Rahul Gandhi: అధికారంలోకి వస్తే.. MSPకి చట్టబద్ధత: రాహుల్‌ గాంధీ

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే.. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తామని ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ ప్రకటించారు.

Updated : 13 Feb 2024 20:00 IST

దిల్లీ: తమ డిమాండ్ల పరిష్కారం కోసం రైతన్నలు ‘దిల్లీ చలో’ (Farmers Protest) పేరుతో ఆందోళనలకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ (Congress) అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) కీలక ప్రకటన చేశారు. తాము అధికారంలోకి రాగానే పంటల కనీస మద్దతు ధర (MSP) హామీకి చట్టబద్ధత కల్పిస్తామని, స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులను అమలు చేస్తామని తెలిపారు. ‘‘దేశంలోని రైతులకు లబ్ధి చేకూరేలా.. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సుల మేరకు ఎంఎస్‌పీకి చట్టబద్ధత కల్పించాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. దీంతో రైతుల జీవితాల్లో మూడు కీలక మార్పులు జరుగుతాయి. పంటకు కచ్చితమైన ధర లభించడంతోపాటు అప్పుల బాధ తొలగిపోతుంది. రైతుల ఆత్మహత్యలు ఉండవు. వ్యవసాయం లాభసాటిగా మారి.. రైతులు సంపన్నులు అవుతారు. ఈ నిర్ణయం దేశంలోని 15 కోట్ల రైతుల కుటుంబాలకు భరోసా ఇస్తుంది. ఇది కాంగ్రెస్‌ తొలి హామీ. #KisaanNYAYGuarantee’’ అని రాహుల్‌ ట్వీట్ చేశారు. 

ఎందుకీ ‘దిల్లీ చలో’.. రైతన్నల ప్రధాన డిమాండ్లు ఏంటి?

మరోవైపు రైతులను అడ్డుకోవడంపై కాంగ్రెస్‌ పార్టీ కేంద్రంపై విమర్శలు గుప్పించింది. రైతుల అభ్యున్నతి కోసం పాటుపడిన చౌదరి చరణ్‌సింగ్‌, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్‌ స్వామినాథన్‌లకు కేంద్రం భారతరత్న అవార్డులను ప్రకటించిందని, అదే రైతులకు అన్యాయం చేస్తోందని కాంగ్రెస్‌ నేత జైరాం రమేష్‌ ఆరోపించారు. ఈ క్రమంలో రైతుల నిరసనలపై కేంద్ర మంత్రి అర్జున్ ముండా స్పందించారు. ఎంఎస్‌పీపై తక్షణమే చట్టం తీసుకురాలేమని, దీనిపై రైతు సంఘాలు చర్చలకు రావాలని కోరారు. కానీ, రైతు సంఘాల నాయకులు మాత్రం తమ డిమాండ్లు నెరవేరే వరకు వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని