PM Modi: ఎప్పటిలానే ఈ సారి క్లీన్‌స్వీప్ ఖాయం: ప్రధాని మోదీ

కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన నేషనల్‌ క్రియేటర్స్ అవార్డులను విజేతలకు భారత మండపంలో ప్రధాని మోదీ అందజేశారు.

Updated : 08 Mar 2024 17:37 IST

దిల్లీ: 2014, 2019 ఎన్నికల ఫలితాలనే ఈ సారి పునరావృతం చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. శుక్రవారం దిల్లీలోని భారత మండపం (Bharat Mandapam)లో ‘నేషనల్‌ క్రియేటర్స్‌ అవార్డు’ (National Creators Award)లను ఆయన అందజేశారు. సృజనాత్మక వీడియోలు, కథనాలతో సమాజంలో మార్పు కోసం కృషి చేస్తున్న కంటెంట్‌ క్రియేటర్స్‌ను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డులను నూతనంగా ప్రవేశపెట్టింది. ‘‘స్టోరీ టెల్లింగ్‌, సామాజిక మార్పు, పర్యావరణ పరిరక్షణ, విద్య, గేమింగ్‌ వంటి వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన వారిని గుర్తించి,  ప్రోత్సహించడమే ఈ అవార్డుల ముఖ్య ఉద్దేశం’’ అని ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

‘‘మహిళా దినోత్సవం, శివరాత్రి రోజున ఈ అవార్డులను ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉంది. విజేతలకు నా అభినందనలు. సృజనాత్మకతతో ఈ రోజు మీరంతా ఇక్కడిదాకా చేరుకున్నారు. భారత్‌ భవిష్యత్తు గురించి చర్చించేందుకే మనమంతా ఇక్కడ సమావేశమయ్యాం. పరిస్థితులకు అనుగుణంగా వచ్చే మార్పులను స్వీకరించడం మన బాధ్యత. తక్కువ ధరకు డేటా, మొబైల్‌ ఫోన్లు లభిస్తుండటంతో ఎంతో మంది కంటెంట్‌ క్రియేటర్లకు అవకాశం లభిస్తోంది. ఈ అవార్డులు దేశంలోని ప్రతి యువ కంటెంట్ క్రియేటర్‌ ప్రతిభకు నిదర్శనం. గత ఎన్నికల్లో మాదిరే ఈ సారి భాజపా క్లీన్‌స్వీప్‌ చేస్తుంది. అదే మా లక్ష్యం’’ అని ప్రధాన మోదీ అన్నారు. ఈ సందర్భంగా స్వచ్ఛ అంబాసిడర్‌ అవార్డు అందుకున్న మల్హర్‌ కలాంబేను ఉద్దేశించి ‘సన్నగా కనిపిస్తున్నావ్‌.. బాగా తినాలి’ అని సరదాగా వ్యాఖ్యానించారు.

ఈ అవార్డుల కోసం 20 విభాగాల్లో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 1.5 లక్షల నామినేషన్స్ వచ్చాయి. వారికి మద్దతుగా పది లక్షల మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. అందులోంచి 23 మందిని విజేతలుగా ఎంపిక చేశారు. వీరిలో ముగ్గురు అంతర్జాతీయ క్రియేటర్స్ ఉన్నారు. మోస్ట్‌ క్రియేటివ్‌ క్రియేటర్‌ అవార్డును మహిళల విభాగంలో శ్రద్ధ, పురుషుల విభాగంలో ఆర్జే రౌనాక్‌ అందుకున్నారు. 

విజేతల వివరాలివే..

గ్రీన్‌ ఛాంపియన్‌ - పంక్తి పాండే, స్టోరీ టెల్లింగ్‌ - కీర్తిక గోవింద్‌స్వామి, కల్చరల్‌ అంబాసిడర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ -  గాయని మైథిలి ఠాకూర్‌, సాంకేతికం -  గౌరవ్‌ చౌధురి, పర్యటకం - కామియా జానీ, సామాజిక మార్పు - జయ కిషోరి, ఫ్యాషన్‌ - జాన్వీ సింగ్, స్వచ్ఛ్‌ అంబాసిడర్‌ - మల్హర్‌ కలాంబే, బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ క్రియేటర్‌ - డ్రూ హిక్స్, డిస్‌రప్టర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ - రణవీర్‌ అల్హాబాదియా, సెలబ్రిటీ క్రియేటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ - అమన్‌ గుప్తా, నానో క్రియేటర్‌ - పీయూష్‌ పురోహిత్‌, మైక్రో క్రియేటర్‌ - అరిదమాన్‌, గేమింగ్‌ - నిశ్చయ్‌, ఫిట్‌నెస్‌ - అంకిత్‌ బైయన్‌పురియా, విద్య - నమన్‌ దేశ్‌ముఖ్‌, ఫుడ్‌ - కబితా సింగ్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని