06:43 IST

250 కి.మీ. రాత్రంతా ప్రయాణం
డ్రైవర్ల సమస్యలను విన్న నేత

చండీగఢ్‌, దిల్లీ: కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ లారీలో ప్రయాణించి అందరినీ అశ్చర్యపరిచారు. దిల్లీ నుంచి చండీగఢ్‌ వరకూ 250 కి.మీ.ల మేర ఆయన ప్రయాణం సోమవారం రాత్రంతా సాగింది. శిమ్లాలో విశ్రాంతి తీసుకుంటున్న తన తల్లి సోనియా గాంధీని కలిసేందుకు సోమవారం రాత్రి రాహుల్‌ బయలు దేరారు. దిల్లీలో ఆయన లారీ ఎక్కారు. డ్రైవరుతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఒక ధాబా దగ్గర ఆగారు. అక్కడ డ్రైవర్లతో సమావేశమై సమస్యలను విన్నారు. రాహుల్‌ ప్రయాణానికి సంబంధించిన ఫొటోలను, వివరాలను కాంగ్రెస్‌ పార్టీ మంగళవారం హిందీలో చేసిన ట్వీట్‌లో వెల్లడించింది. లారీ డ్రైవర్ల మన్‌కీ బాత్‌ను ఆయన విన్నారని పేర్కొంది. ‘రాహుల్‌ గాంధీ విలక్షణమైన వ్యక్తి. దేశంలో సామాన్యులకు, ప్రభుత్వానికి మధ్య పెరుగుతున్న దూరాన్ని సరిచేసేందుకు ప్రయత్నించారు. అంత వేడిలోనూ ఆయన లారీలో కూర్చుని రాత్రంతా ప్రయాణించారు. డ్రైవర్ల సమస్యలను విన్నారు. వారిలో భవిష్యత్తుపై ఇంకా ఆశ మిగిలే ఉంది’ అని కాంగ్రెస్‌ సోషల్‌ మీడియా విభాగాధిపతి సుప్రియా శ్రీనేథ్‌ పేర్కొన్నారు. చండీగఢ్‌ జాతీయ రహదారిపై అంబాలాలోని మంజీ సాహిబ్‌ గురుద్వారావద్ద తెల్లవారుజామున 4.30 గంటలకు రాహుల్‌ లారీ దిగారు. గురుద్వారాలోకి వెళ్లి ప్రార్థన చేశారు. అక్కడే లంగర్‌లో టీ తాగి లారీ ఎక్కి చండీగఢ్‌కు వెళ్లారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని