విరాళంగా వచ్చిన 15వేల చెక్కులు బౌన్స్‌! 

అయోధ్యలో రామమందిరం నిర్మాణం కోసం దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున విరాళాలు సేకరించిన విషయం తెలిసిందే. అయితే, విరాళాల నిమిత్తం భక్తులు ఇచ్చిన .....

Published : 17 Apr 2021 01:52 IST

దిల్లీ: అయోధ్యలో రామమందిరం నిర్మాణం కోసం దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున విరాళాలు సేకరించిన విషయం తెలిసిందే. అయితే, విరాళాల నిమిత్తం భక్తులు ఇచ్చిన చెక్కుల్లో దాదాపు 15వేలకు పైగా చెక్కులు బౌన్స్‌ అయినట్టు వెల్లడైంది. వీటి విలువ సుమారు రూ.22 కోట్లకు పైనే ఉంటుందని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఆడిట్‌ నివేదికలో తేలింది. చెక్కులు ఇచ్చిన వారి ఖాతాల్లో తగిన నిల్వలు లేకపోవడంతో పాటు సంతకాలు సరిపోలకపోవడం, ఓవర్‌ రైటింగ్‌ వంటి సాంకేతిక సమస్యల కారణంగానే ఈ సమస్య ఉత్పన్నమైందని ట్రస్టు అధికారులు పేర్కొంటున్నారు. ఈ పొరపాట్లను సరిదిద్దేందుకు బ్యాంకులతో కలిసి పనిచేస్తున్నామని ట్రస్టు సభ్యుడు డాక్టర్‌ అనిల్‌ మిశ్రా తెలిపారు. చెక్కులు ఇచ్చిన వ్యక్తులు తమ పొరపాట్లను సరిదిద్దుకొనేందుకు బ్యాంకులు అవకాశం కల్పిస్తాయన్నారు.

ట్రస్టు కోశాధికారి స్వామి గోవింద్‌ దేవ్‌ గిరి మాట్లాడుతూ.. ఈ 15వేల చెక్కుల్లో దాదాపు 2వేల చెక్కులు అయోధ్య నుంచి సేకరించినవేనన్నారు. మిగతా 13వేల చెక్కులు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి విరాళాల రూపంలో సేకరించినవని వివరించారు. సమస్య తలెత్తిన చెక్కులను భక్తులకు తిరిగి పంపిస్తున్నామని, తాజాగా చెక్కులు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నట్టు చెప్పారు. జనవరి 15 నుంచి ఫిబ్రవరి 17 వరకు వీహెచ్‌పీ సహా పలు సంస్థలు అయోధ్యలో రామమందిరం నిర్మాణం కోసం దేశ వ్యాప్తంగా విరాళాలు సేకరించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని