భారత్‌కు సాయంచేయనున్న అమెరికా ఫార్మాదిగ్గజం

భారత్‌లో మరిన్ని రెమ్‌డెసివిర్‌ డోసులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు అమెరికా ఫార్మా దిగ్గజం గిలీడ్‌ వెల్లడించింది. కరోనా విలయంతో భారత్‌లోని ఆరోగ్య వ్యవస్థలన్నీ ఇబ్బందుల్లోకి జారుకున్న వేళ....

Updated : 21 Dec 2022 14:44 IST

4.5 లక్షల రెమ్‌డెసివిర్‌ వయల్స్‌ను ఇవ్వనున్న గిలీద్‌

వాషింగ్టన్‌: భారత్‌లో మరిన్ని రెమ్‌డెసివిర్‌ డోసులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు అమెరికా ఫార్మా దిగ్గజం గిలీద్‌ వెల్లడించింది. కరోనా విలయంతో భారత్‌లోని ఆరోగ్య వ్యవస్థలన్నీ ఇబ్బందుల్లోకి జారుకున్న వేళ మహమ్మారిపై ప్రభావవంతమైన ఔషధంగా పేరొందిన రెమ్‌డెసివిర్‌ను భారత్‌లో అందుబాటులోకి తీసుకురావడం సరైన చర్యగా గిలీద్‌ సీఎస్‌ఓ జొహాన్నా మెర్సియర్‌ తెలిపారు. భారత్‌లో రెమ్‌డెసివిర్‌ ఉత్పత్తికి సంబంధించి స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన తమ భాగస్వాములకు లైసెన్స్‌ జారీ సహా రెమ్‌డెసివిర్‌ ఉత్పత్తిని వేగవంతం చేయడంలో సహకరించే ఏపీఐని కూడా వితరణ చేయనున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా 4.5 లక్షల రెమ్‌డెసివిర్‌ వెక్లూరీ వయల్స్‌ కూడా ఉచితంగా అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మెర్సియర్‌ వివరించారు. గిలీద్‌ లైసెన్స్‌ పొందిన సంస్థలు భారత్‌లో ఏడు ఉన్నాయని.. అవి రెమ్‌డెసివిర్‌ ఉత్పత్తిని వేగవంతం చేస్తాయని పేర్కొన్నారు.

భారత్‌లో కరోనా ఉగ్రరూపం  దాల్చిన వేళ పలు దేశాలు భారత్‌కు సాయమందించేందుకు ముందుకొస్తున్నాయి. భారత్‌కు అన్నివేళలా అండగా ఉంటామని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌, ఉపాధ్యక్షురాలు కమలాహారిస్‌ ప్రకటించారు. ప్రధాని మోదీతోనూ బైడెన్‌ ఫోన్‌లో చర్చించారు. అమెరికాలోని వాణిజ్య వర్గాలు సైతం ఏకమయ్యాయి. 40 కంపెనీలు ఓ కార్యదళంగా ఏర్పడ్డాయి. కొన్ని వారాల్లోనే 20 వేల ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లను భారత్‌కు పంపాలని నిర్ణయించాయి. బ్రిటన్‌ ప్రభుత్వం వేగంగా స్పందించి 100 వెంటిలేటర్లు, 95 ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లను భారత్‌కు పంపించింది. ఈ వారంలోనే మరికొన్ని వైద్య పరికరాలు పంపనున్నట్లు తెలిపింది. ఫ్రాన్స్‌ సైతం భారత్‌కు బాసటగా నిలిచింది. అవసరమైన ఔషధాలు, ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్లాంట్లు, వెంటిలేటర్లు పంపనున్నట్లు ప్రాన్స్‌ విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. వారం రోజుల్లోగా ఇవి భారత్‌కు చేరనున్నట్లు తెలిపింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని