Chandigarh University: ఆ ఒక్క విద్యార్థిని వీడియోనే లీకైంది.. ఆ వార్తలన్నీ రూమర్లే: పోలీసులు

పంజాబ్‌ మొహాలీలోని చండీగఢ్‌ వర్సిటీలో కొందరు విద్యార్థినుల అభ్యంతరకర వీడియోలు సామాజిక మాధ్యమాల్లో  వైరల్‌గా మారాయన్న వార్తలు తీవ్ర కలకలం.....

Published : 18 Sep 2022 17:11 IST

దిల్లీ: పంజాబ్‌ మొహాలీలోని చండీగఢ్‌ వర్సిటీలో కొందరు విద్యార్థినుల అభ్యంతరకర వీడియోలు సామాజిక మాధ్యమాల్లో  వైరల్‌గా మారాయన్న వార్తలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. విద్యార్థినుల ఆందోళనలతో వర్సిటీ అట్టుడుకుతోంది. ఓ విద్యార్థిని తన సహచరుల ప్రైవేటు వీడియోలను వేరే యూనివర్సిటీకి చెందిన స్నేహితుడికి పంపగా.. అతడు ఇంటర్నెట్‌లో అప్‌లోడ్‌ చేసినట్టు గుప్పుమన్న వార్తలు దుమారం రేపుతున్నాయి. పలువురు విద్యార్థినుల వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయంటూ వస్తోన్న ఆరోపణల్ని యూనివర్సిటీ అధికారులు, పోలీసులు ఖండిస్తున్నారు. అవన్నీ అవాస్తవాలేనని.. ఒక విద్యార్థిని తన సొంత వీడియోను హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన వ్యక్తితో షేర్‌ చేసుకున్నట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలినట్టు చెబుతున్నారు. అయితే, ఆ విద్యార్థినిని ఇప్పటికే అరెస్టు చేసినట్టు మొహాలీ సీనియర్‌ ఎస్పీ వివేక్‌ శీల్‌ సోనీ వెల్లడించారు. నిందితురాలిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్టు తెలిపారు. 

విద్యార్థినుల పర్సనల్‌ వీడియోలు లీక్‌ అయినట్టు వార్తలు వచ్చాక కొందరు విద్యార్థినులు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారంటూ సోషల్‌ మీడియాలో వచ్చిన పోస్టుల్ని కొట్టిపారేశారు. ఆ నిందితురాలు ఎవరికైతే వీడియో పంపిందో అతడిని కూడా అరెస్టు చేసేందుకు ప్రత్యేక పోలీసు బృందం సిమ్లాకు వెళ్లినట్టు ఏడీజీపీ గుర్‌ప్రీత్‌ కౌర్‌ దేవ్‌ వెల్లడించారు. ఇప్పటివరకు జరిగిన తమ దర్యాప్తులో నిందితురాలు ఒకే ఒక్క వీడియోను మాత్రమే గుర్తించినట్టు చెప్పారు.  ఆమె ఇంకెవరి వీడియోలనూ రికార్డు చేయలేదని పోలీసులు స్పష్టంచేశారు. వర్సిటీలో పలు ఎలక్ట్రానిక్‌ పరికరాలు, మొబైల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకొని వాటిని ఫోరెన్సిక్‌ పరీక్ష కోసం పంపనున్నట్టు ఎస్పీ తెలిపారు. ఈ వీడియోల వార్తలు గుప్పుమన్న నేపథ్యంలో విద్యార్థినులు ఎవరూ ఆత్మహత్యకు ప్రయత్నించలేదని.. ఎవరూ రూమర్లు నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. ఒక విద్యార్థిని ఆందోళనకు గురై కుప్పకూలగా ఆమెను ఆస్పత్రికి తరలించినట్టు పోలీసులు వివరించారు. 

60ఎంఎంఎస్‌లంటూ వచ్చిన వార్తలు నిరాధారం

‘‘వర్సిటీలో విద్యార్థినులకు చెందిన 60 అభ్యంతరకర ఎంఎంఎస్‌లు వచ్చాయంటూ మీడియాలో వస్తోన్న వార్తలు పూర్తిగా అవాస్తవం, నిరాధారం. వర్సిటీ నిర్వహించిన ప్రాథమిక విచారణలో ఒక విద్యార్థిని తన బాయ్‌ఫ్రెండ్‌కు షేర్‌ చేసిన ఒక పర్సనల్‌ వీడియో తప్పితే మరే ఇతర విద్యార్థినికి చెందిన అభ్యంతరకర వీడియోలూ దొరకలేదు. విద్యార్థుల విజ్ఞప్తి మేరకు తదుపరి విచారణను పోలీస్‌ శాఖకు అప్పగించాం. అన్ని మొబైల్‌ ఫోన్లు, ఇతర మెటీరియల్‌ను పోలీసులకు అందజేశాం’’ అని చండీగఢ్‌ వర్సిటీ ప్రో వైస్‌ఛాన్సలర్‌ డాక్టర్‌ ఆర్‌ఎస్‌ బవా ఓ ప్రకటనలో వెల్లడించారు. 

తప్పుచేసినవారిపై కఠినచర్యలు: సీఎం మాన్‌

చండీగఢ్‌ వర్సిటీలో చోటుచేసుకున్న ఘటన గురించి విని బాధేసిందని పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ అన్నారు. దీనిపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించినట్టు చెప్పారు. మన  ఆడపిల్లలు మనందరికీ ఎంతో గర్వకారణమన్నారు. తప్పుచేసిన వారు ఎవరైనా కఠిన చర్యలు తప్పవన్నారు. నిరంతరం అధికారులతో టచ్‌లో ఉంటానని.. ఊహాగానాలను ఎవరూ నమ్మొద్దని విజ్ఞప్తి చేస్తూ  ఆయన ట్వీట్‌ చేశారు.

చాలా దురదృష్టకరం.. బాధ్యతతో ప్రవర్తించాలి: సోనూసూద్‌

చండీగఢ్‌ యూనివర్సిటీలో చోటుచేసుకున్న ఘటనపై ప్రముఖ సినీనటుడు సోనూసూద్‌ స్పందించారు. ఇది ఎంతో దురదృష్టకరమని.. అందరూ బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని కోరారు. మన సోదరీమణులకు అండగా నిలబడాల్సిన సమయమిదేనంటూ ట్వీట్‌ చేశారు. ‘‘చండీగఢ్‌ యూనివర్సిటీ ఘటన దురదృష్టకరం. మన సోదరీమణులకు అండగా నిలబడటంతో పాటు బాధ్యతాయుతమైన సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన సమయం. ఇది బాధితులకు కాదు.. మనందరికీ పరీక్షా సమయం. బాధ్యతతో వ్యవహరించాలి’’ అని సోనూ పేర్కొన్నారు.

ఎన్‌సీడబ్ల్యూ సీరియస్‌ 

ఇంకోవైపు, ఈ ఘటనను సీరియస్‌గా పరిగణిస్తున్నట్టు  జాతీయ మహిళా కమిషన్‌ (ఎన్‌సీడబ్ల్యూ) పేర్కొంది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఛైర్‌పర్సన్‌ రేఖా శర్మ పంజాబ్‌ డీజీపీ, చండీగఢ్‌ వర్సిటీ వీసీకి లేఖ రాశారని ఓ ప్రకటనలో తెలిపింది. అలాగే, ఈ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోందని పంజాబ్‌ రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ మనీశా గులాటీ తెలిపారు. ‘‘ఇది చాలా తీవ్రమైన అంశం.. దర్యాప్తు కొనసాగుతోంది. నిందితులను వదిలిపెట్టే ప్రసక్తేలేదని విద్యార్థుల తల్లిదండ్రులకు హామీ ఇస్తున్నాం’’ అని పేర్కొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని