భారత్‌కు తిరిగి రానున్న శివాజీ ‘పులి గోళ్లు’!

ఛత్రపతి శివాజీ 17వ శతాబ్దంలో ఉపయోగించినట్లుగా భావిస్తున్న ‘పులి గోళ్లు(వాఘ్‌ నఖ్‌)’ లాంటి ఆయుధం భారత్‌కు తిరిగి రానుంది.

Updated : 02 Oct 2023 07:26 IST

మహారాష్ట్రలో ప్రత్యేక ప్రదర్శనకు ఏర్పాట్లు

ముంబయి: ఛత్రపతి శివాజీ 17వ శతాబ్దంలో ఉపయోగించినట్లుగా భావిస్తున్న ‘పులి గోళ్లు(వాఘ్‌ నఖ్‌)’ లాంటి ఆయుధం భారత్‌కు తిరిగి రానుంది. ప్రస్తుతం లండన్‌లోని విక్టోరియా అండ్‌ ఆల్బర్ట్‌(వీ అండ్‌ ఏ) మ్యూజియంలో ఇది ఉంది. ఈ ఏడాదితో శివాజీ పట్టాభిషేకం జరిగి 350 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా లండన్‌ నుంచి తీసుకొచ్చి మూడేళ్లపాటు పలుచోట్ల ప్రదర్శించనున్నారు. ఈ మేరకు మహారాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి సధీర్‌ ముంగంటివార్‌ లండన్‌లోని మ్యూజియంతో మంగళవారం ఒప్పందం చేసుకోనున్నారు. 1659లో జరిగిన యుద్ధంలో బీజాపుర్‌ సైన్యానికి చెందిన కమాండర్‌ అఫ్జల్‌ ఖాన్‌ను శివాజీ ఈ ఆయుధాన్ని ఉపయోగించే చంపారని చరిత్రకారులు చెబుతున్నారు. ఆ తర్వాత ఆ ఆయుధం 1818లో సతారా స్టేట్‌కు ఈస్టిండియా కంపెనీ తరఫున రెసిడెంట్‌ అధికారిగా ఉన్న జేమ్స్‌ గ్రాంట్‌ డఫ్‌ అధీనంలోకి వెళ్లిందని, అతని వారసుల ద్వారా  వీ అండ్‌ ఏ మ్యూజియానికి చేరిందని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆ ఆయుధానికి అమర్చిన ఫలకంపై ప్రస్తావించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని